ప్రత్యామ్నాయ పరిశోధనా భారతి
ABN, Publish Date - Oct 06 , 2024 | 12:19 AM
కొంత మంది కవి పండితులు జలపాతాల్లాగా పరవళ్ళు తొక్కుతారు. అతి కొద్ది మంది సాహితీవేత్తలు పంటకాలువలా నిశ్శబ్దంగా ప్రవహిస్తూ పాఠకుల హృదయ క్షేత్రాలపై పచ్చని సృజన సంతకం చేస్తారు. బీడు బారిన నేలమీద ఆవరించిన కంటకాలను...
కొంత మంది కవి పండితులు జలపాతాల్లాగా పరవళ్ళు తొక్కుతారు. అతి కొద్ది మంది సాహితీవేత్తలు పంటకాలువలా నిశ్శబ్దంగా ప్రవహిస్తూ పాఠకుల హృదయ క్షేత్రాలపై పచ్చని సృజన సంతకం చేస్తారు. బీడు బారిన నేలమీద ఆవరించిన కంటకాలను పంటకాలువ ప్రక్షాళన చేసినట్లు, జాతిని నిర్వీర్యం చేసే సాంస్కృతిక కాలుష్యాన్ని ఆ సృజనకారులు తమ రచనా వాహినితో శుద్ధి చేయటానికి ప్రయత్నిస్తారు. డాక్టర్ బోయి విజయభారతి పంటకాలువ లాంటి అరుదైన సాహితీమూర్తి. విలువైన రచనలతో దళిత తాత్త్వికతను మరింత విస్తృతపరచిన విదుషీమణి. రచయిత్రిగా, అనువాదకులుగా, సంపాదకులుగా, పరిశోధకురాలుగా తెలుగు అకాడమి సంచాలకులుగా విజయభారతి విశేష కృషి చేశారు. ప్రత్యామ్నాయ భావధారతో స్త్రీవాద, దళిత, బహుజన, సాహిత్యాలకు విజయభారతి వినూతన స్ఫూర్తినందించారు. అస్తిత్వ ఉద్యమాలకు ఆమె బలమైన సాహిత్య ఆలంబనగా నిలిచారు. అణగారిన వర్గాల సర్వతోముఖ వికాసానికి జీవితాంతం పాటుపడిన మహనీయుల జ్ఞాన వారసత్వాన్ని బాల్యం నుండే విజయభారతి అందిపుచ్చుకొని, ఆ మహోన్నత మూర్తుల ఆశయాలను తన సాహిత్యం ద్వారా ప్రచారం చేశారు. దళితుల విద్యావికాసానికి ఎంతగానో తోడ్పడిన ‘సంఘోద్ధారక’ బిరుదాంకితుడు గొల్ల చంద్రయ్య మనవరాలుగా, పద్మభూషణ్ డాక్టర్ బోయి భీమన్న కుమార్తెగా, ఆది ఆంధ్ర ఉద్యమ నాయకుడు బొజ్జా అప్పలస్వామి కోడలుగా జగమెరిగిన దళిత నేత బొజ్జా తారకం సహచరిగా పుట్టినింటి నుండి, మెట్టినింటి నుండి సముపార్జించుకున్న సామాజిక, సాహిత్య స్పృహతో విజయభారతి తనను తాను పుటం పెట్టుకున్నారు.
తూర్పు గోదావరి జిల్లా రాజోలులో హైస్కూల్ విద్య, కాకినాడలోని పిఠాపురం మహారాజా కళాశాలలో ఇంటర్ విద్య నభ్యసించిన విజయభారతి హైదరాబాద్లోని కోఠి మహిళా కళాశాలలో డిగ్రీ, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో యం.ఏ. పూర్తిచేశారు. ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం ప్రోత్సాహంతో, డాక్టర్ పల్లా దుర్గయ్య పర్యవేక్షణలో ‘దక్షిణ దేశీయాంధ్ర వాఙ్మయం–సాంఘిక పరిస్థితులు’ అనే అంశంపై విజయభారతి పరిశోధన చేసి, డాక్టరేట్ అందుకున్నారు.
కృష్ణా, గోల్కొండ పత్రికల్లో కథలు, వ్యాసాలు రాయడం, ఆకాశవాణిలో సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనటం ద్వారా విజయభారతి సృజన ప్రస్థానం ప్రారంభమయింది. ‘అంబేడ్కర్ జీవిత చరిత్ర’ అనే తొలి పుస్తకంతోనే విజయభారతి రచయిత్రిగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ‘ఈ పుస్తకం జీవిత చరిత్ర అయినా ఒక నవల వలె సాఫీగా సాగుతుందని, కొన్ని కొన్ని ఘట్టాలలో నాటకం వలే ముఖ్యదృశ్యాలను కళ్ళకు కట్టినట్లు చూపుతుందని విజయభారతి రచనా శైలిని నార్ల వెంకటేశ్వరరావు కొనియాడారు. ఈ పుస్తకానికి రాసిన ముందుమాటలో నార్ల చెప్పినట్లుగానే అంబేడ్కర్ జీవిత చరిత్ర పఠనయోగ్యంగా ఉండడంతో పాటు అశేష జనావళికి ఎంతో ప్రేరణ కలిగించింది.. ధనంజయ్ కీర్ రాసిన మహాత్మ జ్యోతిరావు ఫూలే జీవిత చరిత్రను తెలుగులోకి అనువదించి, తెలుగు సమాజంలో ఫూలే ఆదర్శాలకు, ఆశయాలకు, భావజాలవ్యాప్తికి విజయభారతి మార్గదర్శకంగా నిలిచారు. ఆమె రాసిన ఫూలే, అంబేడ్కర్ జీవిత చరిత్రలు ప్రజాస్వామ్యవాదులకు, దళిత బహుజన ఉద్యమకారులకు, నాయకులకు, కార్యకర్తలకు కరదీపికల్లా ఉపయోగపడ్డాయని చెప్పడం అతిశయోక్తికాదు.
విజయభారతి రచనల్లో తెలుగు సాహిత్య కోశం అపూర్వమైన గ్రంథం. నన్నయకు పూర్వం నుండి 1950 వరకు ఉన్న వెయ్యేళ్ళ సాహిత్యాన్ని పరిష్కరించారు. వేలాది కవుల వివరాలను సేకరించటంతో పాటు ఒక క్రమపద్ధతిలో వాటిని పొందుపరచి అచంచలమైన కృషితో ఆమె తెలుగుసాహిత్య కోశం రూపొందించారు. తెలుగు అకాడమి ఉద్యోగి శివనారయ్య సహకారంతో విజయభారతి సంపాదకత్వంలో రెండు భాగాలుగా వెలువడిన తెలుగు సాహిత్య కోశం ప్రాచీన, ఆధునిక కవులకు సంబంధించిన మౌలికమైన సమాచారాన్ని తెలుసుకోటానికి ప్రామాణికమైన ఆధార గ్రంథంగా నేటికీ ఉపయోగపడుతుంది. సాహిత్య కోశంలో అనేక తప్పులున్నాయని పనిగట్టుకొని కొంతమంది పండితులు నిరాధారమైన ఆరోపణలు చేశారు. అసూయతో కూడిన ఈ నిందారోపణలు అకాడమీకే పరిమితం కాకుండా చివరకు అసెంబ్లీని కూడా తాకాయి! అప్పటి ముఖ్యమంత్రి సూచనలతో ఏర్పడిన ప్రత్యేక కమిటీ ఈ విమర్శలను త్రోసిపుచ్చింది.
శాస్త్రసాంకేతిక విజ్ఞానం వేగంగా విస్తరిస్తున్న సందర్భంలో అందుకు ప్రతిబంధకంగా ఉన్న భావ వాతావరణ పరిస్థితులపై విజయభారతి అక్షర యుద్ధం చేశారు. ప్రగాఢ చింతనాభరితమైన తన సాహిత్యం ద్వారా ఆమె ఈ కాలానికి అవసరమైన వైజ్ఞానిక స్ఫూర్తిని అందించారు. ‘సత్య హరిశ్చంద్రుడు’, ‘షట్చక్రవర్తులు’, ‘దశావతారాలు’ ‘పురాణాలు–మరోచూపు’, ‘వ్యవస్థను కాపాడిన రాముడు’, ‘ఇతిహాసాలు–రామకథ’, ‘ఇతి హాసాలు–మహాభారతం’ వంటి పుస్తకాలు విజయభారతి ప్రత్యామ్నాయ పరిశోధనాదృష్టికి తార్కాణంగా నిలుస్తాయి. పురాణ కథలను, రామాయణ, మహాభారతాలను దళిత దృక్పథంలో నుండి విజయభారతి పునర్మూల్యాంకనం చేశారు. కులం, జెండర్ కేంద్రంగా ప్రాచీన సాహిత్యాన్ని విలక్షణంగా పరిశీలించారు. ఆశ్రమ ధర్మాల కంటే వర్ణాశ్రమ ధర్మాలను పటిష్టంగా అమలు చేయడంపైనే షట్చక్రవర్తులు శ్రద్దవహించారని వర్ణవ్యవస్థను సుస్థిరంగా కాపాడే భావజాలాన్ని విస్తృతంగా ప్రచారం చేశారని విజయభారతి విశ్లేషించారు.. కులవ్యవస్థను రక్షించడం, తదనుగుణమైన ఆలోచనలను ప్రచారం చేయడం, వాటిని తప్పనిసరిగా పాటించాలని ప్రబోధించటం హరిశ్చంద్రుని కథ లక్ష్యం (షట్చక్రవర్తులు) అని ఆమె సూత్రీకరించారు. భద్ర మహిళలను మర్యాదగా అవమానించటం, కింది జాతి స్త్రీలను నీచంగా, పరుషంగా అవమానించటం, జాతి వైరాన్ని ఇతర వైరాలను స్త్రీలమీద తీర్చుకోవటం పురాణాల్లోనూ, సాహిత్యంలో కనిపిస్తుందని విజయభారతి విమర్శించారు. మహాభారతాన్ని సమకాలీన సామాజిక దృష్టితో పరిశీలిస్తూ విజయభారతి రచించిన ‘నరమేధాలు నియోగాలు’ లోతైన పరిశోధనాగ్రంథం. మహాభారతంలోని సర్పయాగమూ, రాక్షస మేధమూ, ఖాండవ దహనమూ, శత్రువులను మూకుమ్మడిగా హతమార్చిన సంఘటనల తీరుతెన్నులను ఈ గ్రంథంలో విజయభారతి సోదాహరణంగా చర్చించారు. పురాణ కథలను పరమ సత్యాలుగా పవిత్ర విషయాలుగా విశ్వసించేవారు వాటిలోని అంతరార్థాలను కూడా గ్రహించాలని ఆమె సూచించారు. అరుంధతీ వశిష్టులను ఆదర్శదంపతులుగా భావించే సమాజం, వర్ణాంతర వివాహాలను ఎందుకు అంగీకరించలేకపోతున్నదని విజయభారతి నిశితంగా ప్రశ్నించారు. జ్ఞాన సమాజం కులాల సమాజంగా ఎందుకు రూపాంతరం చెందిందని ఆమె నిలదీశారు.
పౌరహక్కుల నేతగా దళిత నాయకుడిగా, ప్రజాన్యాయవాదిగా ప్రఖ్యాతిగాంచిన తన జీవన సహచరుడు బొజ్జా తారకం వివిధ సందర్భాలలో రాసిన వ్యాసాలు, కవితలు, మిగతా రచనలను శ్రద్ధతో సేకరించి గనుమల జ్ఞానేశ్వర్ సహకారంతో తన సంపాదకత్వంలో ఆమె ప్రచురించారు. తారకం ఉద్యమ, తాత్త్విక కార్యాచరణకు విజయభారతి బాసటగా నిలబడ్డారు. ఆమె ఎంతో ఇష్టపడి, శ్రమకోర్చి రాసుకున్న దళిత సాహిత్య వికాసం, ఆత్మగౌరవ పోరాటాలు, విజయాత్మకథ లాంటి అముద్రిత రచనలను ప్రచురిస్తే విజయభారతి సాహిత్య ఔన్నత్యం సంపూర్ణంగా అర్థమవుతుంది. అరుదైన ఈ సాహితీమూర్తి అందించిన సృజన స్ఫూర్తిని ఆచరణాత్మకంగా ముందుకు తీసుకుపోవటమే విజయభారతికి ఘనమైన నివాళి.
డాక్టర్ కోయి కోటేశ్వరరావు
Updated Date - Oct 06 , 2024 | 12:19 AM