Ambedkar Smruthi Vanam: పనులు పూర్తికాకుండా ప్రారంభోత్సవమా?
ABN, Publish Date - Jan 18 , 2024 | 04:04 AM
బెజవాడలో అంబేడ్కర్ స్మృతివనం ప్రాజెక్టు పూర్తి కాకుండానే ప్రారంభోత్సవానికి జగన్ ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చే నెలలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని..
బెజవాడలో అంబేడ్కర్ స్మృతివనం పూర్తికి మరో మూడు నెలలు!
వచ్చే నెలలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని రేపే హడావుడిగా ప్రారంభం
పూర్తికాని కన్వెన్షన్ సెంటర్.. ఆ పనులు కనపడకుండా గ్రీన్ మ్యాట్లతో మేకప్
పార్కింగే ఇక్కడ ప్రధాన సమస్య.. పశ్చిమ, ఉత్తర దిక్కుల్లో ఆ వసతి ఏర్పాటే చేయలేదు
వ్యయంపై నోరెత్తని అధికారులు.. 400 కోట్లన్న సీఎం రోతపత్రిక.. అనుమానాలెన్నెన్నో
(విజయవాడ-ఆంధ్రజ్యోతి)
బెజవాడలో అంబేడ్కర్ స్మృతివనం ప్రాజెక్టు పూర్తి కాకుండానే ప్రారంభోత్సవానికి జగన్ ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చే నెలలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని.. పనులు పూర్తి కాకుండానే హడావుడిగా ప్రారంభించేస్తోంది. స్మృతి వనం పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోవడానికి ఎంతలేదన్నా మరో మూడు నెలలు పైనే పడుతుంది. అంబేడ్కర్ గ్రహం వెనుక తలపెట్టిన కన్వెన్షన్ సెంటర్ ఇంకా పూర్తి కానేలేదు. జీ ప్లస్ 1 స్ట్రక్చర్ పనులు మాత్రమే పూర్తయ్యాయి. 2వేల మందికి సరిపడా సీటింగ్ సామర్థ్యంతో కన్వెన్షన్ సెంటర్ను 6,340 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. సెంటర్ అందుబాటులోకి రావడానికి కూడా 3నెలలు పైనే పడుతుందని అంటున్నారు. అయినా ముఖ్యమంత్రి జగన్ శుక్రవారమే (19నే) దానికి ప్రారంభోత్సవం చేయనున్నారు. వాస్తవానికి స్మృతివనంలో ముందు భాగం పనులు మాత్రమే పూర్తయ్యాయి. అది కూడా పశ్చిమం వైపు రైతుబజార్ పనుల్లో పురోగతి లేదు. అంబేడ్కర్ విగ్రహానికి వెనుక భాగం చేపట్టాల్సిన పనుల్లోనూ పెద్దగా పురోగతి లేదు. వెనుక భాగంలో ఉన్న వాటిలో ప్రధానంగా కన్వెన్షన్ సెంటర్ ఉంది. పార్కింగ్ ఏరియా కూడా అభివృద్ధి చేయాల్సి ఉంది. లాన్ పనులు కూడా చేపట్టాల్సి ఉంది. గురువారానికి లాన్ పనులను పూర్తి చేసినా.. కన్వెన్షన్ సెంటర్ అందుబాటులోకి తీసుకురావడం సాఽధ్యం కాదు. శుక్రవారం ప్రారంభోత్సవ సందర్భంగా ఎవరూ దీనిని గమనించకుండా ఉండేందుకు గ్రీన్ మ్యాట్లను పరచి కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. బుధవారం నాటికి గ్రీన్మ్యాట్స్ను 60 శాతం ఏర్పాటు చేశారు. ముందు భాగంలోనూ కొలనేడ్ పనులు ఇంకా మిగిలే ఉన్నాయి. విగ్రహానికి రెండు వైపులా గోడలా ఈ కొలనేడ్ను నిర్మించారు. అంబేడ్కర్ జీవన గమనానికి సంబంధించి మ్యూరల్ ఆర్ట్ వర్క్ పనులను ఇందులోని గోడల మీద చేపట్టారు. ప్రారంభోత్సవ సమయం సమీపించినా ఇంకొన్ని ఆర్ట్ వర్క్ పనులు పూర్తి కాలేదు.
లిఫ్టుల సమస్యలు..
అంబేడ్కర్ స్మృతి వనంలో భాగంగా అంబేడ్కర్ విగ్రహం పాదాల చెంతకు చేరుకోవడానికి ఏర్పాటు చేసిన లిఫ్టులు అప్పుడే మొరాయిస్తున్నాయి. మంగళవారం అధికారులు పరిశీలనకు వెళ్లినపుడు ఓ లిఫ్టు మధ్యలో ఆగిపోవటం ఆందోళనకు గురి చేసింది. బుధవారం కూడా పలుమార్లు లిఫ్టులను మరమ్మతు చేయాల్సి వచ్చింది.
పూర్తికావలసిన ఫౌంటెయిన్లు..
స్మృతివనం ఆవరణలో ఏడు ఫౌంటెయిన్లను చేపట్టారు. ఇందులో ప్రధానంగా విగ్రహానికి ముందు మ్యూజికల్ ఫౌంటెయిన్ను ఏర్పాటు చేశారు. దీనికి నాలుగు వైపులా చతురస్రాకారంలో నాలుగు ఫౌంటెయిన్లను ఏర్పాటు చేశారు. వీటికి సంబంధించి కొన్ని పనులు ఇంకా మిగిలి ఉన్నాయి. అంబేడ్కర్ విగ్రహాన్ని నిలబెట్టిన పెడెస్ర్టియల్ చుట్టూ తూర్పు, పశ్చిమ, ఉత్తర దిక్కున ఏర్పాటు చేసిన భారీ ఫౌంటెయిన్ పనులు కూడా పూర్తి కాలేదు. పాత్వేలలో ఇంకా టైల్స్ పూర్తి కాలేదు. రాత్రింబవళ్లూ పనులు చేస్తుండడం వల్ల శుక్రవారానికి పూర్తిచేసే అవకాశం ఉంది.
అంబేడ్కర్పై జగన్కు గౌరవం లేదు
తుళ్లూరు జనవరి 17: రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అంటే సీఎం జగన్రెడ్డికి ఏ మాత్రం గౌరవం లేదని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. రాజధాని అమరావతిలోని శాఖమూరులో గత టీడీపీ ప్రభుత్వం 20 ఎకరాల్లో తలపెట్టిన అంబేడ్కర్ స్మృతివనం పనులను ఆయన వచ్చాక ఆపేశారని మండిపడ్డారు. బుధవారం ఆయన, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు, దళిత జేఏసీ నేత పులి చిన్నా తదితరులు ఈ స్మృతి వనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ.. రాజధానిలో కాదని విజయవాడలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయడాన్ని ఆక్షేపించారు. అక్కడున్న ఒక వర్గం మీద కక్ష తీర్చుకోవడానికి విజయవాడ స్వరాజ్ మైదానాన్ని ఎంపిక చేశారన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ఆ మైదానం ఉపయుక్తంగా ఉండేదని, వారిని ఇబ్బంది పెట్టేందుకే ఇక్కడ విగ్రహం ఏర్పాటుచేశారని దుయ్యబట్టారు. శాఖమూరు స్మృతి వనంలో ఐరన్ను కాజేశారని.. అంబేడ్కర్ నమూనా విగ్రహాలను సైతం మాయం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. స్మృతివనం రాజధానిలోనే ఉండాలని డిమాండ్ చేశారు.
పార్కింగ్ సమస్యలు.. అరకొర సదుపాయాలు
విజయవాడ నడిబొడ్డున.. పర్యాటక ఆకర్షణగా నిర్మించిన అంబేడ్కర్ స్మృతి వనం ప్రాజెక్టులో పార్కింగ్కు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తోంది. కేవలం 95 కార్లు, 84 ద్విచక్ర వాహనాలు పెట్టేందుకు మాత్రమే అవకాశం కల్పించారు పశ్చిమ, ఉత్తర దిక్కుల్లో ఈ పార్కింగ్ కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఆ సదుపాయం కల్పించలేదు. పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో ఎగ్జిబిషన్స్ పెట్టినా, బుక్ ఫెస్టివల్స్ నిర్వహించినా సర్క్సలు, పెట్టినా వేలాదిగా వస్తుంటారు. స్మృతివనాన్ని కూడా భారీగా సందర్శిస్తారు. తెలంగాణలో దాదాపు 500 కార్ల పార్కింగ్కు అవకాశం ఉంది.
ఇంతకూ నిర్మాణ వ్యయమెంత?
స్మృతి వనం ప్రాజెక్టు ఖర్చుపైనా అనేక అనుమానాలు నెలకొన్నాయి. విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ ప్రాజెక్టు పనులను తెలంగాణలో అంబేడ్కర్ ఐకానిక్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన కేపీసీ సంస్థే దక్కించుకుంది. మొదట్లో దీని అంచనా వ్యయం రూ.180 కోట్లుగా చెప్పారు.. అయితే రూ.400 కోట్లు ఖర్చయిందని జగన్కు చెందిన రోతపత్రికలో పేర్కొన్నారు. ఇంత భారీగా ఎందుకు ఖర్చయిందని అడిగితే అధికారులు నోరు మెదపడం లేదు. హైదరాబాద్లో అంబేడ్కర్ విగ్రహ ప్రాజెక్టును ముందుగా రూ.100.23 కోట్ల అంచనాతో చేపట్టారు. ఆ తర్వాత ఆ ప్రాజెక్టు రూ.150 కోట్లకు చేరింది. అయితే స్మృతవనంలో కన్వెన్షన్ సెంటర్, మ్యూజియం, లైబ్రరీ, మినీ థియేటర్, కొలనేడ్, ఫుడ్ కోర్టులు, పెడస్ర్టియల్, ఆర్ ్టవర్క్, రాజస్తాన్ పింక్ స్టోన్ వంటి వాటితో పాటు ల్యాండ్ స్కేపింగ్ తదితరాలకు ఇంత ఖర్చవుతోందని అధికారులు అంటున్నారు. ఇవన్నీ చేపడుతున్నమాట వాస్తవమే అయినప్పటికీ రూ.400 కోట్ల వ్యయం అనుమానంగానే ఉంది.
Updated Date - Jan 18 , 2024 | 06:31 AM