‘ఆడుదాం ఆంధ్రా’లో మరో వివాదం
ABN, Publish Date - Jan 29 , 2024 | 11:57 PM
బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో మరో వివాదం నెలకొంది. షటిల్ టోర్నమెంట్ ఫైనల్స్లో విజేతగా నిలిచిన జట్టులో ఒక క్రీడాకారుడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అని ఫిర్యాదు అందింది.
-షటిల్ టోర్నమెంట్ విజేతపై అభ్యంతరం
-క్రీడాకారుడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అని ఫిర్యాదు
-ఫలితం తేల్చని నిర్వాహకులు
బొబ్బిలి, జనవరి 29: బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో మరో వివాదం నెలకొంది. షటిల్ టోర్నమెంట్ ఫైనల్స్లో విజేతగా నిలిచిన జట్టులో ఒక క్రీడాకారుడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అని ఫిర్యాదు అందింది. దీంతో ఫలితాన్ని తేల్చలేక నిర్వాహకులు చేతులెత్తేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక మల్లమ్మపేట-బాడంగి జట్ల మధ్య షటిల్ టోర్నమెంట్ ఫైనల్స్ జరిగాయి. ఇందులో మల్లమ్మపేట జట్టు విజేతగా నిలిచింది. ఆ జట్టులో రమేష్, గౌరీశ్ ఆడారు. రమేష్ బీసీ వెల్ఫేర్ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కావడంతో అతడిని అనర్హుడిని చేయాలని ప్రత్యర్ధి జట్లు అధికారులకు మొదట్లోనే ఫిర్యాదు చేశాయి. దీనిపై వారు ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోవడంతో ఫైనల్స్ దాకా తీసుకొచ్చారు. తీరా ఫైనల్స్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న జట్టు విజేతగా నిలిచింది. దీంతో పెనువివాదం చోటుచేసుకుంది. ఫలితాన్ని ప్రకటిస్తే అంగీక రించేది లేదని, నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు ఆడరాదని బాడంగికి చెందిన సాయి జట్టు వాదించింది. ఆ జట్టుకు మరికొంతమంది క్రీడాకారులు మద్దతుగా నిలిచారు. ఈలోగా అధికార పార్టీ నాయకుల జోక్యం చోటుచేసుకుంది. ఈ ఫలితాన్ని ప్రకటించలేక అధికారులు, నిర్వాహకులు చేతులెత్తేశారు. దీనిపై నిర్ణయాన్ని జిల్లా క్రీడా అధికారి నిర్ణయానికి విడిచిపెట్టారు. షటిల్ టోర్నమెంట్ విజేతలను ప్రకటించకుండానే మిగిలిన జట్లలో విజేతలకు ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు బహుమతులను పంపిణీ చేశారు.
తలనొప్పిగా మారింది
ఆడుదాం ఆంధ్రా క్రీడల నిర్వహణ మాకు బాగా తలనొప్పిగా మారింది. విధి విధానాలను స్పష్టంగా వివరించడంలో సరైన మార్గదర్శకత్వం కరువైంది. అవుట్సోర్సింగ్ ఉద్యోగులు క్రీడల్లో పాల్గొనవచ్చని కొంతమంది, కూడదని మరికొంతమంది చెప్పారు. దీనితో ఫైనల్స్ వరకు గందరగోళం నెలకొంది. వివాదం పెరిగింది. ఓడిపోయిన జట్ల వారు మమ్మల్ని తీవ్రంగా దూషించడం, వాదనకు దిగడం ఆవేదనకు గురిచేసింది. క్రీడాకారులకు మద్దతుగా బయటి వారి జోక్యం ఎక్కువ కావడం బాధాకరం.
-నల్ల వెంకటనాయుడు, పీడీ, గ్రౌండ్ ఇన్చార్జి, బొబ్బిలి
Updated Date - Jan 29 , 2024 | 11:57 PM