వైద్య సేవల్లో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు
ABN, Publish Date - Nov 25 , 2024 | 10:59 PM
రోగులకు వైద్య సేవలు అందించే క్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అందుకు బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ ఏఎస్ దినేశ్కుమార్ హెచ్చరించారు.
కలెక్టర్ ఏఎస్ దినేశ్కుమార్ హెచ్చరిక
అంబులెన్స్లను సక్రమంగా వినియోగించాలి
వైద్యులు, సిబ్బంది ఖాళీల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతాం
పాడేరు, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): రోగులకు వైద్య సేవలు అందించే క్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అందుకు బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ ఏఎస్ దినేశ్కుమార్ హెచ్చరించారు. స్థానిక జిల్లా ఆస్పత్రిలో సోమవారం సాయంత్రం నిర్వహించిన ఆస్పత్రి అభివృద్ధి సమావేశంలో ఆయన చైర్మన్ హోదాలో మాట్లాడారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. అలాగే ఆస్పత్రిలో సదుపాయాలు, వసతులు, తదితర అంశాలపై ఆరా తీశారు. మూడు అంబులెన్సులను సక్రమంగా వినియోగించాలని, డ్రైవర్లు సక్రమంగా విధులు నిర్వహించకపోతే విధుల్లోంచి తొలగిస్తామన్నారు. రోగులను చూసేందుకు వచ్చే సందర్శకులకు పాస్లు జారీ చేయాలని, నిర్దిష్ట సమయంలోనే అనుమతించాలన్నారు. వైద్యులు, సిబ్బంది, సందర్శకులకు వేర్వేరుగా పార్కింగ్ స్థలాలు కేటాయించాలని, అలాగే పార్కింగ్ విషయంలో సెక్యూరిటీ సిబ్బంది పక్కాగా వ్యవహరించాలని సూచించారు. ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది ఖాళీల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేస్తామన్నారు. ఆస్పత్రికి ప్రహరీ గోడ నిర్మిస్తామని, ఆపరేషన్ థియేటర్కు అవసరమైన మరమ్మతులు చేయించాలని ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నెలకు రెండు మార్లు రక్త సేకరణకు శిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే.అభిషేక్గౌడ, పాడేరు, అరకులోయ ఎమ్మెల్యేలు ఎం.విశ్వేశ్వరరాజు, ఆర్.మత్స్యలింగం, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విశ్వామిత్ర, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి సి.జమాల్బాషా, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ హేమలత, జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త డాక్టర్ కె.కృష్ణారావు, డివిజనల్ పంచాయతీ అధికారి పీఎస్ కుమార్ పాల్గొన్నారు.
Updated Date - Nov 25 , 2024 | 10:59 PM