కొత్త ప్రాజెక్టుల వివరాలన్నీ ఇవ్వాలని ఆదేశం
ABN, Publish Date - Dec 18 , 2023 | 02:31 AM
బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీపై శ్వేతపత్రం విడుదల చేసే యోచనలో కాంగ్రెస్ సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది.
మేడిగడ్డపైనా..మేడిగడ్డపైనా శ్వేతపత్రం!
బ్యారేజీ కుంగుబాటుతో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
పూర్తి వివరాలు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి రేవంత్
నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష
కృష్ణా ట్రైబ్యునల్ వద్ద వినిపించాల్సిన వాదనలేంటి?
యాసంగి పంటలకు నీళ్లిచ్చేందుకు చర్యలు చేపట్టండిహైదరాబాద్, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీపై శ్వేతపత్రం విడుదల చేసే యోచనలో కాంగ్రెస్ సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ కుంగిపోవడం, దాని పునర్నిర్మాణం వివాదంగా మారుతున్న నేపథ్యంలో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదలకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు బ్యారేజీ కుంగుబాటు, నిర్మాణ అంశాలు, డిజైన్కు సంబంధించిన అన్ని వివరాలనూ ఇవ్వాలని ఇప్పటికే అధికారులను ఆదేశించింది. ఆదివారం నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు సంబంధించి పూర్తి వివరాలు తనకు ఇవ్వాలని ఆదేశించారు. దీంతోపాటు శ్వేతపత్రం విడుదల చేసేందుకు సిద్ధంగా ఉండాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని వారిని ఆదేశించినట్లు తెలిసింది. ఇప్పటికే గత ప్రభుత్వం అవలంబించిన విధానాలు, ఆర్థిక వ్యవహారాలపై శ్వేతపత్రం విడుదల చేయాలనే యోచనలో కాంగ్రెస్ సర్కారు ఉన్న విషయం తెలిసిందే. తాజాగా మేడిగడ్డ బ్యారేజీ అంశం నేపథ్యంలో మొత్తం నీటిపారుదల శాఖకు సంబంధించి శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేయాలనే ఆలోచనకు ప్రభుత్వం వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. కాగా, హైదరాబాద్లోని తన నివాసంలో నీటిపారుదల శాఖపై సీఎం రేవంత్ నిర్వహించిన ఈ సమీక్షలో ఆ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి, ఈఎన్సీ మురళీధర్, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రస్తుత నీటిపారుదల రంగంపై రేవంత్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇతర రాష్ట్రాలతో జల వివాదాలకు సంబంధించి కృష్ణా ట్రైబ్యునల్ వద్ద వినిపించాల్సిన వాదనలు, భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. అంతర్రాష్ట్ర జలవివాదాలను త్వరగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
అన్ని లెక్కలూ ఇవ్వండి!
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన ప్రాజెక్టుల ఖర్చులకు సంబంధించి పూర్తి వివరాలు తనకు ఇవ్వాలని నీటిపారుదల శాఖ అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. యాసంగి పంటలకు నీళ్లిచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. నీటి లభ్యత, ఇతర అంశాలపైనా పలు సూచనలు చేశారు. కాగా, ఈ సమావేశంలో చర్చించిన అంశాలపై వీలైనంత త్వరగా పూర్తి వివరాలను తనకు అందించాల్సిందిగా అధికారులను సీఎం ఆదేశించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. అంతకుముందు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కూడా ఆ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మేడిగడ్డ ప్రాజెక్టు అంశం, రెండో పంటకు సాగునీరు ఇచ్చే విషయంతోపాటు రాష్ట్రంలో అందుబాటులో ఉన్న నీటిని ఎన్ని ఎకరాలకు అందించగలమనే అంశాలపై ఆయన సమీక్షించారు.
మంత్రులు, ఎమ్మెల్యేల పర్యటన ఎపుడు?
మేడిగడ్డ బ్యారేజీ విషయంలో చట్టసభ సభ్యులకు ఉన్న అపోహలు, అనుమానాలను నివృత్తి చేసేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పరిశీలనకు తీసుకెళ్తామని సీఎం రేవంత్రెడ్డి శనివారం శాసనమండలిలో చెప్పిన విషయం తెలిసిందే. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేల మేడిగడ్డ టూర్ ఎప్పుడు ఉంటుందనే దానిపై చర్చ మొదలైంది. 20వ తేదీ నుంచి మళ్లీ అసెంబ్లీ సమావేశాలు ఉండడంతోపాటు, 21న జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. దీంతో ఈ రెండూ పూర్తయ్యాకే బ్యారేజీ పరిశీలనకు వెళ్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు సమాచారం.
Updated Date - Dec 18 , 2023 | 02:32 AM