ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటరు పాత్ర కీలకం
ABN, First Publish Date - 2023-10-30T23:26:41+05:30
ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటరు పాత్ర కీలకమని, అర్హులైన ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా ఓటింగ్లో పాల్గొనాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భారతి భారతి హొలికేరీ కోరారు.
ఓటింగ్పై అవగాహన కల్పించేందుకు సంచార రథాలు
కలెక్టర్ భారతి హొలికేరీ
రంగారెడ్డి అర్బన్, అక్టోబరు 30 : ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటరు పాత్ర కీలకమని, అర్హులైన ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా ఓటింగ్లో పాల్గొనాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భారతి భారతి హొలికేరీ కోరారు. ఓటింగ్ ఆవశ్యకతను వివరిస్తూ, పోలింగ్ ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు జిల్లాలో శాసనసభా నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన సంచార రథాల ను సోమవారం కలెక్టర్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రచార రథాల ద్వారా గ్రామ గ్రామాన ప్రచారం చేయిస్తూ ఓటింగ్పై ప్రజల్లో అవగాహన పెంపొందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. అలాగే ఈవీఎంల పని తీరుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వీలుగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలలో ఈవీఎం డెమాన్స్ట్రేషన్ సెంటర్లను ఏర్పాటు చేశామని కలెక్టర్ చెప్పారు. ప్రజలు ఓటింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహనను ఏర్పర్చుకోవడంతో పాటు ఈవీఎం, వీవీ ప్యాట్ల పనితీరుపై ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, జడ్పీ సీఈవో దిలీప్ కుమార్, డీఆర్డీఏ పీడీ, స్వీప్ నోడల్ అధికారి ప్రభాకర్, ఆర్డీవోలు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం పనికిరాదు
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం పనికిరాదని కలెక్టర్ భారతి హొలికేరీ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ తో కలిసి నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఏర్పాటు చేసిన చెక్పోస్టులలో వాహనాల తనిఖీలు నిస్పక్షపాతంగా, పకడ్బందీగా జరిగేలా చూడాలన్నారు. పట్టుబడిన వాటిని ఎన్నికల నియావళి మేరకు సీజ్ చేయాలని, ఎన్నికల సమయంలో సామాన్యులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ తెలిపారు. సీజ్ అయిన నగదు, బంగారం, మరియు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నప్పుడు సరైన పత్రాలతో రికార్డ్లో నమోదు చేయాలని తెలిపారు. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేలా అధికారులు సమన్వయంతో విధులను నిర్వర్తించాలన్నారు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉల్లంఘించినట్లయితే వారిపై చర్యలు తప్పవని కలెక్టర్ భారతి హొలికేరీ హెచ్చరించారు. సమావేశంలో నోడల్, పోలీసు అధికారులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.
నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి
నామినేషన్ల స్వీకరణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ భారతి హొలికేరీ తెలిపారు. భారత ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితేష్వ్యాస్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్తో కలిసి సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చిన 24 గంటల్లో పరిష్కరిస్తున్నామన్నారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న ఫామ్ 6,7,8 వెంటనే పరిష్కరిస్తున్నామని ఆమె తెలిపారు. సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, మహేశ్వరం డీసీపీ శ్రీనివాస్, ఈఆర్వోలు, నోడల్ అధికారులు, ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-10-30T23:26:41+05:30 IST