బూత్ బంగ్లాలా జడ్పీ అతిథిగృహం
ABN, Publish Date - Oct 03 , 2024 | 01:16 AM
నగరంలోని అప్పుఘర్ సమీపాన గల జిల్లా పరిషత్ అతిథిగృహం శిథిలావస్థలో ఉంది. ఏసీలు, ఫ్యాన్లు, గీజర్లు తుప్పుపట్టాయి. చాలా రోజులుగా వినియోగించకపోవడంతో మంచాలపై పరువులు, కుర్చీలు, సోఫాలు, టీపాయ్లు, టీవీలు పాడైపోయాయి. ఏసీ గదుల్లో సీలింగ్ పడిపోయింది.
మూడున్నరేళ్ల క్రితం నాటి పంచాయతీరాజ్ శాఖా మంత్రి
పెద్దిరెడ్డి ఆదేశాల మేరకు ఆధునికీకరణ పనులు ప్రారంభం
ప్రభుత్వ ఆమోదం లేకుండా కాంట్రాక్టర్కు అప్పగింత
ఆయన మారిపోవడం, ఆ తరువాత
పాలనా రాజధాని అంశం మరుగునపడడంతో నిలిచిన పనులు
అప్పటివరకూ వెచ్చించిన నిధుల విడుదలకు ముత్యాలనాయుడు విముఖం
అప్పటి నుంచి నిరుపయోగంగా గెస్ట్ హౌస్
ఎందుకూ పనికిరాకుండా పోయిన ఫర్నిచర్
విశాఖపట్నం, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి):
నగరంలోని అప్పుఘర్ సమీపాన గల జిల్లా పరిషత్ అతిథిగృహం శిథిలావస్థలో ఉంది. ఏసీలు, ఫ్యాన్లు, గీజర్లు తుప్పుపట్టాయి. చాలా రోజులుగా వినియోగించకపోవడంతో మంచాలపై పరువులు, కుర్చీలు, సోఫాలు, టీపాయ్లు, టీవీలు పాడైపోయాయి. ఏసీ గదుల్లో సీలింగ్ పడిపోయింది. విద్యుత్ బోర్డులు, వైరింగ్ ఊడిపోయి కనిపిస్తున్నాయి. అతిథి గృహాన్ని మూడున్నరేళ్ల నుంచి జడ్పీ పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడంతో బూత్ బంగ్లాలా మారింది. తిరిగి వినియోగంలోకి తీసుకురావాలంటే ఖర్చు భారీగానే అవుతుందంటున్నారు.
జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విశాఖను పాలనా రాజధాని చేస్తామని ప్రకటించడంతో అప్పటి పంచాయతీరాజ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నగరంలో గెస్ట్ హౌస్ చూడాలని అధికారులకు ఆదేశించారు. వెంటనే అధికారులకు జడ్పీ అతిథి గృహం గుర్తుకువచ్చింది. దానిని పూర్తిగా ఆధునికీకరించాలని భావించారు. అయితే ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వ ఆమోదం పొందాలన్న స్పృహ లేకుండా వ్యవహరించారు. మంత్రి చెప్పారు కదా...అని అందుబాటులో ఉన్న ఒక కాంట్రాక్టర్ను పిలిచి పనులు చేయాలని పురమాయించేశారు. రెండస్థుల భవనంపై మరో ఫ్లోర్ నిర్మాణం, భవనం మొత్తం ఆధునికీకరణ పనులు చేపట్టారు. గదుల్లో ఉన్న మంచాలపై బెడ్లు, డైనింగ్హాలులో కుర్చీలు, ఇతర సామగ్రి పక్కనపడేశారు. అయితే అప్పటివరకూ ఖర్చు చేసిన రూ.35 లక్షలకు సంబంధించి బిల్లులు ఇవ్వాలని కాంట్రాక్టర్ కోరిన తరువాత గానీ అధికారికంగా వర్క్ ఆర్డర్ ఇవ్వలేదని విషయం అధికారులకు గుర్తుకువచ్చింది. ఈలోగా విశాఖలో పాలనా రాజధానిపై హైకోర్టులో కేసు దాఖలు కావడం, ప్రభుత్వం రాజధానిపై వెనుకంజ వేయడంతో అతిథిగృహం పనులు మధ్యలో నిలిచిపోయాయి. ఆ తరువాత కొద్దినెలలకు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో పంచాయతీరాజ్ శాఖ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నుంచి తప్పించారు. ఆ శాఖను ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన బూడి ముత్యాలనాయుడుకు అప్పగించారు. ఈ నేపథ్యంలో జడ్పీ అతిథిగృహం మరమ్మతులు పూర్తిచేయడానికి అధికారులు ప్రాధాన్యం ఇవ్వలేదు. దీంతో ఫర్నీచర్ మొత్తం పాడైపోయింది. అలాగే సుమారు మూడున్నరేళ్లగా భవనాన్ని వినియోగించకపోవడంతో శిఽథిలావస్థకు చేరుకుంది. లోపలగదుల్లో ఎక్కడ సామగ్రి అక్కడే విడిచిపెట్టడంతో ఐరన్తో తయారుచేసిన వస్తువులు తుప్పుపట్టాయి. ప్రస్తుతం అతిథిగృహం గేటు కూడా ఒకపక్క విరిగిపోయి ఉంది. ఆవరణ మొత్తం పిచ్చిమొక్కలతో బూత్ బంగ్లాను తలపిస్తోంది.
ఇప్పటికీ అందని బిల్లులు
వర్క్ ఆర్డర్ లేకపోవడంతో చేసిన రూ.35 లక్షలకు సంబంధించి బిల్లులు విడుదల కాలేదు. పనులు చేయాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బిల్లులు మంజూరు విషయంలో చొరవ తీసుకోలేదు. ఆ తరువాత వచ్చిన బూడి ముత్యాలనాయుడు తనకు సంబంధం లేదని తెగేసి చెప్పారు. అప్పట్లో పనులు పురమాయించిన అధికారులు బదిలీపై వెళ్లిపోయారు. గత ఏడాది నుంచి 16వ ఆర్థిక సంఘం నిధులు జడ్పీకి వస్తున్నా అతిథిగృహం ఆధునికీకరణకు పాలకులు చొరవ చూపలేదు. కూటమి ప్రజా ప్రతినిధులు మరోమారు అధికారులతో అంచనాలు తయారుచేయించి, టెండర్ల ద్వారా కాంట్రాక్టర్ను ఎంపిక చేసి పనులు పూర్తిచేయించగలిగితే నగరంలో మరో మంచి అతిథిగృహం అందుబాటులోకి వస్తుంది.
Updated Date - Oct 03 , 2024 | 07:31 AM