పటిష్ట తనిఖీలు చేపట్టండి
ABN, Publish Date - Mar 25 , 2024 | 12:34 AM
సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా జాతీయ రహదారులపై వాహనాలను పటిష్టంగా తనిఖీ చేయాలని కర్నూలు రేంజ్ డీఐజీ సీహెచ్ విజయరావు సిబ్బందిని ఆదేశించారు.
అక్రమ రవాణా జరగకుండా నిఘా ఉంచాలి
చెక్పోస్టులను తనిఖీ చేసిన కర్నూలు రేంజ్ డీఐజీ విజయరావు
కర్నూలు, మార్చి 24: సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా జాతీయ రహదారులపై వాహనాలను పటిష్టంగా తనిఖీ చేయాలని కర్నూలు రేంజ్ డీఐజీ సీహెచ్ విజయరావు సిబ్బందిని ఆదేశించారు. ఆదివారం తాలుకా పోలీస్స్టేషన్ పరిధిలోని అంతర్రాష్ట్ర సరిహద్దున ఉన్న కర్నూలు పంచలింగాల చెక్పోస్టును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెక్పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ ఎన్నికల నియమావళికి విరుద్ధంగా తరలించే నగదు, మద్యం, ఇతర కానుకల రవాణాలను అరికట్టాలన్నారు. సరైన ఆధారాలు లేకుండా రూ.50వేలకు మించి నగదు లభ్యమైతే సీజ్ చేసి సంబంధిత అధికారులకు అప్పగించాలన్నారు. చెక్పోస్టుల వద్ద విధుల్లో నిర్లక్ష్యం చేస్తే ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికలు పూర్తయ్యేవరకు పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వేసవి కాలంలో ఎండల తీవ్రత ఎక్కువ ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విధులు నిర్వహించే సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తెల్లని టోపీలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించాలని సంబంధిత పోలీసు అధికారులను డీఐజీ ఆదేశించారు. డీఐజీ వెంట కర్నూలు తాలుకా సీఐ శ్రీధర్, ఎస్ఐ పీరయ్య, సెబ్, కమర్షియల్ ట్యాక్స్, ఆర్టీఓ సిబ్బంది ఉన్నారు.
Updated Date - Mar 25 , 2024 | 12:34 AM