టన్ను ఇసుక రూ.750
ABN, Publish Date - Nov 08 , 2024 | 01:05 AM
నగరంలో నిర్మాణదారులకు తక్కువ ధరకు ఇసుక సరఫరా చేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది.
రవాణా చార్జీ టన్నుకు రూ.150
నగరంలో మూడుచోట్ల డిపోలు
15 నుంచి విక్రయాలు ప్రారంభించేలా అధికారులు చర్యలు
పది టన్నుల వరకైతే ఇక్కడ...
అంతకుమించి కావాలంటే రీచ్లకు వెళ్లాల్సిందే
విశాఖపట్నం, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి):
నగరంలో నిర్మాణదారులకు తక్కువ ధరకు ఇసుక సరఫరా చేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం మూడుచోట్ల డిపోలు (స్టాకు పాయింట్లు) ఏర్పాటుచేయబోతోంది. డిపోల్లో టన్ను రూ.750కు విక్రయించనున్నారు. డిపో నుంచి వినియోగదారుని ఇంటికి రవాణా చార్జీ కింద టన్నుకు సుమారు రూ.150 చెల్లించాల్సి ఉంటుంది. అంటే టన్ను ఇసుక వినియెగదారుడి ఇంటికి చేరడానికి రూ.900 ఖర్చవుతుంది. ఈ మేరకు జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
భీమిలి, ముడసర్లోవల్లో గతంలో నిర్వహించినచోటే డిపోలు ఏర్పాటుచేస్తారు. అక్కడ వెయింగ్ మిషన్లు ఉన్నాయి. అగనంపూడి వద్ద డిపో ఏర్పాటుచేసిన స్థలం ఉక్కు కర్మాగారానికి చెందినది అయినందున గాజువాక పరిసరాల్లో ఒకచోట డిపో ఏర్పాటుచేయాలని ప్రతిపాదించారు. నగరంలో డిపోలు ఈనెల 15వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఒకవేళ డీలర్ల ఎంపికలో జాప్యం జరిగితే 17 లేదా 18వ తేదీల నుంచి విక్రయాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని జిల్లా స్థాయి కమిటీ నిర్ణయించినట్టు కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర్ ప్రసాద్ తెలిపారు. కొత్తగా అందుబాటులోకి రానున్న డిపోలలో 10 టన్నుల వరకు ఇసుక అందించాలని కమిటీ తీర్మానించింది. అంతకంటే ఎక్కువ అవసరం ఉన్న బిల్డర్లు/కాంట్రాక్టర్లు శ్రీకాకుళం, రాజమండ్రిల్లో రీచ్ల నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాజమండ్రి రీచ్లో టన్ను ఇసుక రూ.80 నుంచి రూ.90కు ఇస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని రీచ్లలో టన్ను రూ.200కు అందిస్తున్నారు. రాజమండ్రిలో మాదిరిగా శ్రీకాకుళం జిల్లాలోని రీచ్లలో టస్ను రూ.100 కంటే తక్కువకు సరఫరా చేయాలని జిల్లా యంత్రాంగం కోరుతుంది. ఇదిలావుండగా జిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న ఇళ్ల నిర్మాణాలకు రోజుకు సగటున 500 టన్నుల ఇసుక అవసరం. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా యంత్రాంగానికి ప్రతిపాదనలు పంపారు. గురువారం లేదా శుక్రవారం నుంచి ఇళ్ల నిర్మాణాలకు ఇసుక రవాణా మొదలు పెట్టాలని నిర్ణయించామని కలెక్టర్ తెలిపారు.
Updated Date - Nov 08 , 2024 | 01:05 AM