3 ఇసుక డిపోలు
ABN, Publish Date - Oct 27 , 2024 | 01:38 AM
జిల్లాలో నిర్మాణదారులకు ఇసుక అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇందుకోసం అగనంపూడి, ముడసర్లోవ, భీమిలిలో స్టాకు పాయింట్లు ఏర్పాటుచేస్తోంది. కొద్ది మొత్తం ఇసుక అవసరం ఉన్న వారిని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
భీమిలి, ముడసర్లోవ, అగనంపూడిల్లో ఏర్పాటు
ప్రభుత్వం గ్రీన్సిగ్నల్
కొద్ది మొత్తం అవసరమయ్యే వారిని పరిగణనలోకి తీసుకుని నిర్ణయం
నిర్వహణ ప్రైవేటు సంస్థలకు అప్పగింత
త్వరలో టెండర్లు
విశాఖపట్నం, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో నిర్మాణదారులకు ఇసుక అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇందుకోసం అగనంపూడి, ముడసర్లోవ, భీమిలిలో స్టాకు పాయింట్లు ఏర్పాటుచేస్తోంది. కొద్ది మొత్తం ఇసుక అవసరం ఉన్న వారిని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
గత ప్రభుత్వ హయాంలో భీమిలి, ముడసర్లోవ, అగనంపూడి ప్రాంతాల్లో ఇసుక డిపోలు ఏర్పాటుచేశారు. కొద్దికాలం నిర్వహణ ఏపీఎండీసీ చూసింది. ఆ తరువాత ప్రభుత్వం నెమ్మదిగా ప్రైవేటు సంస్థలకు అప్పగించింది. ముడసర్లోవలోని డిపోను గత ప్రభుత్వ హయాంలోనే మూసివేయగా, భీమిలి, అగనంపూడి డిపోలను రెండు నెలల క్రితం కూటమి ప్రభుత్వం ఎత్తివేసింది. ఇసుక అవసరమైనవారు రాజమండ్రి, శ్రీకాకుళంలో రీచ్లకు వెళ్లి తెచ్చుకోవాలని సూచించింది. అయితే బల్క్గా అంటే ఐదు టన్నులు, అంతకు మించి అవసరం ఉన్నవారం రీచ్లకు వెళుతున్నారు. ఒకటి లేదా రెండు టన్నులు కావాల్సినవారు నగరంలో ప్రైవేటు వ్యాపారుల వద్ద టన్ను రూ.1800 నుంచి రూ.రెండు వేల పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తోంది. అయితే రెవెన్యూ, గనుల శాఖ అధికారులు దాడులు చేయడంతో నగరంలో ఎక్కువ మంది ఇసుక వ్యాపారాన్ని నిలిపివేశారు. దీంతో తక్కువ మొత్తం ఇసుక కావాల్సినవారు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో ఇసుక స్టాకు పాయింట్లు అవసరమని కలెక్టర్ హరేంధిరప్రసాద్ను ప్రజా ప్రతినిధులు, నిర్మాణదారులు కోరారు. దీంతో ఆయన ప్రభుత్వానికి సమస్యను నివేదించగా స్టాకు పాయింట్ల ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. గతంలో ఉన్న మూడుచోట్ల స్టాకు పాయింట్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే గనుల శాఖ కాకుండా ప్రైవేటు సంస్థలకు ఈ స్టాకు పాయింట్ల నిర్వహణ అప్పగించాలని నిర్ణయించారు. త్వరలో టెండర్లు పిలిచి తక్కువ మొత్తం కోట్ చేసిన సంస్థలకు స్టాకు పాయింట్ల నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నారు. దీనికి సంబంధించి విధి విధానాలు రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వం జారీచేయనున్నది.
ఒడిశా ఇసుకపై విజిలెన్స్
విశాఖ నగరానికి ఒడిశా నుంచి ఇసుక వస్తుండడంతో విజిలెన్స్ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. గనులు, రెవెన్యూ, పోలీస్, రవాణా, పంచాయతీరాజ్, జల వనరుల శాఖ అధికారులు, సిబ్బందితో కూడిన విజిలెన్స్ బృందం మూడు రోజుల క్రితం నగర శివారులో ఒక లారీని పట్టుకుని రూ.30 వేల జరిమానా విధించారు.
Updated Date - Oct 27 , 2024 | 01:38 AM