పత్తికొండకు ‘రా..కదలిరా’
ABN, Publish Date - Jan 20 , 2024 | 12:19 AM
రాయలసీమ జిల్లాల్ల్లో వైసీపీని దెబ్బకొట్టి మెజార్టీ స్థానాలు కైవసం చేసుకునే లక్ష్యంగా చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
25న టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ సభ
లక్ష మంది సమీకరణ లక్ష్యం
సభా వేదిక, పార్కింగ్ స్థలాల పరిశీలన
కర్నూలు (ఆంధ్రజ్యోతి)/పత్తికొండ, జనవరి 19 : రాయలసీమ జిల్లాల్ల్లో వైసీపీని దెబ్బకొట్టి మెజార్టీ స్థానాలు కైవసం చేసుకునే లక్ష్యంగా చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కురుక్షేత్రానికి పసుపు సైన్యాన్ని సన్నద్ధం చేస్తూ.. గెలుపు గుర్రాల ఎంపికపై దృష్టి సారించారు. సీఎం జగన్ ప్రజా వ్యతిరేక విధానాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జరుగుతున్న అన్యాయాలను ఎండగడుతూ ‘రా..కదలిరా’ కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే ఈ నెల 25న పత్తికొండకు టీడీపీ అధినేత చంద్రబాబు రానున్నారు.
ఉమ్మడి జిల్లాలో కర్నూలు, నంద్యాల లోక్సభ స్థానాలు, 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ మొత్తం స్థానాలు కైవసం చేసుకొని క్లీన్ స్వీప్ చేసింది. రాబోయే ఎన్నికల్లో దానిని తిరిగి రాయాలనే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ వ్యూహాలకు పదును పెట్టారు. ఉద్యోగులు, వ్యాపారులు, నిరుద్యోగ యువతలో జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. తాజాగా గ్రామాల్లో కూడా వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెల్లుబుకుతోంది. ఈ తరుణంలో రాబోయే ఎన్నికల్లో ప్రతి ఓటు టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి ఖాతాలో పడే దిశగా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగానే 25న పత్తికొండలో నిర్వహించే రా కదలిరా సభలో చంద్రబాబు పాల్గొని ప్రసగింస్తారు. ఈ సభకు లక్ష మంది జన సమీకరణ లక్ష్యంగా శుక్రవారం పత్తికొండ టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు అధ్వర్యంలో సన్నాహాక సమావేశం జరిగింది. టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఉమ్మడి జిల్లా పరిశీలకుడు, అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, పత్తికొండ పరిశీలకురాలు పెనుకొండ కవితమ్మ, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, కర్నూలు పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజక వర్గాల ఇన్చార్జిలు మాజీ ఎమ్మెల్యేలు కె.మీనాక్షి నాయుడు, కోట్ల సూజాతమ్మ, బీవీ జయనాగేశ్వ రెడ్డి, టీజీ భరత్, ఆకెపోగు ప్రభాకర్, కేఈ శ్యాంబాబు, పి.తిక్కారెడ్డి, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ బత్తిన వెంకటరాముడు సహా తెలుగు మహిళా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముంతాజ్బేగం, మాజీ జడ్పీటీసీ సభ్యురాలు ఈ.సుకన్యాదేవి సహా ఆయా నియోజకవర్గాల ముఖ్య నాయకులు హాజరయ్యారు. నియోజకవర్గాల వారిగా జన సమీకరణ, సభను విజయవంతం చేసేందుకు ఏ నాయకుడు ఏ బాధ్యత నిర్వర్తించాలో చర్చించి నియోజకవర్గం ఇన్చార్జిల వారిగా బాధ్యతలు అప్పగించారు. గత ఏడాది సెప్టెంబరు 9న చంద్రబాబు అక్రమ అరెస్టు తరువాత తొలిసారిగా కర్నూలు జిల్లాకు వస్తున్నారు. దీంతో రా కదలిరా సభను సూపర్ సక్సెస్ చేసే దిశగా ప్రణాళికలు రూపొందించారు.
18 ఎకరాల్లో సభ
25న ‘రా..కదలిరా’ సభావేదిక పత్తికొండ-ఆదోని రహదారిలో 18 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. వాహనాల పార్కింగ్ కోసం మరో 20 ఎకరాలు ఎంపిక చేశారు. వేదికకు సమీపంలోనే హెలిపాడ్ ఏర్పాటు చేయనున్నారు. కర్నూలు, కోడుమూరు నియోజకవర్గాల నుంచి వచ్చే వాహనాలు దేవనకొండ రోడ్డు వైపు, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం నుంచి వాహనాలు ఆస్పరి రోడ్డు వైపు పార్కింగ్ ఏర్పాటు చేయనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకే ప్రజలు సభా వేదిక మైదానానికి చేరుకోవాలి. 1:30 గంటల నుంచి 2:30 గంటల వరకు జిల్లా ముఖ్య నాయకుల ప్రసంగం ఉంటుంది. 2-2.30 గంటల మధ్యలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు హెలిపాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి సభా వేదికకు చేరుకొని 2:30 గంటల తరువాత బాబు ప్రసంగం ఉంటుందని తాత్కాలిక షెడ్యూలు రూపొందించారు. జిల్లా నాయకులు. నియోజకవర్గం ఇన్చార్జిలు సమిష్టిగా కష్టపడి ‘రా..కదలిరా’ సభను దిగ్విజయం చేసే దిశగా ప్రణాళికలు రూపొందించామని బీటీ నాయుడు వివరించారు.
Updated Date - Jan 20 , 2024 | 12:19 AM