ఎన్ఐఏ కొత్త బాస్ సదానంద్ వసంత్ దాతే
ABN, Publish Date - Mar 28 , 2024 | 03:36 AM
కేంద్ర దర్యాప్తు సంస్థ నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ(ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా బుధవారం సదానంద్ వసంత్ దాతే నియమితులయ్యారు.
26/11 దాడుల్లో వీరోచిత పోరాటం
న్యూఢిల్లీ, మార్చి 27: కేంద్ర దర్యాప్తు సంస్థ నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ(ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా బుధవారం సదానంద్ వసంత్ దాతే నియమితులయ్యారు. ఆయన మహారాష్ట్ర క్యాడర్కి చెందిన 1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్) చీఫ్గా ఉన్నారు. భారత్ను తీవ్రంగా కుదిపేసిన 26/11 దాడుల్లో ముష్కరులతో వీరోచితంగా పోరాడిన అధికారుల్లో దాతే ఒకరు. నాడు ముంబై సెంట్రల్ రీజియన్ అదనపు కమిషనర్గా ఉన్న దాతేకు... నగరంలో టెర్రరిస్టులు ప్రవేశించారని సమాచారం అందింది. వెంటనే ఆయన తన బృందంతో రంగంలో దిగారు. ఛత్రపతి శివాజీ టెర్మినల్కు సమీపంలో ఉన్న కామా ఆస్పత్రిని ముష్కరులు అజ్మల్, అతని సహాచరుడు అబు ఇస్మాయిల్ తమ అదుపులోకి తీసుకున్నారని తెలిసి దాతే బృందం వారిని ఎలాగైనా పట్టుకోవాలని నిశ్చయించుకొంది. ఆ క్రమంలో... శత్రువు గ్రేనేడ్లతో దాడి చేస్తున్నా సరే దాతే ధైర్యంగా కాల్పులు జరిపారు. గ్రేనేడ్ల ధాటికి శరీరమంతా గాయాలయైు, నెత్తురోడుతున్నా తాను మాత్రం బెదరలేదు. ఓపక్క ఇతర అధికారులకు సమాచారాన్ని చేరవేస్తూ... మరోపక్క ముష్కరులను కాల్పుల ద్వారా నిలువరిస్తూ గంటకు పైగా పోరాడి చివరకు తీవ్ర రక్తస్రావం కారణంగా స్పృహా కోల్పోయారు. అనంతరం అజ్మల్ కసబ్ సజీవంగా పోలీసులకు చిక్కిన సంగతి తెలిసిందే. దాతే అసమాన తెగువకు గానూ రాష్ట్రపతి పోలీసు సేవా పతకం దక్కింది.
Updated Date - Mar 28 , 2024 | 03:36 AM