Pakistan News: పాకిస్తాన్కి మరో గట్టి దెబ్బ.. ఆ సంస్థ వ్యవస్థాపకుడు హతం
ABN, Publish Date - Jan 07 , 2024 | 09:53 PM
గత కొన్ని నెలల నుంచి విదేశాల్లో, ముఖ్యంగా పాకిస్తాన్లో ఉగ్రవాదులు, భారత వ్యతిరేకులు హతమవుతున్నారు. ఎందుకు, ఎవరు చంపుతున్నారో ఎవరికీ అంతుపట్టడం లేదు. ఆ ప్రశ్నలకు సమాధానాలు వెతికేందుకు..
Masood-ur-Rehman Usmani: గత కొన్ని నెలల నుంచి విదేశాల్లో, ముఖ్యంగా పాకిస్తాన్లో ఉగ్రవాదులు, భారత వ్యతిరేకులు హతమవుతున్నారు. ఎందుకు, ఎవరు చంపుతున్నారో ఎవరికీ అంతుపట్టడం లేదు. ఆ ప్రశ్నలకు సమాధానాలు వెతికేందుకు ఇప్పటికే పాక్ దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. ఈ హత్యల వెనుక ఎవరున్నారు? కారణాలేంటి? అనే విషయాలపై విచారణ చేపట్టాయి. ఇంతలోనే తాజాగా పాకిస్తాన్కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సున్నీ ఉలేమా కౌన్సిల్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మౌలానా మసూద్ ఉర్ రెహ్మాన్ ఉస్మానీని ఇస్లామాబాద్లో కాల్చి చంపారు.
ఇస్లామాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజధాని శివార్లలోని ఘౌరీ టౌన్ పరిసరాల్లో మసూద్ ఉర్ రెహ్మాన్ను ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు పట్ట పగలే హతమార్చారు. ఈ దాడిలో అతని డ్రైవర్కి కూడా తీవ్రంగా గాయపడ్డాడని తెలిపారు. ఈ సంఘటనతో ఆ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఎందుకంటే.. పాకిస్తాన్లోని ఈ ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా చోటు చేసుకుంటాయి. ఒకరకంగా చెప్పాలంటే.. ఘౌరీ టౌన్ ప్రాంతం ఎలాంటి ఆందోళనలు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి ప్రదేశంలో మసూద్ హత్యకు గురవ్వడంతో స్థానికలు భయాందోళనలకు గురవుతున్నారు.
ఈ దాడి జరిగిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. ఉస్మానీ మృతదేహాన్ని, గాయపడిన డ్రైవర్ను పాకిస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు తరలించారు. అయితే.. ఈ దాడి ఎవరు చేశారన్న విషయంపై ఇప్పటివరకూ ఎలాంటి స్పష్టత రాలేదు. ఏ గ్రూపు కూడా ఈ దాడికి బాధ్యత తీసుకోలేదు. దీంతో.. పోలీసులు ఈ హత్యని సీరియస్గా తీసుకొని, చురుగ్గా దర్యాప్తు చేస్తున్నారు. దుండగులను గుర్తించడానికి, ట్రాక్ చేయడానికి క్లోజ్డ్-సర్క్యూట్ టీవీ ఫుటేజీని ఉపయోగిస్తున్నారు. స్థానికుల్ని కూడా ప్రశ్నించి, దుండగులకు సంబంధించిన సమాచారం సేకరించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
కాగా.. మసూద్ ఉర్ రెహ్మాన్కు భారత్ వ్యతిరేకిగా పేరుంది. ఇతడు ‘సిపా ఏ సాహిబా’ అనే సంస్థను ఏర్పాటు చేశాడు. అయితే.. ఈ సంస్థ అక్కడ వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా నిలవడంతో, దానిని పాకిస్తాన్ ప్రభుత్వం నిషేధించింది. పాక్లోని షియాలపై దాడుల్లో మసూద్ హస్తం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అతడి సంస్థ సంవత్సరాలుగా వేలాది మంది మరణాలకు కారణమైంది. భారత్పై అతడు ఎప్పుడూ విషం చిమ్ముతూనే ఉంటాడు. పాకిస్తాన్లో మత రాజకీయాల్ని ఉసిగొల్పడంలోనూ అతని హస్తం ఉంది.
Updated Date - Jan 07 , 2024 | 09:53 PM