వ్యూహం సినిమాకు బ్రేక్
ABN, Publish Date - Dec 29 , 2023 | 03:48 AM
వ్యూహం సినిమాకు బ్రేక్ పడింది. తెలుగుదేశం పార్టీ, లోకేశ్ తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
జనవరి 11 వరకూ స్టే ఇస్తూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
హైదరాబాద్, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): వ్యూహం సినిమాకు బ్రేక్ పడింది. తెలుగుదేశం పార్టీ, లోకేశ్ తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ను జనవరి 11వ తేదీ వరకూ నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ‘వ్యూహం సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడం అక్రమం. నిబంధనలకు విరుద్ధంగా సర్టిఫికెట్ జారీ చేశారు. రాజకీయ లబ్ధి పొందడంతోపాటు ప్రతిపక్షాలకు నష్టం కలిగించే ఉద్దేశంతో సినిమా తీశారు. సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ను నిలిపివేయండి’ అంటూ లోకేశ్, టీడీపీ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ సూరేపల్లి నంద ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్ వాదనలు వినిపిస్తూ... సీఎం జగన్కు రాజకీయ లబ్ధి చేకూర్చడంతోపాటు ప్రతిపక్షాలకు నష్టం కలిగించే దురుద్దేశంతో సినిమా తీశారన్నారు.
నిర్మాణ సంస్థ రామధూత క్రియేషన్స్ అడ్రస్, సీఎం అడ్రస్ ఒకటేనని పేర్కొన్నారు. సినిమా తీసే ఆర్థిక స్థోమత నిర్మాత దాసరి కిరణ్కు లేదని, వైసీపీ నేతలే నిధులు సమకూర్చారని పేర్కొన్నారు. నిర్మాతకు టీటీడీ సభ్యుడిగా పదవి ఇచ్చారని పేర్కొన్నారు. ప్రీ రిలీజ్లో వైసీపీ మంత్రులు పాల్గొన్నారని పేర్కొన్నారు. సెన్సార్ బోర్డు తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ నర్సింహశర్మ వాదనలు వినిపిస్తూ... తొలిసారి సర్టిఫికెట్ రిజెక్ట్ అయిన తర్వాత రివైజింగ్ కమిటీ అన్ని అంశాలను పరిశీలించి.. దాదాపు పది మార్పులు చేసి సర్టిఫికెట్ ఇచ్చిందన్నారు. కోర్టు కేసులు, ఎన్టీఆర్ వంటి పదాలు, అనేక భాగాలను తొలగించారని పేర్కొన్నారు. నిర్మాత తరఫున సీనియర్ న్యాయవాది, వైసీపీ ఎంపీ ఎస్ నిరంజన్రెడ్డి వాదిస్తూ... తండ్రికి పరువు నష్టం జరిగిందని పిటిషన్ వేసే అధికారం కుమారుడికి, పార్టీకి లేదని పేర్కొన్నారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం తీర్పు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 11వ తేదీ వరకూ వ్యూహం సినిమా విడుదలపై స్టే ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Updated Date - Dec 29 , 2023 | 07:05 AM