ఎంఎల్సీపీ భవనంలో ఐటీ కంపెనీలు
ABN, Publish Date - Oct 26 , 2024 | 01:19 AM
విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ) మల్టీ లెవల్ కారు పార్కింగ్ (ఎంఎల్సీపీ) కోసం సిరిపురం జంక్షన్లో నిర్మిస్తున్న భవనంలో కొంత మేర ఐటీ కంపెనీలకు ఇవ్వాలని భావిస్తోంది.
పార్కింగ్ కోసం సిరిపురం జంక్షన్లో 11 అంతస్థుల భవనం నిర్మిస్తున్న వీఎంఆర్డీఏ
అందులో మూడు అంతస్థులు తమకు కేటాయించాలని కోరుతున్న సంస్థలు
సుముఖంగా ఉన్న అధికారులు
రెండు, మూడు వేల మందికి ఉద్యోగాలు లభించే అవకాశం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ) మల్టీ లెవల్ కారు పార్కింగ్ (ఎంఎల్సీపీ) కోసం సిరిపురం జంక్షన్లో నిర్మిస్తున్న భవనంలో కొంత మేర ఐటీ కంపెనీలకు ఇవ్వాలని భావిస్తోంది. ఇంకో నెల రోజుల్లో ఈ భవనం ప్రారంభానికి సిద్ధం కానున్నది.
సిరిపురం జంక్షన్లో ముఖ్యంగా చిల్డ్రన్ ఎరీనా, గురజాడ కళాక్షేత్రం, ఏయూ అంబేడ్కర్ భవన్లో ఏమైనా కార్యక్రమాలు నిర్వహించినప్పుడు వాహనాలకు పార్కింగ్ సమస్య ఎదురవుతోంది. దీనిని పరిష్కరించడానికి ఉద్యోగ భవన్ ముందున్న 1.72 ఎకరాల స్థలంలో ఎంఎల్సీపీ భవనం నిర్మాణాన్ని వీఎంఆర్డీఏ చేపట్టింది. ముందు రూ.80 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించారు. సాంకేతిక కారణాలు, కాంట్రాక్టర్ చేసిన జాప్యం కారణంగా నిర్మాణం ఆలస్యమైంది. బడ్జెట్ రూ.87.5 కోట్లకు చేరింది. కమిషనర్గా విశ్వనాథన్ వచ్చిన తరువాత ఎప్పటికప్పుడు స్పష్టమైన లక్ష్యాలు ఇస్తూ త్వరితగతిన భవనం పూర్తి చేయడానికి యత్నిస్తున్నారు. ప్రస్తుతం దీనికి అవసరమైన పవర్ బ్యాకప్ కోసం జనరేటర్లను కూడా తెప్పించారు. ఇంకో నెల రోజుల్లో భవనం సిద్ధమయ్యే అవకాశం ఉంది.
ఐదు అంతస్థుల్లో కారు పార్కింగ్
ఇది 11 అంతస్థుల భవనం. కింద గ్రౌండ్లో మూడు అంతస్థులు, ఆ పైన మరో రెండు అంతస్థులు పార్కింగ్కు కేటాయించినట్టు కమిషనర్ విశ్వనాథన్ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. వీటిలో 430 కార్లు, 400 ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసుకోవచ్చు. గ్రౌండ్ ఫ్లోర్ను మాత్రం వాణిజ్య అవసరాలకు కేటాయించనున్నారు. ఆపైన ఉన్న అంతస్థులను ఐటీ కోసం ఇవ్వాలని భావిస్తున్నారు. సుమారు 1.6 లక్షల చ.అ. స్థలం అందుబాటులో ఉంది. నగరం నడిబొడ్డున, అదీ ఎదురుగా సముద్రం కనిపించేలా, పార్కింగ్కు కూడా తగినంత స్థలం అందుబాటులో ఉండడంతో దీనిని తమకు కేటాయించాలని ఐటీ సంస్థలు కోరుతున్నాయి. ఐటీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఐటాప్) పూర్వ అధ్యక్షులు శ్రీధర్ కొసరాజు దీనిపై కమిషనర్ను సంప్రతించగా ఐటీ సంస్థలైన డబ్ల్యుఎన్ఎస్, పాత్ర, క్లౌడ్ ఎరా, డిజిటల్ మార్కెటింగ్ల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. మొత్తం ఆరు అంతస్థులలో 1.6 లక్షల చ.అ. స్థలం అందుబాటులో ఉందని, ఐటీ కంపెనీలకు ఇవ్వడానికి సుముఖంగా ఉన్నామని కమిషనర్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చే ఐటీ పాలసీలో ఉపాధి అవకాశాలు కల్పించే ఐటీ సంస్థలకు భవనం అద్దెలో 50 శాతం రాయితీ ఇవ్వాలని వీఎంఆర్డీఏ యోచిస్తోంది. గతంలోను తెలుగుదేశం ప్రభుత్వం ఐటీకి ఇలాంటి రాయితీలు ఇచ్చింది. ఇప్పుడు దానిని పునరుద్ధరించే అవకాశం ఉండడంతో ఆ స్కీమ్లో ఇక్కడ కనీసం రెండు వేల నుంచి మూడు వేల మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Updated Date - Oct 26 , 2024 | 01:19 AM