కాంగ్రెస్కు ఫలించిన సెంటిమెంట్లు
ABN, First Publish Date - 2023-12-06T02:20:59+05:30
ఈ ఎన్నికల్లో కొన్ని సెంటిమెంట్లు కలిసి రాగా, మరికొన్ని ఫలించకుండా పోయాయి. కాంగ్రెస్ పార్టీకి రంగారెడ్డి జిల్లా సెంటిమెంట్ మరోసారి కలిసివచ్చింది. గతంలో వైఎస్
మరోసారి కలిసొచ్చిన రంగారెడ్డి, అందోల్
కేసీఆర్కు ఫలితమివ్వని హుస్నాబాద్, గజ్వేల్
రంగారెడ్డి, సిద్దిపేట, సంగారెడ్డి, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ఈ ఎన్నికల్లో కొన్ని సెంటిమెంట్లు కలిసి రాగా, మరికొన్ని ఫలించకుండా పోయాయి. కాంగ్రెస్ పార్టీకి రంగారెడ్డి జిల్లా సెంటిమెంట్ మరోసారి కలిసివచ్చింది. గతంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి చేపట్టిన పాదయాత్ర విజయవంతం కావడంతో ఆయన 2004లో చేవెళ్ల నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లాను సెంటిమెంట్గా తీసుకుంది. ఉపాధి హామీ పథకాన్ని కూడా అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ చేవెళ్ల నుంచే ప్రారంభించారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్రెడ్డి చేపట్టిన పాదయాత్ర ముగింపు సభను రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో నిర్వహించారు. ఈసారి ఎన్నికల ప్రచారాన్నికూడా కాంగ్రెస్ తుక్కుగూడ నుంచే ప్రారంభించింది. విజయభేరీ పేరుతో తుక్కుగూడలో లక్షలాది మందితో నిర్వహించిన భారీ సభలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్గాంధీ ఆరు గ్యారెంటీ స్కీమ్లను ప్రకటించారు. పార్టీ అధికారంలోకి రావడంతో రంగారెడ్డి జిల్లాపై కాంగ్రె్సకు ఉన్న సెంటిమెంట్ మరోసారి రిపీట్ అయిందని పలువురు చర్చించుకుంటున్నారు. అయితే, బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ బలంగా నమ్మిన రెండు సెంటిమెంట్లు మాత్రం ఈసారి పని చేయలేదు. ఎన్నికల ప్రచారానికి ఆయన హైదరాబాద్కు ఈశాన్యంలో ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ఎంచుకుంటారు. 2018తోపాటు ఈసారి కూడా హుస్నాబాద్లో తొలి సభతో ప్రచారానికి ఆయన శ్రీకారం చుట్టారు.
కానీ, ఈసారి ఆ సెంటిమెంట్ పని చేయలేదు. అంతేకాదు, హుస్నాబాద్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా రెండుసార్లు గెలిచి హ్యాట్రిక్పై కన్నేసిన వొడితెల సతీశ్కుమార్ను ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ ఓడించారు. ఇక గజ్వేల్ నియోజకవర్గంలో గెలిచిన పార్టీకి రాష్ట్రంలో అధికారం దక్కుతుందనే సెంటిమెంట్ గత 60 ఏళ్లుగా కొనసాగుతోంది. 2014, 2018లోనూ కేసీఆర్ ఇక్కడి నుంచే పోటీ చేసి బీఆర్ఎ్సను అధికారంలోకి తెచ్చారు. తాజా ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్లో గెలిచినప్పటి కీ రాష్ట్రంలో పార్టీకి అధికారం మాత్రం చేజిక్కలేదు. దీంతో ఈ సెంటిమెంట్ కూడా తారుమారైంది. అయితే, అందోల్ సెంటిమెంట్ మాత్రం పదిలంగా కొనసాగుతోంది. 1962 నుంచి అందోల్లో ఏ పార్టీ గెలుస్తుందో అదే పార్టీ రాష్ట్రంలో అధికారం చేపడుతూ వస్తోంది. ఈసారి అందోల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనరసింహ గెలుపొందడం, ఆ పార్టీనే అధికారం చేపడుతుండడం గమనార్హం.
Updated Date - 2023-12-06T02:21:11+05:30 IST