ఎన్టీఆర్ శిలా ఫలకాన్ని ఎలా తొలగిస్తారు?
ABN, Publish Date - Oct 16 , 2024 | 12:20 AM
విజయ డెయిరీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన దివంగత ఎన్టీఆర్ శిలా ఫలకాన్ని ఎలా తీసేస్తారంటూ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మండిపడింది.
నంద్యాల, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): విజయ డెయిరీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన దివంగత ఎన్టీఆర్ శిలా ఫలకాన్ని ఎలా తీసేస్తారంటూ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మండిపడింది. శిలా ఫలకాన్ని తీసేసిన విషయం తెలుసుకున్న ఆమె మంగళవారం విజయా డెయిరీకి వచ్చారు. పక్కన పడి ఉన్న శిలా ఫలకాన్ని తీసి పాలతో కడిగారు. ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ గత ఐదేళ్లలో విజయ డెయిరీ యాజమాన్యం ఇష్టారీతిన వ్యవహరించిందని అన్నారు. ప్రభుత్వం మారినా ఇంకా జగనే సీఎం అనే భ్రమలో ఉందని విమర్శించారు. జగన్ ఫొటో డైరీలో ఉంచారని, ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అసలు ఎన్టీఆర్ శిలా ఫలకాన్ని తీసేయాల్సిన అవసరమే ఏం వచ్చిందని, ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యే సరికి ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని చెబుతున్నారని తెలిపారు. ఈ విషయం మాట్లాడటానికి వస్తే తన కుర్చీలో ఎందుకు కూర్చున్నావని చైర్మన్ ఎస్వీ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతున్నారని, ఇదేం తీరని ఆమె అన్నారు. ఇదే విషయంపై విజయ డెయిరీ చైర్మన్తో ఆంధ్రజ్యోతి మాట్లాడగా డెయిరీలోని ఓ విభాగాన్ని పునఃప్రారంభించేందుకు పనులు జరుగుతున్నాయని, ఇందులో భాగంగా ఎన్టీఆర్ శిలాఫలకాన్ని పక్కన పెట్టామని, దీనిని రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని అన్నారు. తాము కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, ప్లాంటు ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా మంత్రులైన ఎన్ఎండీ ఫరూఖ్, బీసీ జనార్దన్రెడ్డిని, మిగతా నాయకులను కూడా ఆహ్వానించామని చెప్పారు.
Updated Date - Oct 16 , 2024 | 12:20 AM