ఆలయాల్లో భక్తిశ్రద్ధలతో పూజలు
ABN, Publish Date - Dec 23 , 2023 | 12:02 AM
కలియుగ దైవంగా చెప్పుకునే వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం ఘట్కేసర్లోని బాలాజినగర్లో శుక్రవారం కనుల పండువగా జరిగింది.
ఘట్కేసర్, డిసెంబరు 22: కలియుగ దైవంగా చెప్పుకునే వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం ఘట్కేసర్లోని బాలాజినగర్లో శుక్రవారం కనుల పండువగా జరిగింది. ఘట్కేసర్లోని బాలాజీనగర్లో కొలువుదీరిన వేంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో సదానంద యోగీశ్వరులు, వెంట్రెడ్డి, ప్రమోద్, భక్తులు పాల్గొన్నారు.
వైకుంఠ ఏకదశికి భారీ ఏర్పాట్లు
ఘట్కేసర్: వైకుంఠ ఏకదశికి వైష్ణవ ఆలయాలు ముస్తాబయ్యాయి. పోచారం మున్సిపాలిటీ యంనంపేట్లో గల రంగనాయక స్వామి ఆలయాంలో, ఇస్మాయిల్ఖాన్గూడలో గల సీతారామాంజనేయస్వామి ఆలయం, ఎన్ఎ్ఫసీ నగర్లోని రామాలయం, కొండాపూర్లోని వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద భారీ ఏర్పాట్లు చేశారు. యంనంపేట్లో మున్సిపల్ చైర్మన్ ఏర్పాట్లను పరిశీలించారు. ఇస్మాయిల్ఖాన్గూడలో అంజనేయులు, సత్యం లింగం, మల్లేష్ ఏర్పాట్లను పరిశీలించారు.
వైభవంగా అయ్యప్ప పూజ
తాండూరు: తాండూరు అయ్యప్ప ఆలయంలో రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్ నిర్వహించిన అయ్యప్ప అర్చన పూజ వైభవంగా నిర్వహించారు. ఆయన కూతురు జన్మదిన సందర్భంగా అయ్యప్పస్వామికి అభిషేకం చేశారు. ఈ అర్చన మహోత్సవానికి పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొని అయ్యప్ప నామస్మరణం, భజన పాటలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమళ, జడ్పీటీసీ గౌడి మంజుల వెంకటేశం, సిద్రాల శ్రీనివాస్, కరణం పురుషోత్తంరావు పాల్గొన్నారు.
శ్రీవారిసేవలో తాండూరు మహిళలు
పెద్దేముల్: తాండూరుకు చెందిన 22 మంది మహిళలు తిరుమల-తిరుపతి దేవస్థానంలో శ్రీవా రిసేవ చేసేందుకు వెళ్లారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి సేవకు రజనీపటేల్ ఆధ్వర్యంలో వీరు బయల్దేరారు. 10రోజులపాటు శ్రీవారిసేవలో పాల్గొంటున్నట్లు తెలిపారు.
దత్తాత్రేయ ఆలయంలో జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు
పెద్దేముల్: మండలంలో ని తట్టెపల్లి అటవీప్రాంతంలో వెలసిన దత్తాత్రేయ స్వామి ఆలయంలో జయంతి ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు శివశంకర్ మహరాజ్, మల్లిఖార్జున్ తెలిపారు. జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఈనెల 25న సాయంత్రం నుంచి తెల్లవారే వరకు భజన కార్యక్రమం ఉంటుందని అన్నారు. 26న ఉదయం 7గంటలకు అభిషేకం, 8గంటలకు డోలారోహనం జరుగుతుందని చెప్పారు.
బొడ్రాయి ప్రతిష్ఠాపన
పూడూరు: మండలంలోని చెంచుపల్లి గ్రామంలో నూతన ధ్వజస్తంభం, పోచమ్మ, బొడ్రాయి, నాగదేవత, శివలింగం ప్రతిష్ఠాపన కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. మూడు రోజులుగా ప్రతిష్ఠాపన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం సుప్రభాతం, ముఖ్యదేవతా మూలమంత్ర, హోమం, యంత్రస్థాపన విగ్రహ స్థాపనం, ప్రాణప్రతిష్ఠ, పూర్ణాహుతి, పంచామృతాభిషేకం, అలంకారం, నైవేద్యం, మహా మంగళహారతి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.
శామీర్పేట: శామీర్పేటలో నాభిశిల(బొడ్రాయి) ప్రథమ వార్సికోత్సవ పూజలను శుక్రవారం నిర్వహించారు. ఈ నాభిశిల మహోత్సవాన్ని సర్పంచ్ బాలమణి, ఉపసర్పంచ్ రమేశ్, గ్రామ పెద్దల సమక్షంలో కనుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీభవాణి రామలింగేశ్వర్స్వామి ప్రధానర్చకులు గడియారం మురళీధర్శర్మ ఆధ్వర్యంలో ఐదుగురు వేద పండిత బ్రహ్మణులు మంత్రోశ్చరణలతో గణపతిపూజ, పుణ్యవచనం, నవగ్రహ పూజ, నాభిశిల అభిషేకం, స్థాపిత దేవతాహ్వానం, మంత్రపుష్పం, పూర్ణాహుతి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం గ్రామ నాయకులు భక్తులకు పెద్ద ఎత్తున తీర్థప్రసాదాలు, అన్నదానం చేశారు.
Updated Date - Dec 23 , 2023 | 12:02 AM