ఉత్సాహంగా టీడీపీ సభ్యత్వ నమోదు
ABN, Publish Date - Oct 27 , 2024 | 01:40 AM
జిల్లాలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం శనివారం ఉత్సాహంగా ప్రారంభమైంది. పల్లె, పట్టణం తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ తెలుగు తమ్ముళ్లు ఎక్కడికక్కడ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
కొండపిలో ప్రారంభించిన మంత్రి స్వామి
రూ.లక్ష చెల్లించి శాశ్వత సభ్యత్వం
వైపాలెంలో తొలిరోజే 16 మంది నమోదు
ఒంగోలు, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం శనివారం ఉత్సాహంగా ప్రారంభమైంది. పల్లె, పట్టణం తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ తెలుగు తమ్ముళ్లు ఎక్కడికక్కడ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. నియోజకవర్గ కేంద్రాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి సభ్యత్వ నమోదు ప్రారంభించడంతోపాటు వారు కూడా తీసుకున్నారు. ఈసారి రూ.లక్ష చెల్లించి శాశ్వత సభ్యత్వం పొందే అవకాశాన్ని అధి ష్ఠానం కల్పించడంతో పలువురు ప్రముఖులు స్వీకరించారు. అందులో వెనుకబడిన ప్రాంతమైన, ఎన్నికల్లో ఓటమి చెందినా ఏమాత్రం ఉత్సాహం తగ్గకుండా పనిచేస్తున్న వైపాలెం నియోజకవర్గంలో తొలిరోజే ఏకంగా 16 మంది రూ.లక్ష వంతున చెల్లించి శాశ్వత సభ్యత్వం పొందారు. రెండు నెలలపాటు ఈ ప్రక్రియ సాగనుంది. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తెచ్చి సులభంగా సభ్యత్వం పొందేలా ఏర్పాట్లు చేశారు. దీంతో పార్టీశ్రేణులు అనేక మంది ఎవరి సెల్ఫోన్లో వారు రూ.వంద చెల్లించి రెండేళ్లపాటు సాధారణ సభ్యత్వం తీసుకుంటున్నారు.
కొండపిలో ప్రారంభించిన మంత్రి
మంత్రి డాక్టర్ స్వామి శనివారం ఉదయం కొండపిలో సభ్యత్వ నమోదు ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం స్థానిక నేతలు సభ్యత్వం పొందారు. ఒంగోలులో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయనతోపాటు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి చెరో లక్ష చెల్లించి శాశ్వత సభ్యత్వం పొందారు. పలువురు ఇతర నాయకులు సాధారణ సభ్యత్వం తీసుకున్నారు. కనిగిరిలో ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించి తాను రూ.లక్ష చెల్లించి శాశ్వత సభ్యత్వం తీసుకోగా మార్కాపురంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సభ్యత్వ నమోదును ప్రారంభించారు. యర్రగొండపాలెంలో జరిగిన సమావేశంలో అక్కడి టీడీపీ ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్బాబుతోపాటు మరో 15మంది నియోజకవర్గ నాయకులు రూ.లక్ష చెల్లించి శాశ్వత సభ్యత్వం తీసుకున్నారు. దర్శిలో జరిగిన కార్యక్రమంలో ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మితోపాటు మరో ఇద్దరు కూడా శాశ్వత సభ్యులుగా చేరారు. మండల కేంద్రమైన మద్దిపాడులో జరిగిన కార్యక్రమంలో సీనియర్ నేత, ఏఎంసీ మాజీ చైర్మన్ మండవ రంగారావు సభ్యత్వం తీసుకోగా సంతనూతలపాడు మండలం మంగమూరులో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి అడకా స్వాములు పాల్గొన్నారు. జిల్లావ్యాప్తంగా పలు మండల కేంద్రాలు, గ్రామాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగింది.
Updated Date - Oct 27 , 2024 | 01:40 AM