మెడికల్ సీట్ల పెంపునకు వెసులుబాటు కల్పించండి
ABN, Publish Date - Nov 05 , 2024 | 02:38 AM
రాష్ట్రంలో మెడికల్ సీట్లు పెంపునకు వెసులుబాటు కల్పించండి. అందుకు అడ్డుగా ఉన్న 10 లక్షల జనాభాకు 100 మెడికల్ సీట్ల నిబంధనను సవరించండి’
విశాఖలో నైపర్ను త్వరగా ఏర్పాటు చేయండి
కేంద్ర మంత్రి నడ్డాకు ఎంపీ లావు విజ్ఞప్తి
న్యూఢిల్లీ, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో మెడికల్ సీట్లు పెంపునకు వెసులుబాటు కల్పించండి. అందుకు అడ్డుగా ఉన్న 10 లక్షల జనాభాకు 100 మెడికల్ సీట్ల నిబంధనను సవరించండి’ అని టీడీపీ లోక్ సభాపక్ష నేత లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు. సోమవారం ఢిల్లీలోని నడ్డా కార్యాలయంలో ఆయనను ఎంపీ లావు కలిసి ఈమేరకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రాష్ర్టానికి సంబంధించిన పలు సమస్యలను వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(నైపర్) త్వరగా ఏర్పాటు చేయాలని కోరాను. భూమి కేటాయింపు, బదలాయింపుతో పాటు, అన్ని విధాలుగా సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేశా. గల్ఫ్ దేశాలకు వెళ్లే వారికి చెయ్యాల్సిన ఆరోగ్య పరీక్ష కేంద్రాలను ఉత్తరాంధ్రలో లేదా రాయలసీమలో ఏర్పాటు చేయాలని కోరాను. పాత 13 జిల్లాల్లోనే కాకుండా కొత్తగా ఏర్పడిన జిల్లాల్లోనూ క్రిటికల్ కేర్ యూనిట్లు ఏర్పాటు చేయాలని విన్నవించా. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు’’ అని తెలిపారు.
Updated Date - Nov 05 , 2024 | 02:38 AM