ఎన్నికలకు కసరత్తు!
ABN, First Publish Date - 2023-10-30T23:48:15+05:30
జిల్లాలో ఎన్నికల నిర్వహణపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై దృష్టి సారించారు. పోలింగ్, కౌంటింగ్ సజావుగా జరిగేందుకు పకడ్బందీగా చర్యలు చేపడుతున్నారు. ఎన్నికలను శాంతియుతంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారులు, పోలీసులు కృషి చేస్తున్నారు. నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కావడానికి ముందే ఏర్పాట్లను దాదాపుగా పూర్తి చేసేందుకు ప్రణాళిక రచిస్తున్నారు.
మొదటి విడత ఈవీఎంల ర్యాండమైజేషన్ పూర్తి
మూడు నియోజకవర్గాలకు చేరిన పరికరాలు
జిల్లాలో 861 పోలింగ్ స్టేషన్లు.. 3,444 మంది సిబ్బంది
పోలింగ్ నిర్వహణపై రెండు రోజులపాటు శిక్షణ
జనగామ, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎన్నికల నిర్వహణపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై దృష్టి సారించారు. పోలింగ్, కౌంటింగ్ సజావుగా జరిగేందుకు పకడ్బందీగా చర్యలు చేపడుతున్నారు. ఎన్నికలను శాంతియుతంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారులు, పోలీసులు కృషి చేస్తున్నారు. నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కావడానికి ముందే ఏర్పాట్లను దాదాపుగా పూర్తి చేసేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. ఇందుకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి శివలింగయ్య నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, మండలాల నోడల్ అధికారులతో విరివిగా సమావేశాలు ఏర్పాటు చేస్తూ మార్గనిర్దేశం చేస్తున్నారు. ఈ పాటికే జిల్లాలో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లకు సంబంధించి ప్రాథమిక ప్రక్రియ దాదాపుగా పూర్తి కాగా.. నామినేషన్ల స్వీకరణ ప్రారంభం తర్వాత పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామిగ్రిని తరలించనున్నారు.
స్ట్రాంగ్రూమ్లకు చేరిన ఈవీఎంలు
ఎన్నికల నిర్వహణలో కీలకమైన ఈవీఎంలను అధికారులు ఆయా నియోజకవర్గ కేంద్రాలకు తరలించారు. జిల్లా స్ట్రాంగ్రూమ్లో ఇటీవలే ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. వివిధ రాజకీయ పార్టీల సమక్షంలో ఆన్లైన్ పద్ధతిలో ర్యాండమైజేషన్ ప్రక్రియ చేపట్టి నియోజకవర్గాల వారీగా ఈవీఎంలను కేటాయించారు. నియోజకవర్గాల్లోని స్ట్రాంగ్రూమ్లో రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ చేపట్టిన తర్వాత పోలింగ్ స్టేషన్ల వారీగా ఈవీఎంలను కేటాయిస్తారు. ఈవీఎంలను భద్రపరిచేందుకు జనగామ, పాలకుర్తి, స్టేషన్ఘన్పూర్ ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో స్ట్రాంగ్రూమ్ను ఏర్పాటు చేశారు. జనగామకు సంబంధించి జిల్లా స్ట్రాంగ్రూమ్లో ఈవీఎంలు భద్రపరచగా, పాలకుర్తిలో ఎస్సీ బాలికల వసతిగృహం, స్టేషన్ఘన్పూర్లో విద్యాజ్యోతి డిగ్రీ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశారు.
పోలింగ్ స్టేషన్ సిబ్బందికి శిక్షణ
ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ స్టేషన్ల వారీగా విధులు నిర్వర్తించే సిబ్బందికి ఎన్నికల అధికారులు శిక్షణ ఇస్తున్నారు. జనగామ, స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాల పరిధిలో సోమవారం నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు ఈ శిక్షణ ఇవ్వనున్నారు. పోలింగ్ స్టేషన్లలో పాటించాల్సిన పద్ధతులు, పోలింగ్ నిర్వహించే విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలకు పోలింగ్ కేంద్రాల ప్రిసైడింగ్ అధికారి, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారి, మరో ఇద్దరు పోలింగ్ ఆఫీసర్లకు శిక్షణ ఇస్తున్నారు. పోలింగ్ కేంద్రాల సిబ్బందికి శిక్షణ ఇస్తున్నప్పటికీ వారిని ఏ పోలింగ్ కేంద్రానికి కేటాయించారనే విషయాన్ని మాత్రం ఇప్పుడే చెప్పరు. ఈవీఎంల రెండో విడత ర్యాడమైజేషన్ ప్రక్రియ జరిగిన తర్వాతే ఏ పోలింగ్ స్టేషన్కు అలాట్ చేశారనేది చెబుతారు. నవంబరు మూడో వారంలో రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను చేపట్టనున్నారు.
861 పోలింగ్ స్టేషన్లు.. 3444 పోలింగ్ సిబ్బంది
జిల్లాలోని జనగామ, పాలకుర్తి, స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గాల పరిధిలో మొత్తంగా 861 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఇందులో జనగామలో 277, స్టేషన్ఘన్పూర్లో 290, పాలకుర్తి నియోజకవర్గ పరిధిలో 294 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఒక్కో పోలింగ్ స్టేషన్కు ప్రిసైడింగ్ అధికారి, సహాయ ప్రిసైడింగ్ అధికారితో పాటు మరో ఇద్దరు చొప్పున సిబ్బంది(అదర్ పోలింగ్ ఆఫీసర్-ఓపీవో)ని నియమించనున్నారు. ఈ లెక్కన మూడు నియోజకవర్గాల పరిధిలోని 861 పోలింగ్ స్టేషన్లకు 3444 మంది సిబ్బందిని నియమించనున్నారు. అదే విధంగా ఒక్కో మండలాన్ని కొన్ని సెక్టార్లుగా విభజించారు. అధికారి హోదాను బట్టి ఒక్కో అధికారికి 5 నుంచి 15 వరకు పోలింగ్ కేంద్రాలను కేటాయించారు. ఒక్కో సెక్టార్ను ఒక్కో రూట్గా పేర్కొన్నారు. సెక్టార్కు ఒక సెక్టోరియల్ ఆఫీసర్, ఒక పోలీస్ ఆఫీసర్ను నియమించారు. జనగామ నియోజకవర్గంలో 32, స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో 35, పాలకుర్తి నియోజకవర్గంలో 36 మంది చొప్పున సెక్టోరియల్, పోలీస్ ఆఫీసర్లను నియమించారు. అదేవిధంగా మండల స్థాయిలో మండలానికి ఒక నోడల్ అధికారిని నియమించారు. పోలింగ్ తేదీ కంటే ఒక రోజు ముందే ఎన్నికల సామగ్రిని పంపిణీ చేస్తారు. నియోజకవర్గ కేంద్రాల్లోని స్ట్రాంగ్ రూమ్ల నుంచి ఈవీఎంలు, వీవీప్యాట్లు, ఇతర ఎన్నికల సామగ్రిని పోలింగ్ స్టేషన్ల వారీగా పంపిణీ చేస్తారు. అదే రోజు రాత్రి వరకు సామగ్రితో సహా కేటాయించిన సిబ్బంది పోలింగ్ స్టేషన్లకు చేరుకోవాల్సి ఉంటుంది. అప్పటితో మొదలై పోలింగ్ పూర్తయి ఈవీఎంలను స్ట్రాంగ్రూమ్లకు పంపించేదాకా సిబ్బంది విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇందుకోసం వారికి అవసరమైన రవాణా, వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తారు. నియోజకవర్గాల వారీగా కేటాయించిన సిబ్బందికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు జిల్లా ఎన్నికల అధికారి శివలింగయ్య సూచించారు.
ఎన్నికల సిబ్బందికి శిక్షణ
జనగామ టౌన్, అక్టోబరు 30: జనగామ ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం పీవో, ఏపీవో సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య హాజరై మాట్లాడారు. పోలింగ్కు ఒక రోజు ముందు, పోలింగ్ రోజు అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు ఇచ్చారు. సిబ్బంది పోలింగ్కు ముందు రోజే సామగ్రితో పోలింగ్ బూత్కు చేరుకోవాలన్నారు. ఎన్నికల విధులకు సంబంధించి ప్రతీ విషయాన్ని బుక్లెట్ రూపంలో అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనగామ రిటర్నింగ్ అధికారి మురళీకృష్ణ, ఎన్నికల నోడల్ అధికారులు అనిల్కుమార్, కె.రాము, వినోద్కుమార్, చౌడేశ్వరి, కళాశాల ప్రిన్సిపాల్ నర్సయ్య, తహసీల్దార్లు మహిపాల్రెడ్డి, నాగదివ్య, శ్రీనివా్సరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-10-30T23:48:15+05:30 IST