ట్రాలీ ఆటో బోల్తా.. రైతు మృతి
ABN, First Publish Date - 2023-12-03T00:00:12+05:30
చామంతి పూలను విక్రయించేందుకు మార్కెట్కు తరలిస్తుండగా.. ట్రాలీ ఆటో బొల్తాపడిన ఘటనలో ఓ రైతు మృతి చెందగా, మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన చేవెళ్ల పోలీ్సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
మరో ఐదుగురికి తీవ్ర గాయాలు
చామంతి పూలు మార్కెట్కు తీసుకెళ్తుండగా ప్రమాదం
చేవెళ్ల, డిసెంబరు 2 : చామంతి పూలను విక్రయించేందుకు మార్కెట్కు తరలిస్తుండగా.. ట్రాలీ ఆటో బొల్తాపడిన ఘటనలో ఓ రైతు మృతి చెందగా, మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన చేవెళ్ల పోలీ్సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ మండల పరిధిలోని పులుసుమామిడి గ్రామానికి చెందిన రైతులు ఖజాపాషా(37), కొమురయ్య, సందీ్పరెడ్డి, మల్లారెడ్డి, దేవయ్య, రంగారెడ్డిలు వారు పండించిన చామంతి పూలను పంట పొలాల నుంచి తీసుకొచ్చి శుక్రవారం రాత్రి 12 గంటలకు నగరంలోని గుడిమల్కాపూర్ మార్కెట్కు తరలించేందుకు సిద్ధమయ్యారు. ఈక్రమంలో అదే గ్రామానికి చెందిన వెంకట్రెడ్డి ఆటోలో పూలను లోడ్ వేసుకొని హైదరాబాద్కు బయలుదేరారు. మార్గ మధ్యలోని చేవెళ్ల మండలం తంగడ్పల్లి గ్రామ సమీపంలోని బ్రిడ్జి వద్దకు రాగానే ట్రాలీ ఆటో బ్రేక్ ఫెయిలైంది. దీంతో అదుపు తప్పి రోడ్డుపక్కన బోల్తాపడింది. స్థానికులు గమనించి 108 అంబులెన్స్కు సమాచారం ఇవ్వడంతో క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుప్రతికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఖజాపాషా మృతి చెందాడు. తీవ్రగాయాలైన మిగతా ఐదుగురికి మెరుగైన వైద్యం నిమిత్తం నగరంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఖజాపాషా మృతదేహానికి శనివారం చేవెళ్ల ప్రభుత్వ ఆసుప్రతిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. కాగా, చామంతి పూలను నగరంలోని గుడిమల్కాపూర్ మార్కెట్కు తరలిస్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు స్పష్టం చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు. ఆసుప్రతిలో చికిత్సపొందుతున్న వారి పరిస్థితి నిలకడగా ఉందని పలువురు రైతులు తెలిపారు.
Updated Date - 2023-12-03T00:00:13+05:30 IST