ప్రశాంత ఎన్నికలకు చర్యలు
ABN, First Publish Date - 2024-02-06T23:15:22+05:30
జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నిశాంత్కుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో సమావేశం నిర్వహించారు.
బెలగాం, ఫిబ్రవరి 6 : జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నిశాంత్కుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ నియమాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉద్యోగి చేసే పనిపై నిఘా ఉంటుందని, ఎన్నికల ప్రవర్తనా నియావళి, ప్రొటోకాల్ విధులపై అవగాహన ఉండాలని తెలిపారు. జిల్లాలో 1031 పోలింగ్ కేంద్రాలు, 154 సెక్టారులు ఉన్నాయని వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. రెవెన్యూ అంశాలపై అప్రమత్తంగా ఉండాలని, జాయింట్ కలెక్టర్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు మాత్రమే పట్టాలు, పాస్బుక్లు జారీ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జేసీ గోవిందరావు, సీతంపేట, పార్వతీపురం ఐటీడీఏల పీవోలు కల్పనా కుమారి, విష్ణుచరణ్ తదితరులు ఉన్నారు.
కౌలు రైతులకు రుణాలు ఇవ్వాలి
జిల్లాలో కౌలు రైతులకు రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో కన్సెల్టేటివ్ కమిటీ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకర్లతో చర్చించారు. జిల్లాలో 12 వందల మంది కౌలు రైతులకు రుణాలు ఇవ్వాలన్నారు. పీఎం సురక్ష బీమా యోజన పథకంలో అర్హులైన వారందర్నీ నమోదు చేయాలని తెలిపారు. జిల్లాలో చేపట్టే ప్రాధాన్యత కార్య క్రమాల్లో బ్యాంకులు భాగస్వామ్యం కావాలని కోరారు. 2023-24 సంవత్సరానికి రుణ లక్ష్యం రూ.2,529 కోట్లు కాగా రూ.2,350 కోట్లు మంజూరు చేసి 93 శాతం లక్ష్యం సాఽధించారని తెలిపారు. ఈ సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ జేఎల్ఎన్ మూర్తి, ఆర్బీఐ లీడ్ జిల్లా అధికారి నాగ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2024-02-06T23:15:23+05:30 IST