వాయు‘గండం’
ABN, Publish Date - Nov 25 , 2024 | 11:39 PM
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ ప్రభావంతో కోస్తా జిల్లాల్లో రెండురోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
- వాతావరణంలో మార్పులు
- ఆందోళనలో ధాన్యం రైతులు
- భద్రపరిచేందుకు అవస్థలు
టెక్కలి/ పలాస రూరల్/ మెళియాపుట్టి/ గార/ నందిగాం, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ ప్రభావంతో కోస్తా జిల్లాల్లో రెండురోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ క్రమంలో సోమవారం ఆకాశంలో దట్టమైన మబ్బులు కమ్ముకుని.. వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తుఫాన్ గుబులు వారిని వెంటాడుతోంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో వరి పంట ఆశాజనకంగా ఉండడంతో రైతులు ఎంతో సంబరపడ్డారు. ప్రస్తుతం పొలాల్లో వరి కోతలు చేపడుతున్నారు. ధాన్యాన్ని విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నారు. కాగా.. జిల్లాలో ఇప్పటివరకూ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. ప్రస్తుతం తుఫాన్ గుబులు వెంటాడుతున్న నేపథ్యంలో ఆ ధాన్యాన్ని భద్రపరిచే పనిలో నిమగ్నమయ్యారు. టెక్కలి, పలాస, మెళియాపుటి, గార, నందిగాం మండలాల్లోని పలు గ్రామాల్లో రైతులు ధాన్యాన్ని బస్తాల్లో నింపి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పలాస మండలం రెంటికోట, తర్లాకోట, కైజోల, కొత్తూరు, సవరగోవిందపురం, సుబ్బుగుడ్డి, దానగొర, హిమగిరి, మహాదేవపురం, సున్నాడ తదితర గ్రామాల్లో వరికుప్పలుపై టార్పన్లు కప్పారు. ఈ సమయంలో వర్షాలు కురిస్తే తమకు తీవ్ర నష్టమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభించకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదని వాపోతున్నారు.
Updated Date - Nov 25 , 2024 | 11:39 PM