ఎన్కౌంటర్లు లేని తెలంగాణ కావాలి
ABN, First Publish Date - 2023-12-11T03:38:49+05:30
ఎన్కౌంటర్లు లేని తెలంగాణను ప్రజలు కోరుకుంటున్నారని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) తెలిపింది. ప్రజా ఉద్యమకారులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తేయాలని కోరింది.
ప్రజా ఉద్యమకారులపై కేసులు ఎత్తేయాలి..
ఉద్యమాల అణచివేతకే శివధర్రెడ్డి నియామకం
మావోయిస్టు రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్
హైదరాబాద్, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): ఎన్కౌంటర్లు లేని తెలంగాణను ప్రజలు కోరుకుంటున్నారని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) తెలిపింది. ప్రజా ఉద్యమకారులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తేయాలని కోరింది. ప్రజాస్వామ్య పాలన అందిస్తామని చెబుతోన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్గా నేరపూరిత అనుభవం కలిగిన శివధర్రెడ్డిని నియమించారని.. ఇది రేపటి ఉద్యమాలను అణిచివేయడానికేనని ఆరోపించింది. ఈమేరకు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరిట ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ధర్నాచౌక్ను ఎలాంటి ఆంక్షలు లేకుండా పునరుద్ధరించాలని, పౌర హక్కులకు, స్వేచ్ఛకు ఎలాంటి భంగం కలగని చట్టబద్ధ పాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు అందులో వెల్లడించింది. పేద, మధ్యతరగతి రైతులకే రైతుబంధు వర్తింపజేయాలని కోరింది. భూస్వాములకు అనుకూలంగా ఉన్న ధరణి పోర్టల్ను రద్దు చేయాలని డిమాండ్ చేసింది. ఇప్పటికే రూ.5 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో ఉచిత పథకాలు ఎలా అమలు చేస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీసింది.
Updated Date - 2023-12-11T03:38:50+05:30 IST