మమ్మల్ని ముంచేస్తారా?
ABN, Publish Date - Feb 01 , 2024 | 03:42 AM
‘మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగబోతున్నాయి. అతిత్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని ప్రభుత్వ పెద్దలే చెబుతున్నారు.
ఎన్నికల ముందు ఎందుకీ టెండర్?
మైనింగ్ అధికారులను నిలదీసిన కంపెనీలు
బెరైటీస్ టెండర్లలో పాల్గొనలేమని స్పష్టీకరణ
కొత్త సర్కారు టెండర్లు రద్దుచేస్తే పరిస్థితేంటి?
90 కోట్ల డిపాజిట్ ఫ్రీజ్ చేస్తే మాకు తంటాలే
బిడ్ల దాఖలుకు కాంట్రాక్టర్లు ససేమిరా
మళ్లీ మన ప్రభుత్వమే.. భరోసా ఇచ్చేందుకు
గనుల శాఖ ఉన్నతాధికారి యత్నం
అయితే వచ్చాకే టెండర్లు పిలవండి: కంపెనీలు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
‘మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగబోతున్నాయి. అతిత్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని ప్రభుత్వ పెద్దలే చెబుతున్నారు. అనూహ్యంగా ఇప్పుడీ టెండర్ దేనికి? ఎన్నికల ముందు టెండర్ ప్రాసెస్ చేశాక.. కొత్తగా వచ్చే ప్రభుత్వం టెండర్లను రద్దుచేస్తే.. మేం చెల్లించిన రూ.90కోట్లు నిలిచిపోతే? మమ్మల్ని నిండా ముంచేద్దామనుకుంటున్నారా’ అని బెరైటీస్ కాంట్రాక్టర్లు మైనింగ్ శాఖ ఉన్నతాధికారులను నిలదీశారు. కడప జిల్లా మంగంపేట మైనింగ్ యార్డులో ఉన్న కోటి టన్నుల బెరైటీస్ అమ్మకం కోసం రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ టెండర్లు పిలిచిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి కాంట్రాక్టర్లతో బుధవారమిక్కడి ఏపీఎండీసీ కార్యాలయంలో ప్రీ-బిడ్ సమావేశం జరిగింది. జింపెక్స్, ఎంపర్డా, ట్రైమెక్స్, వ ర్షిణి, బీసీఎల్ తదితర బడా కంపెనీలతోపాటు మరో 27 మందికిపైగా వ్యాపారులు, కడప, కర్నూలు, అనంతపురం కొనుగోలుదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కంపెనీల ప్రతినిధులు మూకుమ్మడిగా ఒకటే ప్రశ్న లేవనెత్తారు. ఎన్నికల ముందు టెండర్ ఎందుకు పిలిచారని అడగడంతో అలజడి మొదలైంది. రాష్ట్ర రాజకీయ వాతావరణం, గెలుపోటములు, కాంట్రాక్టు షరతులపై బడా కంపెనీలు గట్టిగా నిలదీశాయి. వాటికి సమాధానం చెప్పలేక, సాంకేతిక అంశాలపై స్పష్టత ఇవ్వలేక అధికారులు బెంబెలేత్తిపోయినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కంపెనీలు ప్రధానంగా ప్రభుత్వం మారితే తమ పరిస్థితేంటని ప్రశ్నించాయి టెండర్లలో పాల్గొనలేమని చేతులెత్తేశాయి. ‘ప్రభుత్వం మారుతుందని ప్రచారం సాగుతుంది. ఈ పరిస్థితుల్లో భారీ టెండర్ ఎలా పిలిచారు? సెక్యూరిటీ డిపాజిట్గా రూ.90కోట్లు చెల్లించాలి. డాక్యుమెంట్ ఫీజే జీఎస్టీతో కలిపి రూ.29.50కోట్లు. ప్రభుత్వం మారుతుందని అంటున్నారు. కొత్తగా వచ్చే ప్రభుత్వం దీనిని నిలిపివేస్తే మేం చెల్లించిన 90కోట్లు ఫ్రీజ్ అవుతాయి. మేం చాలా సమస్యలు ఎదుర్కోవాలి. ఈ టెండర్లో మేం భాగస్వాములం కాలేం. బిడ్లు దాఖలు చేయలేం’ అని కంపెనీల ప్రతినిధులు, వ్యాపారులు స్పష్టం చేసినట్లు తెలిసింది. గనులశాఖ ఉన్నతాధికారి జోక్యం చేసుకుని.. ‘మళ్లీ మన ప్రభుత్వమే వస్తుంది. ఎవరూ భయపడాల్సిన పనిలేదు. బిడ్లు దాఖలు చేయండి. ఎవరూ నష్టపోరు’ అని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కంపెనీల ప్రతినిధులు మరో కౌంటర్ ఇచ్చారు. ‘మళ్లీ మన ప్రభుత్వమే వస్తుందన్న నమ్మకం మీకుంటే సరిపోదు. మాకూ అనిపించాలి. మీ నమ్మకమే నిజమైతే ఎన్నికలయ్యాకే టెండర్లు పిలవండి. అప్పటి వరకు వాయిదావేయండి’ అని సూచించినట్లు తెలిసింది. ఇందుకు అధికారులు ఒప్పుకోలేదని తెలిసింది.
ఐదేళ్లలో కోటి టన్నుల విక్రయమా?
టెండర్లను దక్కించుకునే సంస్థలు.. ఐదేళ్ల వ్యవధిలో కోటి టన్నుల బెరైటీ్సను అమ్మేయాలన్న షరతుపై కంపెనీల ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆచరణ సాధ్యంకాని షరతులను తెరపైకి తీసుకురావద్దని ఏపీఎండీసీని కోరినట్లు తెలిసింది. ఏపీఎండీసీ 60 లక్షల టన్నుల బెరైటీస్ను గత 20 ఏళ్లలోనే అమ్మలేకపోయిందని, ఇప్పుడు కేవలం ఐదేళ్లలోనే కోటి టన్నులు అమ్మేయాలని తమకు టార్గెట్ పెట్టడం సరికాదని పలువురు అభిప్రాయపడినట్లు సమాచారం.
ప్లీజ్.. బిడ్లు వేయండి
బెరైటీస్ టెండర్లకు కంపెనీలు, కొనుగోలుదారుల నుంచి ఆశించిన స్పందన లేదు. పెద్ద కంపెనీలు సైతం బిడ్లు వేసే ధైర్యం చేయడం లేదు. దీంతో గత కొద్దిరోజులుగా ఏపీఎండీసీ అధికారులు వారికి ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. వ్యక్తిగతంగా కంపెనీల సీఈవోలు, డైరెక్టర్లు, వ్యక్తిగత కొనుగోలుదారులకు ఫోన్ చేసి బిడ్డింగ్లో పాల్గొనాలని బతిమాలుతున్నట్లు తెలిసింది.
Updated Date - Feb 01 , 2024 | 06:41 AM