హద్దురాళ్లపై జగనన్న పేర్ల తొలగింపు
ABN, Publish Date - Dec 13 , 2024 | 11:38 PM
ఇది నా రాజ్యం అడ్డు చెప్పేవారు ఎవరన్నట్లు గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చిన పంట భూములలో వైఎ్సఆర్ జగనన్న భూరక్ష అంటూ సర్వే హద్దు రాళ్లను జగన్ ఫొటోతో భారీ సంఖ్యలో ఏర్పాటు చేశారు. అప్పట్లోనే రైతులు ఈ రాళ్లపై తీవ్ర వ్యతిరేకత తెలిపారు.
అప్పట్లోనే రైతుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత
వైసీపీ హయాంలో చేసిన తప్పులను కూటమి ప్రభుత్వం దిద్దుబాటు
హర్షం వ్యక్తం చేస్తున్న కర్షకులు
బల్లికురవ, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి) : ఇది నా రాజ్యం అడ్డు చెప్పేవారు ఎవరన్నట్లు గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చిన పంట భూములలో వైఎ్సఆర్ జగనన్న భూరక్ష అంటూ సర్వే హద్దు రాళ్లను జగన్ ఫొటోతో భారీ సంఖ్యలో ఏర్పాటు చేశారు. అప్పట్లోనే రైతులు ఈ రాళ్లపై తీవ్ర వ్యతిరేకత తెలిపారు. తమ వారసత్వ భూములలో జగన్ పేరు ఎమిటి అని అసహనం వ్యక్తం చేశారు. రైతుల బాధలు తెలుసుకున్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు దృష్టికి కూడా తీసుకువెళ్లారు. తాము అధికారంలోకి రాగానే రాళ్లపై జగన్ పేరును తొలగిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పంట భూములలో పాతిన హద్దు రాళ్లతోపాటు గ్రామాలలో నిల్వ ఉన్న రాళ్లపై జగన్ పేరు తొలగించేలా ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు నాలుగు రోజుల నుంచి అన్ని గ్రామాలలో హద్దు రాళ్లపై జగన్ పేర్ల తొలగింపు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బాపట్ల జిల్లా పరిధిలోని బాపట్ల, చీరాల, రేపల్లె రెవెన్యూ డివిజన్ పరిధిలోని 22 మండలాల్లో ఉన్న 102 గ్రామాలలో ఈ ప్రక్రియ మొదలైంది. పది రోజుల్లో పూర్తి చేసేలా శరవేగంగా పనులు చేస్తున్నారు. కొన్ని గ్రామాలలో వరి పంట ఉండటం వలన పొలాల మీదకు వెళ్లి రాళ్లపై పేర్లు తొలగించే పనులు ఆలస్యం కానున్నాయని అధికారులు అంటున్నారు.
అత్యధికంగా బల్లికురవ మండలంలో సర్వే హద్దు రాళ్లు
బల్లికురవ మండలంలో గొరెప్రాడు కొణిదెన, ముక్తేశ్వరం, ఎస్ఎల్ గుడిపాడు, బల్లికురవ, కొప్పెరపాడు, కూకట్లపల్లి, వైదన, వల్లాపల్లి, వేమవరం గ్రామాలలో రీసర్వే పనులు జరిగాయి. ఈ గ్రామాలలో జిల్లాలో కంటే అత్యధికంగా సర్వే హద్దు రాళ్లను అధికారులు ఏర్పాటు చేయించారు. సుమారు రూ. 50 వేల రాళ్లు రైతుల భూముల్లో పాతి ఉన్నాయి. ఈ రాళ్లపై ఉన్న జగన్ పేరు తొలగించేందుకు బల్లికురవ మండలానికి ప్రత్యేక టీంలు వచ్చాయి. ఈ పనులు వేగవంతంగా పూర్తి చేయిస్తామని తహసీల్దార్ రవినాయక్, సర్వేయర్ కిషోర్లు తెలిపారు. హద్దు రాళ్లపై ఉన్న పేర్లను తొలగిస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలానే జగన్ బొమ్మలు వేసి ఉన్న పట్టాదారు పుస్తకాలను కూడా మార్చి నూతనంగా అందజేయాలని కోరుతున్నారు.
Updated Date - Dec 13 , 2024 | 11:38 PM