ప్రకృతి అందాలకు నిలయం తాండవ
ABN, Publish Date - Oct 14 , 2024 | 12:55 AM
చుట్టూ కొండలు, మధ్యలో సువిశాలమైన జలాశయంతో చూపరుల మదిని దోచే తాండవ రిజర్వాయర్ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని స్థానికులు, సందర్శకులు కోరుతున్నారు.
సువిశాలమైన జలాశయం
చుట్టూ కొండలు, పచ్చటిచెట్లు
బోట్ షికార్కు ఎంతో అనువు
పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ప్రజల వినతి
నాతవరం, అక్టోబరు 13: చుట్టూ కొండలు, మధ్యలో సువిశాలమైన జలాశయంతో చూపరుల మదిని దోచే తాండవ రిజర్వాయర్ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని స్థానికులు, సందర్శకులు కోరుతున్నారు. నాతవరం, గొలుగొండ మండలాల్లో సుమారు 18.65 చదరపు కిలోమీటర్లు (4,608 ఎకరాలు) విస్తరించి వుంది. ఎగువున వున్న ఏజెన్సీ ప్రాంతం నుంచి వచ్చే పలు వాగులు, గెడ్డల నీటిని ఆధారంగా చేసుకుని ఐదు దశాబ్దాల క్రితం దీనిని నిర్మించారు. తాండవ జలాశయం కింద అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో 52 వేల ఎకరాల ఆయకట్టు వుంది. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో పదేళ్ల క్రితం అప్పటి టీడీపీ ప్రభుత్వం రూ.10 లక్షలతో రాతి ఆనకట్ట దిగువున ఉద్యావనం ఏర్పాటు చేసింది. నీరు-చెట్టు కార్యక్రమం కింద రాతి ఆనకట్ట మీద పూల మొక్కలు ఏర్పాటు చేశారు. దసరా తరువాత నుంచి సంక్రాంతి వరకు ఉమ్మడి విశాఖ జిల్లాతోపాటు కాకినాడ జిల్లా నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు. కార్తీకమాసం వనభోజనాలతో సందడిగా వుంటుంది. సూర్యాస్తమయం వేళ డ్యామ్ మీద నుంచి చూస్తే ఆకాశానికి కుంచెతో రంగులు అద్దినట్టుగా ప్రకృతి అందం ఆవిష్కృతమవుతుంది. సువిశాలమైన తాండవ జలాశయంలో బోట్ షికారు ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఇక్కడకు వచ్చే పర్యాటకులతోపాటు చుట్టూపక్కల గ్రామాల ప్రజలు అభిప్రాయపడుతున్నారు. గతంలో జాలర్ల ఇంజన్ బోటులో అప్పుడప్పుడు పర్యాటకులు విహరిస్తుంటారు. అయితే వీరివద్ద లైఫ్ జాకెట్లు లేకపోవడంతో బోట్ షికార్ అంత క్షేమం కాదు. అందువల్ల ప్రభుత్వం స్పందించి తాండవ రిజర్వాయర్లో బోట్ షికారు సదుపాయం కల్పించాల్సిన అవసరం వుంది. స్థానిక యువతకు శిక్షణతోపాటు రాయితీపై బోట్లు సమకూర్చితే వారికి ఉపాధి లభించడంతోపాటు పర్యాటకులు కూడా ఎంతో ఆనందిస్తారు. దీనివల్ల తాండవకు సందర్శకులు కూడా పెరుగుతారు. స్థానిక ఎమ్మెల్యే, శాసనసభ స్పీకర్ అయిన చింతకాయల అయ్యన్నపాత్రుడు చొరవ తీసుకుని తాండవ జలాశయం ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి కృషి చేయాలని కోరుతున్నారు.
Updated Date - Oct 14 , 2024 | 12:55 AM