ఇసుక మాఫియా బరితెగింపు
ABN, Publish Date - Oct 27 , 2024 | 12:20 AM
ఘంటసాల మండలం పాపవినాశనంలో ఇసుక మాఫియా బరితెగించింది. ప్రవహిస్తున్న నదిలో నుంచి పడవులతో ఇసుక ఒడ్డుకు తెప్పిస్తోంది. ట్రాక్టర్లలో యథేచ్ఛగా తరలించి సొమ్ము చేసుకుంటోంది. ఇదేంటని ప్రశ్నించిన స్థానికులు, మీడియా వారిపై ఎదురుదాడికి తిగుతోంది. దురుసుగా వ్యవహరించి భయ భ్రాంతులకు గురిచేస్తోంది. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
- పాపవినాశనంలో ఇసుక దందా
- పడవల్లో ఇసుక తెచ్చి ట్రాక్టర్లలో తరలింపు
- అటువైపు కన్నెత్తి చూడని రెవెన్యూ, పోలీస్ అధికారులు
- ప్రశ్నించిన స్థానికులు, మీడియాపై ఎదురుదాడి
ఘంటసాల మండలం పాపవినాశనంలో ఇసుక మాఫియా బరితెగించింది. ప్రవహిస్తున్న నదిలో నుంచి పడవులతో ఇసుక ఒడ్డుకు తెప్పిస్తోంది. ట్రాక్టర్లలో యథేచ్ఛగా తరలించి సొమ్ము చేసుకుంటోంది. ఇదేంటని ప్రశ్నించిన స్థానికులు, మీడియా వారిపై ఎదురుదాడికి తిగుతోంది. దురుసుగా వ్యవహరించి భయ భ్రాంతులకు గురిచేస్తోంది. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఘంటసాల, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి) :
ఘంటసాల మండలం పాపవినాశనం ఇసుక క్వారీ నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. కృష్ణానదిలో వరద నీరు ప్రవహిస్తుండటంతో పడవల సహాయంతో ఇసుక తరలింపునకు ఇసుక మాఫియా శ్రీకారం చుట్టింది. ఐదు పడవల్లో 15 మంది వ్యక్తులు ఇసుకను తెచ్చి ట్రాక్టర్లలో లోడ్ చేస్తున్నారు. ఒక్కొక్క ట్రాక్టర్కు సుమారు రూ.2500 తీసుకుంటున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ప్రశ్నించగా, వారిపై కూడా మాటల దాడికి ఈ మాఫియా దిగి.. మాకు అనుమతులు ఉన్నాయి.. ఎవరు ఆపుతారో చూస్తామని రెచ్చిపోయింది. పాపవినాశనం ఇసుక క్వారీ నుంచి శనివారం తెల్లవారుజామున 5.30 గంటల నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తుంటే రెవెన్యూ, పోలీస్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు. క్వారీలోకి బహిరంగంగా వాహనాలు వస్తూ ఇసుకను తరలించుకుపోతున్నా పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మీడియాపైనా దురుసు ప్రవర్తన :
పాపవినాశనం క్వారీలో అక్రమంగా ఇసుక లోడింగ్ చేస్తున్న విషయం తెలుసుకున్న స్థానిక పాత్రికేయులు అక్కడికెళ్లి ఫొటోలు తీస్తుండగా.. ఎందుకు ఫొటోలు తీస్తున్నారని ట్రాక్టర్ డ్రైవర్లు ప్రశ్నించారు. మాకు అనుమతులు ఉన్నాయని మీడియా ప్రతినిధులపై వాదనకు దిగి దురుసుగా ప్రవర్తించారు. ఈ నేపథ్యంలో ఇసుక తరలింపు విషయం సోషల్ మీడియాలో రావడంతో రెవెన్యూ యంత్రాంగంలో కదలిక వచ్చింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో తహసీల్దార్ విజయ ప్రసాద్ సిబ్బందితో కలసి పాపవినాశనం క్వారీని పరిశీలించారు.
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు: తహసీల్దార్
కృష్ణానదికి వరద నీరు తగ్గిన తర్వాత ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తాం. పడవల్లో ఇసుక తెచ్చి ట్రాక్టర్లలో తరలింపు చట్టవిరుద్ధం. నదిలోకి వెళ్లటానికి ఎవరికి అనుమతులు లేవు. పాపవినాశనం క్వారీలో అక్రమ ఇసుక తరలింపు విషయం నా దృష్టికి వచ్చింది. అక్కడకెళ్లి వాహనదారులను హెచ్చరించి బయటకు పంపించేశాం. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
Updated Date - Oct 27 , 2024 | 12:20 AM