జయహో బీసీ
ABN, Publish Date - Oct 07 , 2024 | 04:08 AM
రాష్ట్రంలో పేదరికంలో ఉన్న బీసీల అభ్యున్నతే లక్ష్యంగా సమగ్ర ప్రణాళికల తయారీకి కూటమి సర్కార్ చర్యలు ప్రారంభించింది.
బీసీల స్థితిగతులపై అత్యున్నత సర్వే
ప్రముఖ సంస్థలకు బాధ్యతలు
139 కులాల వారిపై సంపూర్ణ అధ్యయనం
ఎవరికి ఏం అవసరమో గుర్తించే ప్రక్రియ
మళ్లీ కేంద్రం నుంచి ఎన్బీసీఎ్ఫడీసీ రుణం
బీసీల అభ్యున్నతికి పకడ్బందీ ప్రణాళికలు
ఏటా 3 లక్షల మందికి స్వయం ఉపాధి లక్ష్యం
రాష్ట్రంలో పేదరికంలో ఉన్న బీసీల అభ్యున్నతే లక్ష్యంగా సమగ్ర ప్రణాళికల తయారీకి కూటమి సర్కార్ చర్యలు ప్రారంభించింది. దీనిపై సీఎం చంద్రబాబు అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. స్వయం ఉపాధి మొదలుకుని.. బీసీలను పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు తోడ్పాటునివ్వాలని నిర్దేశించారు. ఇందుకోసం దేశంలో ప్రముఖ అధ్యయన సంస్థలు ఢిల్లీకి చెందిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రిసెర్చి(ఐసీఎ్సఎ్సఆర్), టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సె్స (టీఐఎ్సఎస్), సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీ(సీఎ్సడీఎస్), హైదరాబాద్కు చెందిన కౌన్సిల్ ఫర్ సోషల్ డెవల్పమెంట్(సీఎ్సడీ)లను పిలిచి అధ్యయన బాధ్యతలు అప్పజెప్పాలని సూచించారు. తద్వారా ఏటా మూడు లక్షల మందికి స్వయం ఉపాధి లక్ష్యంగా పెట్టుకున్నారు!
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీల అభ్యున్నతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం సమగ్ర సర్వేకు పూనుకుంది. బీసీ జనాభాలో అర్హులకు వివిధ పథకాల కింద ఈ ఫలాలు అందే విధంగా పకడ్బందీ చర్యలకు ఆదేశించింది. అసలు బీసీలకు సంబంధించిన 139 కులాలవారు ప్రస్తుతం ఏ వృత్తుల్లో ఉన్నారు? అన్ని కులాలకూ కుల వృత్తులున్నాయా?, ఉంటే ఎంత శాతం మంది సంప్రదాయ వృత్తులు అవలంబిస్తున్నారు?, ఏయే కులాల్లో ఎంత శాతం మంది ఏయే వృత్తుల్లో ఉన్నారు?.. వారి అవసరాలేమిటి?.. ఆర్థికంగా, ప్రభుత్వ పరంగా ఏ రకమైన సహకారమందిస్తే వారు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకుంటారు? ఈ అంశాలన్నింటిపైనా అత్యుత్తమ సంస్థలతో అధ్యయనం చేయించాలి.. ఇలా వివిధ అంశాలపై సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దేశంలో ప్రముఖ అధ్యయన సంస్థలు ఐసీఎ్సఎ్సఆర్, టీఐఎ్సఎస్, సీఎ్సడీఎస్, సీఎ్సడీలను పిలిచి అధ్యయన బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు. మెరుగైన సర్వే నిర్వహించగలిగిన సంస్థను ఎంపిక చేసి మన దగ్గర ఉన్న పల్స్సర్వే డేటా, బీసీల జనాభాకు సంబంధించిన వివరాలను క్రోడీకరించి సమగ్రమైన డేటాను రూపొందిస్తారు. వచ్చే మూడు నెలల్లో ఈ అధ్యయన ప్రక్రియ పూర్తయితే ఆ తర్వాత బీసీ సంక్షేమశాఖ బీసీలకు సంబంధించి స్వయం ఉపాధి పథకాలు ఏవైతే ఉపయోగమో? గుర్తించి ఆన్లైన్ బెనిఫిషియరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టం(ఓబీఎంఎంఎస్) విధానం ద్వారా రుణాలు అందించనున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం బీసీలకు స్వయం ఉపాధి పథకాలకు ఏటా రూ.2 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.10 వేల కోట్లతో యూనిట్లు అందించాలని హామీ ఇచ్చింది. ఈ నిధులను బీసీలకు అందించి వారి స్వయం సమృద్ధికి పకడ్బందీ ప్రణాళికలు రచించాలని బీసీ సంక్షేమాధికారులను చంద్రబాబునాయుడు ఆదేశించడంతో దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పలు అధ్యయన సంస్థలను సంప్రదించారు.
పారిశ్రామికవేత్తలుగా మరింతమంది..
ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల బీసీ సంక్షేమాధికారులతో పలు సమీక్షలు నిర్వహించారు. బీసీల్లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని, ఆ మేరకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. అత్యంత వెనుకబడిన కులాల నుంచి మెరుగైన ఆర్థిక పరిస్థితి ఉన్న ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సాయం ప్రభుత్వం నుంచి అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మరింత మంది పారిశ్రామికవేత్తలు తయారుకావాలని, ఆ మేరకు బీసీ ఔత్సాహికులను అన్ని విధాలా ప్రోత్సాహించాలని సీఎం ఆదేశించారు.
ఎన్బీసీఎ్ఫడీసీ నుంచి రుణాలు
గతంలో టీడీపీ హయాంలో జాతీయ వెనుకబడిన తరగతుల ఆర్థిక అభివృద్ధి కార్పొరేషన్(ఎన్బీసీఎ్ఫడీసీ) నుంచి రుణం తీసుకుని స్వయం ఉపాధి రుణాలందించేవారు. అప్పట్లో ఇన్నోవా కార్లు తదితర యూనిట్లు అందించారు. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రుణాలు ఇవ్వకుండా నిలిపేశారు. అయితే, బీసీల అభ్యున్నతి కోసం కేంద్ర సంస్థ అందిస్తున్న ఈ రుణాలను మళ్లీ తీసుకోవాలని కూటమి సర్కారు నిర్ణయించింది. బ్యాంకులు రుణాలివ్వని బీసీ అభ్యర్థులకు బీసీ కార్పొరేషన్ రుణాలు అందిస్తుంది. ఈ యూనిట్లకు సంబంధించి ఎన్బీసీఎ్ఫడీసీ 65 శాతం రుణమిస్తే, 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం, 10 శాతం లబ్ధిదారుడు వాటాతో యూనిట్లు నిర్వహిస్తారు. ఈ ఏడాది ఎన్బీసీఎ్ఫడీసీ నుంచి సుమారు రూ.100 కోట్లు రుణంగా తీసుకుని, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.38 కోట్లు చెల్లించి, లబ్ధిదారుల వాటాగా రూ.15 కోట్లు కలిపి మొత్తంగా రూ.153 కోట్లు రుణాలివ్వాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఎన్బీసీఎ్ఫడీసీ రుణం నుంచి సబ్సిడీ 50 శాతం అందిస్తారు. ఈ రుణంతో గతంలో మాదిరిగా ఇన్నోవా కార్లు, మెకనైజ్డ్ లాండ్రీలు, బ్యూటీపార్లర్లు తదితర చిన్న తరహా పరిశ్రమలను స్థాపించే విధంగా చర్యలు తీసుకుంటారు. గత టీడీపీ ప్రభుత్వంలో సుమారు 3 లక్షల మందికి స్వయం ఉపాధి పథకాలు అందించారు. కూటమి ప్రభుత్వం ప్రతి ఏటా 3 లక్షల మందికి స్వయం ఉపాధి కల్పించి వారిని ఆర్థికంగా వృద్ధిలోకి తీసుకురావాలని యోచిస్తోంది.
సబ్సిడీపై నిబంధనలు
ప్రభుత్వ పథకాలను సబ్సిడీ కోసమే తీసుకోవడం, అందుకోసమే యూనిట్లు పెట్టడం, రుణం వచ్చిన తర్వాత యూనిట్లు ఎత్తేయడం ద్వారా స్వయం ఉపాధి పథకాలు నిరుపయోగమయ్యాయి. గత అనుభవాల దృష్ట్యా సబ్సిడీపై కొన్ని నిబంధనలు పెట్టాలని సర్కార్ యోచిస్తోంది. యూనిట్ ప్రారంభించిన తర్వాత కొంత గడువు ఇచ్చి ఆఖరులో సబ్సిడీ ఇస్తేనే పథకం విజయవంతమవుతుందని పలువురు సలహాలిస్తున్నారు.
అత్యంత వెనుకబడిన వర్గాల కోసం సీడ్
స్కీం ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ డీనోటిఫైడ్ ట్రైబల్స్(సీడ్) పథకం ద్వారా రుణాలందించాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో 33 అత్యంత వెనుకబడిన కులాలున్నాయి. వారిలో ఎక్కువగా సంచారజాతులకు చెందిన వారే. ఆ డేటాను సేకరించి, వారి వృత్తుల పట్ల సమగ్ర అధ్యయనం చేస్తారు. చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులు, సంచార వ్యాపారాలు చేసుకునే వారికి మొత్తం సబ్సిడీగా అందించి వారి అభ్యున్నతి కోసం ప్రభుత్వం సహకారం అందించనుంది. ఆయా సంచార జాతులను గుర్తించి వారికి గుర్తింపు కార్డులు ఇవ్వడం ద్వారా వారి ఎక్కడైనా ప్రభుత్వ సహకారమందించేలా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంఎ్సఎంఈ ద్వారా అందిస్తున్న సహకారం వారికి అందేలా అధికారులు ప్రణాళికలు రూపొందించాలని సీఎం ఇప్పటికే ఆదేశించారు.
Updated Date - Oct 07 , 2024 | 04:08 AM