ముఖ్యమంత్రి పర్యటన రద్దు
ABN, Publish Date - Sep 19 , 2024 | 11:54 PM
ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన రద్దయింది. కూటమి ప్రభుత్వం కొలువుతీరాక.. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా చంద్రబాబునాయుడు శుక్రవారం జిల్లాలో పర్యటించేందుకు ముందుగా షెడ్యూల్ ఖరారైంది.
- వాతావరణం అనుకూలించకపోవడమే కారణం
శ్రీకాకుళం, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన రద్దయింది. కూటమి ప్రభుత్వం కొలువుతీరాక.. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా చంద్రబాబునాయుడు శుక్రవారం జిల్లాలో పర్యటించేందుకు ముందుగా షెడ్యూల్ ఖరారైంది. ‘ఇది మంచి ప్రభుత్వం’ పేరుతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టి.. ఇచ్ఛాపురం నియోజకవర్గం కవిటి మండలం రాజపురంలో నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వారితో సీఎం మాట్లాడాల్సి ఉంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే బెందాళం అశోక్ పరిశీలించారు. గురువారం ఉదయం హెలీప్యాడ్ వద్దకు చేరుకుని.. అధికారులకు పలు సూచనలు చేశారు. అయితే బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా గురువారం సాయంత్రం వర్షాలు కురిశాయి. శుక్రవారం కూడా వాతావరణం అలానే ఉంటుందని.. సమాచారం అందింది. హెలీకాఫ్టర్లో పయనించేందుకు వాతావరణం అనుకూలించదని అధికారులు నివేదించారు. దీంతో ముఖ్యమంత్రి పర్యటన రద్దయిందని రాష్ట్ర వ్యవయసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గురువారం రాత్రి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం వాయిదా పడిందని వెల్లడించారు.
Updated Date - Sep 19 , 2024 | 11:55 PM