వివేకానంద జీవితం అనుసరణీయం
ABN, Publish Date - Jan 12 , 2024 | 11:58 PM
‘భారతజాతి గొప్పదనాన్ని విశ్వవ్యాప్తం చేసి, బోధనలతో యువతకు మార్గనిర్దేశం చేసిన స్వామి వివేకానందుని జీవితం అనుసరణీయం. ఆయన స్ఫూర్తితో యువత జీవితంలో ముందుకు సాగాలి’ అని ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు పిలుపునిచ్చారు.
- ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు
అరసవల్లి, జనవరి 12: ‘భారతజాతి గొప్పదనాన్ని విశ్వవ్యాప్తం చేసి, బోధనలతో యువతకు మార్గనిర్దేశం చేసిన స్వామి వివేకానందుని జీవితం అనుసరణీయం. ఆయన స్ఫూర్తితో యువత జీవితంలో ముందుకు సాగాలి’ అని ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా శుక్రవారం స్థానిక సూర్యమహల్ జంక్షన్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎంపీ రామ్మోహన్నాయుడు మాట్లాడుతూ.. ‘యువతలో శక్తిని మేల్కొలిపి.. వారిని విజయం వైపు నడిపించే వివేకానంద జీవితచరిత్రను ప్రతి ఒక్కరూ చదవాలి. వివేకానందుడు కేవలం 39 ఏళ్లు మాత్రమే జీవించినా, సమాజానికి స్ఫూర్తిప్రదాతగా నిలిచారు. నేటి యువత చాలామంది మానసికంగా వెనుకబడుతున్నారు. వారు వివేకానందుని సూక్తులను అనుసరించాలి. స్వామి చూపిన మార్గంలో యువత నడిస్తే భారతదేశం ప్రపంచానికే తలమానికం అవుతుంది’ అని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి మాట్లాడుతూ వివేకానందుడి స్ఫూర్తితో యువత గొప్ప విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జామి భీమశంకరరావు, అంధవరపు సూరిబాబు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పద్మావతి, అంధవరపు ప్రసాద్, సురంగి మోహనరావు, విజికె మూర్తి, పెద్ద ఎత్తున యువత, విద్యార్థులు పాల్గొన్నారు.
Updated Date - Jan 12 , 2024 | 11:58 PM