YS Sharmila : 21న పీసీసీ సారథిగా షర్మిల బాధ్యతల స్వీకరణ
ABN, Publish Date - Jan 18 , 2024 | 03:47 AM
రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల ఈ నెల 21న బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిసింది.
పీసీసీ సారథిగా షర్మిల బాధ్యతల స్వీకరణ
తండ్రి సమాధి వద్ద.. ఆయన వారసురాలిగా!
హాజరు కానున్న రాష్ట్ర ఇన్చార్జి ఠాగూర్
అదే రోజు పలువురు నేతలు కాంగ్రెస్లో చేరిక
నేడు కుమారుడి నిశ్చితార్థం.. రేపు సీనియర్లతో భేటీ
అమరావతి, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల ఈ నెల 21న బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిసింది. ఇడుపులపాయలో తన తండ్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి సమాధి చెంత ఆమె పీసీసీ పగ్గాలు చేపడతారని సమాచారం. వైఎస్ అనుచరులు, అభిమానులు పెద్దఎత్తున అక్కడకు చేరుకుని ఆమెకు మద్దతు పలుకనున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ ప్రత్యేక అతిథిగా హాజరవుతారు. కేంద్ర మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, వర్కింగ్ కమిటీ సభ్యులు, సీనియర్ నేతలు పాల్గొంటారు. రాష్ట్ర విభజనతో ఆంధ్రలో నామరూపాల్లేకుండా పోయిన కాంగ్రె్సలో జవసత్వాలు నింపేందుకు ఆ పార్టీ అగ్ర నాయకత్వం ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కర్ణాటకలో డీకే శివకుమార్ను కేపీసీసీ అధ్యక్షుడిగా నియమించిన ఏఐసీసీ.. తెలంగాణలో రేవంత్రెడ్డికి పగ్గాలు అప్పగించి అనూహ్యంగా అధికారం కైవసం చేసుకుంది. ఇప్పుడు ఆంధ్రలో పుంజుకోవడానికి వైఎస్ కుమార్తెను బరిలోకి దించుతోంది. తమ ఓటు బ్యాంకు అయిన ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలతో పాటు రెడ్డి సామాజికవర్గాన్ని కూడా తిరిగి తన వైపు లాక్కునేందుకు జగన్ చెల్లెలినే మోహరిస్తోంది.
ఇడుపులపాయ నుంచే...
కుమారుడు రాజారెడ్డి వివాహ పత్రికను తండ్రి సమాధిపై ఉంచిన తర్వాతే తాడేపల్లి వచ్చి అన్నను ఆహ్వానించిన ఆమె.. అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లి కాంగ్రె్సలో చేరిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 17న ఆమె కుమారుడి పెళ్లి. గురువారం హైదరాబాద్లో నిశ్చితార్థ వేడుక జరుపనున్నారు. మర్నాడు శుక్రవారం రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ముఖ్య నాయకులు, తన తండ్రి అనుచరులతో సమావేశమవుతారు. 21న ఇడుపులపాయలో బాధ్యతలు స్వీకరిస్తారని పీసీసీ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత ఆమె తన కార్యాచరణ ప్రకటించి నేరుగా ప్రజల్లోకి వెళ్తారని తెలుస్తోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణం, రైల్వే జోన్, రాజధాని నిర్మాణం సహా అన్ని విభజన హామీల అమలు కాంగ్రె్సతోనే సాధ్యమంటూ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తారని సమాచారం. బడుగు, బలహీన, మైనారిటీలకు కాంగ్రె్సతోనే న్యాయం జరుగుతుందని చెబుతారు. జగన్ ఆ వర్గాలను ఓటుబ్యాంకులుగా చూడడం తప్ప వారి అభివృద్ధికి చేసిందేమీ లేదని, అంబేడ్కర్ విద్యా దీవెన లాంటి పథకాలకు వాటికి తన పేరు పెట్టుకోవడాన్ని కూడా ప్రస్తావించనున్నట్లు తెలిసింది.
వైసీపీ ఓట్లు చీల్చేస్తాం!
తండ్రిని కోల్పోయిన జగన్ పట్ల ప్రజలు ఒకప్పుడు చూపిన సానుభూతి ఆయనకు ఓట్లు కురిపించిందని.. వాటిని తాము చీల్చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేతలు ధీమాగా చెబుతున్నారు. రాయలసీమలో సుమారు 9 శాతం, ఇతర జిల్లాల్లో 6 శాతం వరకూ వైసీపీ ఓట్లను కాంగ్రెస్ చీల్చే అవకాశముందని విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. వైసీపీ నుంచి పలువురు ప్రజాప్రతినిధులతోపాటు కాంగ్రె్సకు, రాజకీయాలకు దూరంగా ఉంటున్న పాత నేతలంతా ఇప్పుడు క్యూ కడతారని చెబుతున్నారు.
Updated Date - Jan 18 , 2024 | 08:03 AM