‘విప్’గా బెందాళం అశోక్...
ABN, Publish Date - Nov 12 , 2024 | 11:46 PM
ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ను విప్గా ప్రభుత్వం నియమించింది. 2014లో టీడీపీ తరపున తొలిసారిగా ఇచ్ఛాపురం నుంచి పోటీ చేసి బెందాళం అశోక్ గెలుపొందారు.
- నమ్మకానికి దక్కిన ఫలితం
- టీడీపీ కంచుకోట ఇచ్ఛాపురానికి లభించిన గౌరవం
శ్రీకాకుళం, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ను విప్గా ప్రభుత్వం నియమించింది. 2014లో టీడీపీ తరపున తొలిసారిగా ఇచ్ఛాపురం నుంచి పోటీ చేసి బెందాళం అశోక్ గెలుపొందారు. 2019లో జగన్ హవాలోనూ ఇచ్ఛాపురం నియోజకవర్గ ప్రజలు టీడీపీ వైపే నిలిచి అశోక్కు పట్టం కట్టారు. తాజాగా ఈసారి (2024) ఎన్నికల్లో కూడా అశోక్ను మూడోసారి గెలిపించారు. ఇచ్ఛాపురం నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా గుర్తింపు సాధించింది. పదిసార్లు అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా.. తొమ్మిదిసార్లు టీడీపీ అభ్యర్థులే గెలుపొందారు. ప్రజలకు టీడీపీపై మక్కువ ఉన్న ఈ నియోజకవర్గానికి గౌరవం కల్పిస్తూ.. ఎమ్మెల్యే బెందాళం అశోక్కు అసెంబ్లీ విప్గా పదవిని రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఈ నెల 1న ఈ నియోజకవర్గంలో దీపం-2 పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఆ సమయంలో ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడం.. ఎమ్మెల్యే అశోక్ పనితీరు సీఎం మెచ్చుకున్నారు. ఈక్రమంలో విప్ పదవి వరించింది.
సీఎం నమ్మకాన్ని వమ్ము చేయను
టీడీపీ కోసం నిరంతరం శ్రమించాం. మా కష్టానికి గుర్తింపు లభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అపారమైన నమ్మకంతో ‘విప్’ పదవి ఇచ్చారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయను. ప్రజల సమస్యల పరిష్కారంతోపాటు జిల్లా అభివృద్ధిలో భాగస్వామిని అవుతా.
- బెందాళం అశోక్, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే
..............
- ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవికి కూడా..
వైసీపీ ప్రభుత్వంలో మొదటి తిరుగుబాటు బావుటా ఎగరవేసింది ‘ఉత్తరాంధ్ర పట్టభద్రులు’ మాత్రమే. రెండేళ్ల కిందట ఉత్తరాంధ్ర పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలో నిలిచిన వేపాడ చిరంజీవిని పట్టభద్రులు ఊహించని మెజార్టీతో గెలిపించారు. దీంతో ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో ఎంత ఉందో వైసీపీ అధిష్టానానికి సంకేతం వెల్లడైంది. చిరంజీవి ఉన్నత విద్యావంతుడు.. పైగా ఉత్తరాంధ్రలో నిరుద్యోగుల కోసం సొంతంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టారు. దీంతో ఆయనకు శాసనమండలి ‘విప్’ గా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీచేసింది.
Updated Date - Nov 12 , 2024 | 11:46 PM