నువ్వా.. నేనా!
ABN, First Publish Date - 2023-12-02T23:33:02+05:30
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. ఇన్ని రోజుల ఉత్కంఠకు తెర దించుతూ నేడు ఫలితాలు రానున్నాయి. సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం జిల్లాకేంద్రంలో సర్వం సిద్ధమైంది. జిల్లాలోని జనగామ, స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాల్లో జరిగిన పోలింగ్కు సం బంధించిన ఓట్లను ఆదివారం లెక్కిస్తారు.
అభ్యర్థుల భవితవ్యం తేలేది నేడే
ఓట్ల లెక్కింపు కోసం సర్వం సిద్ధం
పెంబర్తిలోని వీబీఐటీలో ఏర్పాట్లు
8 గంటలకు పోస్టల్, 8.30కు ఈవీఎం ఓట్ల కౌంటింగ్ ప్రారంభం
45 నిమిషాల్లో తొలి రౌండ్ ఫలితం
3 నియోజకవర్గాల్లో 53 మంది పోటీ
జనగామ, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. ఇన్ని రోజుల ఉత్కంఠకు తెర దించుతూ నేడు ఫలితాలు రానున్నాయి. సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం జిల్లాకేంద్రంలో సర్వం సిద్ధమైంది. జిల్లాలోని జనగామ, స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాల్లో జరిగిన పోలింగ్కు సం బంధించిన ఓట్లను ఆదివారం లెక్కిస్తారు. ఇందు కు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జనగామ మండలం పెం బర్తిలోని విశ్వభారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీబీఐటీ)లో మూడు నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ జరగనుంది. ఇందుకోసం కాలేజీలో మూడు హాళ్లను సిద్ధం చేశారు. కాలేజీ గ్రౌండ్ ఫ్లోర్లో జనగామ, ఫస్ట్ ఫ్లోర్లో స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాల కౌంటింగ్ జరగనుంది. సెంట్రల్, స్టేట్ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
ఒక రౌండ్లో 14 బూత్ల ఓట్ల లెక్కింపు
ఓట్ల లెక్కింపు కోసం ప్రతీ హాల్లో 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ప్రతీ రౌండ్లో 14 బూత్ల ఓట్లు లెక్కిస్తారు. జనగామ నియోజకవర్గంలో 277, స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో 290, పాలకుర్తి నియోజకవర్గంలో 294 బూత్లు ఉన్నాయి. ఈ లెక్కన 20 రౌండ్లలో జనగామ, 21 రౌండ్లలో స్టేషన్ఘన్పూర్, 21 రౌండ్లలో పాలకుర్తి నియోజకవర్గాల కౌంటింగ్ పూర్త వుతుంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. 8.30 గంటలకు ఈవీఎంఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. 9.15 నుంచి 9.30 మధ్యలో తొలి రౌండ్ ఫలితం వస్తుంది. మొదటి రౌండ్ లెక్కింపు కాగానే కౌంటింగ్ అబ్జర్వర్, రిటర్నింగ్ అధికారి ఽద్రువీకరించిన తర్వాత జిల్లా ఎన్నికల అధికారికి పంపగా ఆయన ఫలితాలను అధికారికంగా విడుదల చేస్తారు. జనగామకు రమణి సరస్వతి, స్టేషన్ఘన్పూర్కు రీతూ, పాలకుర్తికి రవీశ్గుప్తా కౌంటింగ్ అబ్జర్వర్లుగా ఉన్నారు.
మొదట ఈ బూత్ల ఓట్ల లెక్కింపు
మూడు నియోజకవర్గాల్లో మొదటగా బూత్ల సీరియల్ నంబర్ల వారీగా ఓట్లను లెక్కిస్తారు. జనగామ నియోజకవర్గంలో మొదటగా చేర్యాల మండలం దానంపల్లి బూత్ నంబర్-1 ఓట్లను, చివరగా జనగామ మండలం పెంబర్తి బూత్ నంబర్- 277 ఓట్లను లెక్కిస్తారు. స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో మొదటగా చిలు పూర్ మండలం శ్రీపతిపల్లి బూత్ నంబర్- 1, చివరగా జఫర్గడ్ మండలం ముగ్ధుంతండా బూత్ నంబర్- 290 ఓట్లను లెక్కిస్తారు. అదేవిధంగా పాలకుర్తి నియోజకవర్గంలో మొదటగా పాలకుర్తి మండ లం గూడూరు బూత్ నంబర్- 1, చివరగా తొర్రూరు మండలం మాటేడు బూత్ నంబర్- 294 ఓట్లను లెక్కిస్తారు.
మూడంచెల భద్రత
కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవకతవకలు జరగకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రం లోపల, బయటా మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ హాల్కు 100 మీటర్ల దూరంలోనే బారికేడ్లు పెట్టి వాహనాలు, ప్రజలను కట్టడి చేస్తారు. కౌంటింగ్ కేంద్రం ప్రధాన గేటు వద్ద, కౌంటింగ్ కేంద్రం ద్వారం వద్ద, కౌంటింగ్ హాల్ ద్వారం వద్ద సెంట్రల్, స్టేట్ పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. ఎన్నికల సంఘం ఇచ్చిన గుర్తింపు కార్డులు ఉన్న వారిని మాత్రమే లోనికి అనుమతిస్తారు. కౌంటింగ్ హాల్లోకి అభ్యర్థులు, కౌంటింగ్ సిబ్బంది, కౌంటింగ్ ఏజెంట్లను మాత్రమే పంపిస్తారు. కౌంటింగ్ హాల్లోకి మొబైల్స్, ఎలకా్ట్రనిక్ వస్తువులను అనుమతించరు. కౌంటింగ్ హాల్లోకి వెళ్లే ముందు సెల్ఫోన్స్ను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
ప్రతీ హాల్లో 45 మంది కౌంటింగ్ సిబ్బంది
ఒక్కో హాల్లో 45 మంది ఉద్యోగులు కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొంటారు. ఇందులో రిటర్నింగ్ అధికారి, కౌంటింగ్ అబ్జర్వర్, కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ ఉంటారు. హాల్లోని ప్రతీ టేబుల్ వద్ద అభ్యర్థుల తరపున కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారు. జనగామలో 19 మంది, స్టేషన్ఘన్పూర్లో 19, పాలకుర్తిలో 15 మంది బరిలో ఉండగా ప్రతీ టేబుల్ వద్ద అభ్య ర్థికి ఒకరి చొప్పున కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారు. ఒకసారి గుర్తింపు కార్డుతో హాల్లోకి వెళ్లిన కౌంటింగ్ ఏజెంట్కు రిలీవర్గా మరొకరిని పంపే అవకాశం ఉండదు. కౌంటింగ్ ఏజెంట్ ఒకవేళ కౌంటింగ్ కేంద్రం గేటు దాటి బయటకు వెళ్తే తిరిగి లోపలికి రానివ్వరు. కౌంటింగ్ ఏజెంట్ను ఎవరైనా అభ్యర్థులు మార్చాలనుకుంటే లెక్కింపు ప్రారంభానికి ముందే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
కీలకం కానున్న పోస్టల్ బ్యాలెట్ ఓట్లు
అభ్యర్థుల గెలుపు ఓటముల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కీలకం కానున్నాయి. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఒకటి మినహా మరో రెండు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య టగ్ ఆఫ్ వార్ పరిస్థితి ఉంది. ఈ క్రమంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేసే అవకాశం ఉంది. జిల్లాలో ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులతో(ఫారం- 12) పాటు ఈసారి కొత్తగా 80 ఏళ్లు నిండిన వృద్ధులు, దివ్యాంగులు, కొవిడ్ పేషెంట్లు, అత్యవసర సర్వీసులకు వారికి హోం ఓటింగ్(12డీ) అవకాశం కల్పించారు. వీరితో పాటు ఇతర ప్రాంతాల్లో విధుల్లో ఉన్న వారు ఎలకా్ట్రనిక్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్(ఈటీపీబీఎస్) ద్వారా ఓటు వేశారు. కాగా.. ఈ ఓట్లు కీలకంగా మారుతాయని తెలుస్తోంది.
Updated Date - 2023-12-02T23:33:08+05:30 IST