జైశ్రీరామ్..
ABN, Publish Date - Jan 23 , 2024 | 01:16 AM
అయోధ్యలోని శ్రీరామ మందిరంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా సోమ వారం జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది.
బాలరాముని ప్రతిష్ఠతో పులకించిన భక్తజనం
వాడవాడలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు
ఇళ్లలో దీపాలు వెలిగించి, అక్షతలు చల్లుకున్న ప్రజలు
ఒంగోలు (కల్చరల్), జనవరి 22 : అయోధ్యలోని శ్రీరామ మందిరంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా సోమ వారం జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది. ప్రజలు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. మరోవైపు ఎన్నో ఏళ్ల కల సాకారమవుతున్న శుభతరుణాన్ని టీవీలు, ఎల్ఈడీ స్ర్కీన్లపై చూస్తూ పులకించిపోయారు. శ్రీసీతారామ కల్యాణా లు, శోభాయాత్రలు, రథయాత్రలు నిర్వహించారు. జై శ్రీరామ్ నినాదాలతో ఆనందపరవశులయ్యారు. సోమవారం మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో రామ్లల్లా విగ్రహాన్ని ప్రధాని మోదీ ప్రారంభించగా ప్రత్యేక పూజలు, విశేష అలంకరణలను ప్రజలు తమ ఇళ్లలో టీవీల ద్వారా తిలకించారు. మరోవైపు ఆ సుందర దృశ్యాన్ని అందరూ చూసే విధంగా విద్యాలయాలు, పలు దేవాలయాలు, ఆధ్యాత్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద స్ర్కీన్లను ఏర్పాటు చేశారు. నిత్యం రాజకీయాల గురించి చర్చించుకునే అనేకమంది సోమవారం మాత్రం ఎక్కడచూసినా శ్రీరామ ఉత్సవం గురించే మాట్లాడుకోవడం కనిపించింది. ఇక రాత్రికి ఇళ్లలో, దేవాలయాల్లో దీపాలు వెలిగించి, అయోధ్య నుంచి తెచ్చి ఇంటింటికీ పంపిణీ చేసిన అక్షతలను తలపై చల్లుకున్నారు.
Updated Date - Jan 23 , 2024 | 01:16 AM