టికెట్ కోసం పోటాపోటీ
ABN, First Publish Date - 2023-12-05T23:17:23+05:30
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి సరైన నాయకత్వంలేక సాధారణ ఎన్నికల్లో చతికిలబడుతూ వస్తోంది. వీరు నామమాత్రంగా పోటీ చేస్తున్నారేగానీ ఓటర్లను ఆకర్శించలేకపోతున్నారు. పార్టీకి ఇక్కడ ప్రజల్లో.. ముఖ్యంగా యువతలో కొంత పట్టు ఉన్నప్పటికీ ఓట్ల రూపంలో రాబట్టలేకపోతున్నారు.
అభ్యర్థులకు సహకరించేవారేరి?
ప్రజల్లో పట్టున్నా చతికిలపడుతున్న బీజేపీ
ఇబ్రహీంపట్నం, డిసెంబరు 5 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి సరైన నాయకత్వంలేక సాధారణ ఎన్నికల్లో చతికిలబడుతూ వస్తోంది. వీరు నామమాత్రంగా పోటీ చేస్తున్నారేగానీ ఓటర్లను ఆకర్శించలేకపోతున్నారు. పార్టీకి ఇక్కడ ప్రజల్లో.. ముఖ్యంగా యువతలో కొంత పట్టు ఉన్నప్పటికీ ఓట్ల రూపంలో రాబట్టలేకపోతున్నారు. మొన్నటి ఫలితాలను చూస్తే బీజేపీ అభ్యర్థి నోముల దయానంద్గౌడ్కు కేవలం 15,054 ఓట్లు మాత్రమే వచ్చాయి. రాష్ట్రంలో కొంతమేర బీజేపీ గాలులు వీస్తున్నా.. ఇక్కడ మాత్రం పార్టీ క్యాడర్ను తట్టిలేపేవారులేక ఉసూరుమంటోంది. 2018 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన కొత్త అశోక్గౌడ్కు 17,129 ఓట్లు పోలయ్యాయి. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా బీజేపీ నుంచి పోటీ చేసిన పీవీ శ్యాంసుదర్రావుకు ఈ అసెంబ్లీ సెగ్మెంటులో 17,250 ఓట్లు పోలయ్యాయి. 2014లో టీడీపీతో పొత్తు ఉన్నందున టీడీపీ నుంచి పోటీచేసిన మంచిరెడ్డి కిషన్రెడ్డికే బీజేపీ మద్దతు ఇచ్చింది. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ నుంచి పోటీ చేసిన పోరెడ్డి నర్సింహారెడ్డికి కేవలం 8,200 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అంటే.. ఏ ఎన్నికల్లోనూ డిపాజిట్ దక్కడం లేదు. ఈ ప్రాంతంలో పార్టీకి క్యాడర్ ఉన్నప్పటికీ ఆశించిన మేర ఓట్లు రాబట్టలేకపోవడానికి కారణం నాయకత్వ లోపమేననేది స్పష్టమవుతోంది. మొన్నటి ఎన్నికల్లో పోటీకి మేమంటే మేమంటూ పది మందికిపైగా నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. 2018లోనూ ఇదే పరిస్థితి చోటుచేసుకుంది. టికెట్ కోసం పోటీపడడం తప్ప క్షేత్రస్థాయిలో ప్రచారంలోగానీ క్యాడర్ను కూటగట్టడంలోగానీ పూర్తి వైఫల్యం కనబడుతోంది. ఈ ఎన్నికల్లో ముందుగా మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ ఇక్కడి నుంచి పోటీ చేయాలని భావించారు. నాలుగైదుసార్లు ఆయన పార్టీ ముఖ్య నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేశారు. అయినా, సీనియర్లు చాలా వరకు సమావేశాలకు హాజరుకాకుండా తప్పించుకున్నారు. కారణమేంటంటే పార్టీలో సీనియర్లముండగా మమ్మల్ని సంప్రదించకుండానే సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారనో.. మరో కారణమనోగానీ మొహం చాటేశారు. ఇక్కడి పరిస్థితులను గమనించి నర్సయ్యగౌడ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండడమే మంచిదని భావించారని పార్టీ శ్రేణులే చెప్పాయి. ఈ ఎన్నికల్లో అభ్యర్థి దయానంద్గౌడ్కు ఎవరుకూడా పెద్దగా సహకరించిన పాపాన పోలేదు. 2018లోనూ కొత్త అశోక్గౌడ్ పోటీ చేసినప్పుడుకూడా సీనియర్లమని చెప్పుకునేవారు కొందరు సహకరించకపోవడంతో ఆయన బాధపడిన సందర్భాలున్నాయి. పాతికేళ్ల క్రితం చూస్తే ఇక్కడ పార్టీ బలంగా ఉండింది. స్థానిక సంస్థల్లో కూడా కొంత పట్టు ఉండేది. అలాంటిది ప్రజల్లోకి పోకపోవడం ఎవరికివారు తామే గొప్ప అనే ఆలోచనలతో పార్టీ పరిస్థితి దిగజారుతూ వస్తోంది.
Updated Date - 2023-12-05T23:17:23+05:30 IST