AP News: వ్యభిచారం చేసి నన్ను, నా ప్రియుడిని పోషించండి.. గుంటూరులో కన్నకూతుళ్లను రొంపిలోకి దించిన కసాయితల్లి..
ABN, First Publish Date - 2024-02-06T04:12:34+05:30
మానవత్వం మంటగలిసేలా.. సభ్య సమాజం సిగ్గుపడేలా.. తన కడుపున పుట్టిన బిడ్డల పట్లే ఓ తల్లి అత్యంత అమానుషంగా, నీచంగా వ్యవహరిస్తున్న తీరు విస్మయం కలిగిస్తోంది.
ఇద్దరు భర్తలను వదిలి మరొకరితో సహజీవనం
ప్రియుడి మోజులో, మద్యం మత్తులో నీచపు పనులు
వ్యభిచారం చేసి సంపాదించి తమను పోషించాలని ఒత్తిడి
కూతురి వరసయ్యే బాలికపైనా ప్రియుడి లైంగిక దాడి
గతంలో ఇదే తరహాలో పెద్ద కూతురిపైనా వేధింపులు
ఇంటి నుంచి పారిపోయి అక్క వద్దకు చేరిన బాలిక
తల్లి వద్ద ఉన్న మరో చెల్లెలి పరిస్థితిపై ఆందోళన
ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించిన అక్కాచెల్లెళ్లు
గుంటూరు, ఫిబ్రవరి 5: మానవత్వం మంటగలిసేలా.. సభ్య సమాజం సిగ్గుపడేలా.. తన కడుపున పుట్టిన బిడ్డల పట్లే ఓ తల్లి అత్యంత అమానుషంగా, నీచంగా వ్యవహరిస్తున్న తీరు విస్మయం కలిగిస్తోంది. ఇప్పటికే ఇద్దరు భర్తలను మార్చి.. మూడో వ్యక్తితో సహజీవనం చేస్తున్న ఆమె.. మొదటి ఇరువురు భర్తలకు పుట్టిన ఆడ బిడ్డలపై అమానుషంగా ప్రవర్తిస్తోంది. వ్యభిచారం చేసి తనను, తన ప్రియుడ్ని పోషించాలంటూ బలవంతంగా ఆ పిల్లలను వ్యభిచారంలోకి దించింది. ప్రియుడి కోరిక కూడా తీర్చాలంటూ వేధించ సాగింది. తండ్రి వరసయ్యే అతడు కూడా బాలికపై లైంగిక దాడికి దిగాడు. తాము చెప్పినట్టు మాట వినడం లేదని బాలిక ప్రైవేటు అవయవాలపై కాల్చి వాతలు పెట్టారు. తల్లి, ఆమె ప్రియుడి వేధింపులు తట్టుకోలేని ఆ బాలిక.. ఇంటి నుంచి పారిపోయి తన అక్క వద్దకు చేరింది. అయితే ఆ కసాయి తల్లి వద్ద మరో పదకొండేళ్ల చెల్లెలు, తొమ్మిదేళ్ల తమ్ముడు ఉన్నారు. ఆ బాలికను కూడా తనలాగే చేస్తుందేమోనని ఇరువురు అక్కలూ భయాందోళన చెందుతూ సోమవారం ఎస్పీ కార్యాలయంలో స్పందనను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని నెహ్రూనగర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళకు గతంలో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. వారికి ఓ కుమార్తె జన్మించింది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో భర్తను వదిలి కూతురితో ఆమె వేరుగా ఉంది. తర్వాత మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. రెండో భర్తకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు పుట్టారు. ఇదిలా ఉంటే తమకు పుట్టిన ముగ్గురు సంతానంలో రెండో కుమార్తె అయిన పసిపిల్ల పట్ల రెండో భర్త అసభ్యంగా ప్రవర్తించాడంటూ అప్పట్లో తల్లి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనమై.. భర్తపై కేసు నమోదయింది. అనంతరం రెండో భర్తను కూడా వదిలేసి, ఆరేళ్లుగా ఆమె మరో వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఈ నేపథ్యంలో.. మొదటి భర్త కుమార్తెకు చిన్న వయసులోనే పెళ్లి చేశారు. ఆమెకు తన భర్త నుంచి వేధింపులు ఎదురవగా, తల్లి వారిద్దరినీ విడదీసి తన వద్దకు తీసుకొచ్చేసింది. మొత్తం నలుగురు పిల్లలనూ స్కూలుకు పంపకుండా చితకబాది బలవంతంగా కూలి పనులకు పంపుతుండేది. ఈ క్రమంలో పెద్ద కుమార్తె ఓ యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. ఇక, రెండో భర్తకు పుట్టిన ముగ్గురు సంతానంలో మొదటి కుమార్తెకు ఏడాది క్రితం 14 ఏళ్ల వయసులో విజయవాడకు చెందిన ఓ యువకుడితో వివాహం చేశారు. భార్యాభర్తల మధ్య స్వల్ప వివాదం తలెత్తగా.. వారికి సర్ది చెప్పకపోగా, కూతుర్ని బలవంతంగా తన ఇంటికి తెచ్చుకుంది. మైనర్ అయిన కూతురికి పెళ్లి చేయడమే కాకుండా, వారి కాపురాన్ని చెడగొట్టి తన వద్దకు తెచ్చుకొన్న ఆమె.. కూతురిని వ్యభిచార రొంపిలోకి దింపింది. అంతేగాక తన ప్రియుడి కోరిక కూడా తీర్చాలని వేధించేది. ఈ క్రమంలో ప్రియుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. మద్యానికి అలవాటు పడిన తల్లి ఆ మత్తులో తన ప్రియుడి కోరిక తీర్చాలని ఒత్తిడి చేస్తూ బాలిక వినకపోవడంతో ఆమె ప్రైవేటు అవయవాలపై కాల్చి వాతలు పెట్టింది. వేధింపులు తట్టుకోలేక ఆ బాలిక సమీపంలో ఉంటున్న తన అక్క వద్దకు వెళ్లి తలదాచుకుంది. అయితే, బాలికను తమతో పంపాలని, లేదంటే మీ కాపురం తీస్తామని తీవ్రస్థాయిలో బెదిరించారు. కాగా, తన చెల్లెలు(11), తమ్ముడు(9)ఇంకా తల్లి వద్దే ఉంటున్నారని, చెల్లిలి పరిస్థితి కూడా తమ లాగే తయారవుతుందేమోనని ఆ అక్కాచెల్లెళ్లు భయపడుతున్నారు. తమపట్ల కర్కశంగా, నీచంగా ప్రవర్తిస్తున్న తమ తల్లితో పాటు ఓ ప్రైవేటు బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న ఆమె ప్రియుడి నుంచి రక్షణ కల్పించాలని వారు వేడుకున్నారు. తమ నలుగురినీ చదివించలేదని, కనుక కూలి పనులు చేసుకుని జీవనం సాగించేలా తమకు ఆసరా కల్పించాలని వారు ఎస్పీ కార్యాలయంలో ఇచ్చిన ఫిర్యాదులో వేడుకున్నారు.
Updated Date - 2024-02-06T07:25:57+05:30 IST