నేవీ డే ఈసారి పూరీలో...
ABN, Publish Date - Nov 10 , 2024 | 01:10 AM
ఏటా డిసెంబరు 4న తూర్పు నౌకాదళం విశాఖపట్నంలో నిర్వహించే నేవీ డే కార్యక్రమాలను ఈసారి ఒడిశాలోని పూరీలో నిర్వహించాలని నిర్ణయించారు.
ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
తూర్పు నౌకాదళం విశాఖలో కాకుండా బయట నిర్వహించడం ఇదే ప్రథమం
విశాఖపట్నం, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి):
ఏటా డిసెంబరు 4న తూర్పు నౌకాదళం విశాఖపట్నంలో నిర్వహించే నేవీ డే కార్యక్రమాలను ఈసారి ఒడిశాలోని పూరీలో నిర్వహించాలని నిర్ణయించారు. ఆ రోజున నౌకాదళంలోని అన్ని విభాగాలు తీరంలో సాహస విన్యాసాలు నిర్వహించడం ఆనవాయితీ. ముఖ్యంగా వైమానిక దళం ఆకాశంలో చేసే అద్భుతాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. భారత రాష్ట్రపతి, త్రివిధ దళాల అధిపతి ద్రౌపదీ ముర్ము ఒడిశా రాష్ట్రానికి చెందినవారు కావడంతో ఆమె పూరీలో జరిగే నేవీ డేకి ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. తూర్పు నౌకాదళం ప్రధాన కేంద్రమైన విశాఖలో కాకుండా వేరే ప్రాంతంలో నేవీ డే విన్యాసాలు నిర్వహించడం ఇదే ప్రథమం. గత ఏడాదే దీనికి బీజం పడింది. పశ్చిమ నౌకాదళం కేంద్రమైన ముంబైలో ఏటా నేవీ డే నిర్వహించేవారు. గత ఏడాది ఛత్రపతి శివాజీ ప్రాంతమైన సింధు దుర్గ్లో నేవీ విన్యాసాలు నిర్వహించారు. వాటికి దేశ ప్రధాని నరేంద్రమోదీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసారి దానిని తూర్పు నౌకాదళంలో అమలులోకి తీసుకువచ్చారు. ఉత్తరాంధ్ర, ఒడిశా అంతా గతంలో కళింగ సామ్రాజ్యంగా వ్యవహరించేవారు. అందులో గిరిజనుల పాత్ర కీలకం. ఒడిశా కూడా తూర్పు నౌకాదళంలో భాగమే కాబట్టి అక్కడ రాష్ట్రపతి కోసం నేవీ విన్యాసాలు నిర్వహిస్తున్నారు. నేవీ డే సందర్భంగా ప్రధాన నగరాల్లో ఏదో ఒక కార్యక్రమం ఏర్పాటుచేయడం ఆనవాయితీ. తూర్పు నౌకాదళం కోల్కతా, పారదీప్, పాండిచ్చేరి, చెన్నై వంటి నగరాలకు యుద్ధనౌకలను, హెలికాప్టర్లను పంపించి, అక్కడి పౌరులకు వాటిని సందర్శించే అవకాశం కల్పిస్తుంది. ఈసారి ప్రధాన కేంద్రమైన విశాఖలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదు. నౌకాదళంలోని నౌకలు, విమానాలు, హెలికాప్టర్లు, సబ్మెరైన్లు అన్నీ పూరీ వెళతాయని నేవీ వర్గాలు తెలిపాయి.
Updated Date - Nov 10 , 2024 | 01:10 AM