శ్రీవారి క్షేత్రంలో సర్వర్ కష్టాలు
ABN, Publish Date - Jan 18 , 2024 | 11:33 PM
ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి క్షేత్రానికి పలు ప్రాంతాల నుంచి మొక్కుబడులు తీర్చుకునేందుకు వచ్చిన భక్తులకు సర్వర్ సరిగా పనిచేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
కేశఽఖండన శాల వద్ద భక్తుల ఇక్కట్లు
మూడు గంటల పాటు అంతరాయం.. అధికారుల తీరుపై ఆగ్రహం
ద్వారకాతిరుమల, జనవరి 18 : ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి క్షేత్రానికి పలు ప్రాంతాల నుంచి మొక్కుబడులు తీర్చుకునేందుకు వచ్చిన భక్తులకు సర్వర్ సరిగా పనిచేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిత్యం వేలాదిగా తరలివచ్చే ఈ క్షేత్ర కేశ ఽఖండనశాలలో గురువారం భక్తులకు టికెట్లు ఇచ్చే కౌంటర్లో సాంకేతికలోపం ఏర్పడింది. సంక్రాంతి పర్వదినం అనంతరం శ్రీవారిని దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. ఆన్లైన్ టికెట్లు ఇస్తున్న క్రమంలో ఒక్కసారిగా సర్వర్ ఆగిపోయింది. టికెట్ విక్రయాలు నిలిచి పోవడంతో దాదాపు మూడు గంటల పాటు భక్తులు కౌంటర్ల వద్ద వేచిఉండాల్సి వచ్చింది. సాఫ్ట్వేర్ సమస్య అంటూ అక్కడి అధికారులు హడావుడి చేయడమే మినహా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. భక్తులు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. చిన్నపిల్లలతో ఎంత సమయం ఎదురు చూడాలంటూ మండిపడ్డారు. అనంతరం సాఫ్ట్వేర్ను తిరిగి పనిచేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. క్యూలైన్లలో కిక్కిరిసిన చంటి బిడ్డల తల్లులు, వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులు ఎదర్కొన్నారు. చాలాసమయం తరువాత వినియోగంలోకి రావడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. మాన్యువల్గా టికెట్లు ఇచ్చే అవకాశం లేదని ఆలయ ఏఈవో పి.నటరాజారావు వివరణ ఇచ్చారు.
Updated Date - Jan 18 , 2024 | 11:33 PM