దివ్యాంగుల్లో నైపుణ్యాన్ని వెలికి తీయాలి
ABN, Publish Date - Dec 23 , 2023 | 11:44 PM
అంగవైకల్యంతో కుమిలిపోకుండా మీలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని దివ్యాంగులకు కలెక్టర్ నారాయణరెడ్డి పిలుపు నిచ్చారు.
జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి
వికారాబాద్, డిసెంబర్ 23: అంగవైకల్యంతో కుమిలిపోకుండా మీలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని దివ్యాంగులకు కలెక్టర్ నారాయణరెడ్డి పిలుపు నిచ్చారు. శనివారం కలెక్టరేట్లో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి లలిత కుమారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన గావించిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, దివ్యాంగులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, కల్పిస్తున్న అవకాశాలను వినియోగించుకొని అభివృద్ధి చెందాలన్నారు. ఇకముందు దివ్యాంగులకు ఇబ్బంది కలగకుండా సదరం క్యాంపులను వికారాబాద్ తాండూరులలో నిర్వహించి అర్హులైన వారందరికీ సర్టిఫికెట్లు అందించడం జరుగుతుందన్నారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, దివ్యాంగులు ఆత్మస్థైర్యం కోల్పోకుండా ముందుకు సాగాలన్నారు. రాబోవు రోజుల్లో శాసనసభ్యులు ప్రజావాణి నిర్వహించి సమస్యలను పరిష్కరించనున్నట్లు తెలిపారు. ప్రస్తుత సమస్యలపై వినతి పత్రం అందజేస్తే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు. తాండూరు ఎమ్మెల్యే సభ్యులు మనోహర్రెడ్డి మాట్లాడుతూ, దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వపరంగా అన్ని విధాల సహకరించడం జరుగుతుందన్నారు. అర్హత మేరకు బ్యాంకుల ద్వారా రుణాలు కూడా అందించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు లాప్టా్పలు, ట్రైసైకిళ్లను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో విజేతలకు మెమెంటో, ప్రశంసాపత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్పటేల్, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, అదనపు కలెక్టర్లు రాహుల్శర్మ, లింగ్యానాయక్, ఎంపీపీ చంద్రకళ, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
Updated Date - Dec 23 , 2023 | 11:44 PM