ముప్పు తప్పినా.. అప్రమత్తం!
ABN, Publish Date - Dec 02 , 2024 | 12:17 AM
జిల్లాకు తుఫాన్ ముప్పు తొలగినట్టేనని అధికార యంత్రాంగం, వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే వాతావరణ మార్పుల కారణంగా ఈ నెల ఏడో తేదీ వరకు చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం వున్నందున వరి రైతులు అప్రమత్తంగా వుండాలని సూచిస్తున్నారు. కాగా బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ శనివారం రాత్రి తీరాన్ని తాకి, తీవ్ర వాయుగుండంగా బలహీనపడిందన్న వాతావరణ శాఖ సమాచారంతో జిల్లా రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు. తుఫాన్ ప్రఽభావంతో శనివారం రాత్రి, ఆదివారం పగలు మోస్తరు వర్షం కురిసింది. లోతట్టుగా వున్న భూముల్లో కొద్దిపాటి నీరు నిలిచింది. కోత కోయని వరిపైరు ఎక్కడా నీట మునిగిన సమాచారం లేదని వ్యవసాయ శాఖ అధికారులు ఆదివారం ప్రకటించారు.
తుఫాన్ ప్రభావంతో జిల్లాలో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలు పడకపోవడంతో ఊపిరిపీల్చుకున్న అన్నదాతలు
ఈదురు గాలులతో పలుచోట్ల నేల వాలిన వరి పైరు
ఏడో తేదీ వరకు చెదురు మదురుగా వర్షాలు కురుస్తాయని వ్యవసాయ శాఖ వెల్లడి
అనకాపల్లి అగ్రికల్చర్, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి)ః
జిల్లాకు తుఫాన్ ముప్పు తొలగినట్టేనని అధికార యంత్రాంగం, వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే వాతావరణ మార్పుల కారణంగా ఈ నెల ఏడో తేదీ వరకు చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం వున్నందున వరి రైతులు అప్రమత్తంగా వుండాలని సూచిస్తున్నారు. కాగా బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ శనివారం రాత్రి తీరాన్ని తాకి, తీవ్ర వాయుగుండంగా బలహీనపడిందన్న వాతావరణ శాఖ సమాచారంతో జిల్లా రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు. తుఫాన్ ప్రఽభావంతో శనివారం రాత్రి, ఆదివారం పగలు మోస్తరు వర్షం కురిసింది. లోతట్టుగా వున్న భూముల్లో కొద్దిపాటి నీరు నిలిచింది. కోత కోయని వరిపైరు ఎక్కడా నీట మునిగిన సమాచారం లేదని వ్యవసాయ శాఖ అధికారులు ఆదివారం ప్రకటించారు.
అయితే మాడుగుల మండలం ఎం.కోడూరు, మాకవరపాలెం మండలం రాచపల్లి, రామన్నపాలెం, జి.కోడూరు, ఎస్.రాయవరం మండలం చినగుమ్ములూరు, వెంకటాపురం, తిమ్మాపురం, పెదగుమ్ములూరు తదితర గ్రామాల్లో ఇటీవల కోత కోసి, కుప్పవేయని పొలాల్లో వరి పనలు తడిసిపోయాయి. రైతులు పొలాల్లో నుంచి నీటిని బయటకు పంపే పనుల్లో నిమగ్నమయ్యారు. వరి పనలను గట్లపైకి చేరుస్తున్నారు.
ఈదురు గాలులకు నేలవాలని వరి పైరు
తుఫాన్ కారణంగా ఈదురు గాలులు వీచడంతో పలుమండలాల్లో వరి పైరు నేలవాలింది. భారీ వర్షాలు కురవకపోతే ఇబ్బంది లేదని, వరి నేలవాలిన పొలాల్లో రైతులు నాలుగైదు దుబ్బులను కలిపి కట్టుకుని నిలుబెట్టుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి బి.మోహన్రావు సూచించారు. సోమవారం చిరు జల్లులు పడవచ్చని, దీనివల్ల కోతకు వచ్చిన వరి పైరుకు నష్టం ఏమీ ఉండదని వర్షాల ప్రభావంపై ఎప్పటికప్పుడు మండలాల వ్యవసాయ అధికారుల ద్వారా రైతులకు సూచనలు ఇస్తున్నామని ఆయన తెలిపారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో వ్యవసాయ శాఖ సూచన మేరకు రైతులు వరి కోతలను వాయిదా వేసుకున్నారని, అప్పటికే కోసిన వరి పనలను కుప్ప వేసుకున్నారని చెప్పారు. అయితే కొద్దిచోట్ల వరి పనలు పూర్తిగా ఎండకపోవడంతో రైతులు కుప్పలు వేయలేదని, ఇటువంటి చోట్ల వర్షాలకు వరి పనలు తడిసిపోయాయన్నారు. వరి పనలపై లీటరు నీటికి 50 గ్రాముల చొప్పు కళ్లుప్పి కలిపి పిచికారీచేసుకోవాలని, లేదంటే ఉప్పును చల్లుకోవచ్చని సూచించారు. ఎక్కడైనా వరి పనలు నీటిలో నానుతుంటే గట్లపైకి, మెరక ప్రదేశాలకు చేర్చుకోవాలని చెప్పారు.
కాగా అధికారుల హెచ్చరికల నేపథ్యంలో పరవాడ, అచ్యుతాపురం, రాంబిల్లి, ఎస్.రాయవరం, నక్కపల్లి, పాయకరావుపేట మండలాల్లో మత్స్యకారులు ఆదివారం కూడా సముద్రంలో చేపలవేటకు వెళ్లలేదు.
వర్షపాతం వివరాలు
జిల్లాలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం ఎనిమిది గంటల వరకు జిల్లాలోని పలు మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా రాంబిల్లి మండలంలో 37.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిగిలిన మండలాలను పరిశీలిస్తే.. నక్కపల్లిలో 35.6 మి.మీ.లు, ఎస్.రాయవరంలో 31.8, నాతవరంలో 31.4, పాయకరావుపేటలో 31.4, సబ్బవరంలో 27.6, అచ్యుతాపురంలో 27.4, ఎలమంచిలిలో 25.2, పరవాడలో 23.8, బుచ్చెయ్యపేటలో 22.6, చోడవరంలో 22.2, మునగపాకలో 20.8, గొలుగొండలో 18.2, దేవరాపల్లిలో 16.8, కోటవురట్లలో 16.4, కశింకోటలో 16.4, రావికమతంలో 16.2, కె.కోటపాడులో 16.2, అనకాపల్లిలో 15.2, మాకవరపాలెంలో 14.8, మాడుగులలో 13.8, నర్సీపట్నంలో 12.6, రోలుగుంటలో 12.4, చీడికాడలో 12.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
Updated Date - Dec 02 , 2024 | 12:17 AM