రెండు కార్లు ఢీకొని ఇద్దరి దుర్మరణం
ABN, Publish Date - Nov 25 , 2024 | 12:08 AM
రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఇద్దరు దుర్మ రణం చెందారు. కర్నూలు-చిత్తూరు 40వ జాతీయ రహదారిపై శిరివెళ్ల మండలం గోవిందపల్లె గ్రామ సమీపంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది.
కన్నీటిపర్యంతమైన మృతుల స్నేహితులు, బంధువులు
శిరివెళ్ల, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి) : రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఇద్దరు దుర్మ రణం చెందారు. కర్నూలు-చిత్తూరు 40వ జాతీయ రహదారిపై శిరివెళ్ల మండలం గోవిందపల్లె గ్రామ సమీపంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. నంద్యాల పట్టణంలోని నడిగడ్డకు చెందిన షేక్ ఖాదర్ బాషా శిరివెళ్లలోని బంధువుల ఇంట్లో జరుగుతున్న ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు కారులో బయలుదేరాడు. శిరివెళ్ల మండలం గోవిందపల్లె గ్రామ సమీపంలో కారు టైరు పేలడంతో అదుపు తప్పింది. దీంతో డివైడర్ను ఢీకొట్టి రోడ్డు దాటి కర్నూలుకు వెళ్తున్న చంద్రశేఖర్ కుటుంబం ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ కారు నడుపుతున్న షేక్ ఖాదర్ బాషా (24), మరో కారులోని చంద్రశేఖర్(65) అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు చంద్రశేఖర్ భార్య ఈశ్వరమ్మ, కుమారుడు రవి కుమార్ తీవ్రంగా గాయపడడంతో వారిని 108 వాహనంలో నంద్యాల వైద్యశాలకు తరలించారు. శిరివెళ్ల ఎస్ఐ చిన్న పీరయ్య తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ప్రమాదం చోటుచే సుకున్న తీరును పరిశీలించారు. మృతదేహాలను పంచనామా నిమిత్తం నం ద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. జాతీయ రహదారిపై వాహ నాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.
చంద్రశేఖర్ రిటైర్డు ఎస్ఐ..
చంద్రశేఖర్ ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ, ఉయ్యాలవాడ, సంజామల, నందివర్గం తదితర పోలీస్ స్టేషన్లలో పని చేసి 2022లో ఎస్ఐగా పదవీ విరమణ పొంది శేష జీవితం గడుపుతున్నాడు. ఈ నెల 22వ తేదీన భార్య, కుమారుడితో కలిసి పుణ్యక్షేత్రాలు దర్శించుకునేందుకు కారులో బయలుదేరి వెళ్లారు. అరుణాచలేశ్వరుడి దర్శనానంతరం ఆదివారం ఉదయం కర్నూలుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఖాదర్ బాషా మాత్రం నంద్యాలలోని ఓ పేపర్ ప్లేట్ల తయారీ దుకాణంలో పని చేసేవాడు.
స్నేహితుడి మృతిని జీర్ణించుకోలేక..
కలిసిమెలిసి స్నేహం చేసిన మిత్రుడు ఖాదర్ బాషాను విగతజీవిగా చూడడంతో సహచర స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు ప్రజలను సైతం కంటతడి పెట్టించింది. శుభకార్యంలో సందడిగా గడపాల్సిన యువకుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడన్న చేదు నిజాన్ని స్నేహితులు, బంధువులు జీర్ణించుకోలేకపోయారు. షేక్ ఖాదర్ బాషా మృతదేహాన్ని పంచానామా నిమిత్తం తరలించే సమయంలో వారి రోదనలు మిన్నంటాయి.
Updated Date - Nov 25 , 2024 | 12:08 AM