ఎంపీ ఎన్నికల శంఖారావం
ABN, Publish Date - Dec 30 , 2023 | 12:09 AM
మళ్లీ రాజకీయ వేడి మొదలైంది. నిన్న మొన్నటి దాక అసెంబ్లీ ఎన్నికల సందడి నెలకొనగా, తిరిగి ఎంపీ ఎన్నికల వేడి రాజుకుంది. ఆయా పార్టీల నుంచి బరిలో నిలిచేందుకు అభ్యర్థులు ఎవరికి వారు తమ ప్రయత్నాలు ముమ్మరం చేయగా, గెలుపు గుర్రాల వేటలో ప్రధాన పార్టీలు తలమునకలయ్యాయి.
నల్లగొండలో కసరత్తు ప్రారంభించిన ఎంపీ లక్ష్మణ్
రేసుగుర్రాల వివరాలు సేకరిస్తున్న కాంగ్రెస్
12న భువనగిరి, 16న నల్లగొండ నేతలతో బీఆర్ఎస్ భేటీ
రంగం సిద్ధం చేసుకుంటున్న ఆశావహులు
ఎంపీ ఎన్నికల సమరం కోసం సన్నాహాలు
(ఆంధ్రజ్యోతిప్రతినిధి-నల్లగొండ): మళ్లీ రాజకీయ వేడి మొదలైంది. నిన్న మొన్నటి దాక అసెంబ్లీ ఎన్నికల సందడి నెలకొనగా, తిరిగి ఎంపీ ఎన్నికల వేడి రాజుకుంది. ఆయా పార్టీల నుంచి బరిలో నిలిచేందుకు అభ్యర్థులు ఎవరికి వారు తమ ప్రయత్నాలు ముమ్మరం చేయగా, గెలుపు గుర్రాల వేటలో ప్రధాన పార్టీలు తలమునకలయ్యాయి. గత అసెంబ్లీ ఎన్నిక ల్లో టికెట్లు రాక కొందరు, కుల సమీకరణ నేపథ్యంలో మరికొందరికి ఆశాభంగం కలిగింది. అయితే ఎంపీ ఎన్నికల్లో తమ రాజకీయ భవిష్యత్ను సుస్థిరం చేసుకునేందుకు నేతలు సంసిద్ధమయ్యారు. ఆయా పార్టీలు ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో సమావేశాలకు ప్రణాళికలు సిద్ధం చేశాయి.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి సరిగ్గా నెలరోజు లు పూర్తికాకముందే రాజకీయపక్షాల్లో పార్లమెంట్ రాజకీయ వేడి మొదలైంది. ఫిబ్రవరి నెలలో నోటిఫికేషన్ వెలువడుతుందన్న సమాచారంతో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఆయా పార్టీల కీలకనేతలు ప్రాథమిక కసరత్తు ప్రారంభించారు. అందరికంటే ముందుగా భారతీయ జనతా పార్టీ శుక్రవారం నల్లగొండలో ఉమ్మడి జిల్లా నేతలతో సమీక్ష పూర్తి చేసింది. మరో ప్రధాన పక్షమైన భారతీయ రాష్ట్ర సమితి నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాల్లో తమ అభ్యర్థులు ఎవరనేది దాదాపు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఆ మేరకు ఆయా నియోజకవర్గ నేతలను సం సిద్ధులను చేసేందుకు జనవరి 12న భువనగిరి, 16న నల్లగొండ నేతలతో భేటీకి ముహుర్తం ఖారారుచేసింది. రాష్ట్రంలో ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మంచి ఉత్సాహంలో ఉంది. ఆ పార్టీ నుంచి టికెట్ దక్కితే చాలు విజయం ఖాయమన్న ప్రచారం ఉండటంతో ఆశావహులు పెద్దఎత్తున పైరవీలు ప్రారంభించారు. సోనియా లేదా ప్రియాంకను నల్లగొండ లేదా భువనగిరి స్థానాల్లో ఒక చోట బరిలో దింపాలంటూ పీసీసీ నేతలు తీర్మానం సైతం చేశారు. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో అందరికంటే ముందుగా కాంగ్రెస్ అధిష్ఠానం ఇన్చార్జిలను సైతం ప్రకటించింది.
నల్లగొండకు అమిత్రెడ్డి, శానంపూడి పేర్లు
నల్లగొండ పార్లమెంటుకు సంబంధించి శాసనమండలి ఛైర్మన్ తనయుడు గుత్తా అమిత్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్దిల పేర్లను ప్రముఖంగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగకపోతే రానున్న నాలుగున్నరేళ్లు అమిత్రెడ్డి ఎదురుచూడాల్సిన పరిస్థితి. కాంగ్రె్సకు కంచుకోటగా ఉన్న నల్లగొండ పార్లమెంట్ పరిధిలో నిలిచి గెలిచే అవకాశం ఉన్నా, లేకపోయినా పోటీకి అమిత్రెడ్డి సిద్ధపడినట్లు సమాచారం. పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసి గెలిస్తే ఫర్వాలేదు, లేదంటే ఏదే ని అసెంబ్లీని కేంద్రంగా చేసుకొని రాజకీయ భవిష్యత్కు పునాదులు వేసుకునేందుకు ఈ పార్లమెంటు ఎన్నిక ఉపయోగపడుతుందని అమిత్రెడ్డి భావిస్తూ అన్ని భారాలు మోసేందుకు సిద్ధపడినట్లు తెలిసింది. మూడుసార్లు ఎంపీగా పనిచేసిన అనుభవం, వివిధ పార్టీల్లోని కీలక నేతలో ఉన్న అనుబంధం నేపథ్యంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిసొచ్చే నేతలతో గుత్తా సుఖేందర్రెడ్డి తన మనసులోని మాటను పంచుకుంటున్నారు. భువనగిరి పార్లమెంటు నుంచి అమిత్ను పోటీ చేయిస్తే కొంత సులువుగా ఉంటుందని గుత్తా అంచనా వేసుకున్నా అక్కడ పైళ్ల శేఖర్రెడ్డి అన్ని విధాలా సమర్ధుడు, నల్లగొండ పార్లమెంటు పరిధిలో అభ్యర్థి కొరత ఉందని అధిష్ఠానం పెద్దలు సూచనలు చేసినట్లు సమాచారం. హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిని నల్లగొండ పార్లమెంటు నుంచి బరిలో దించితే ఎలా ఉంటుందని పార్టీ పెద్దలు ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఓ సమావేశంలో చర్చ చేసినట్లు తెలిసింది.
నల్లగొండలో కసరత్తు ప్రారంభించిన బీజేపీ
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణాలు, రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఆశావహులు, సామాజిక రాజకీయ సమీకరణలు ఎజెండాగా బీజేపీ అనుబంధ సంస్థ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ శుక్రవారం నల్లగొండ జిల్లాకేంద్రంలో ఉమ్మడి జిల్లా నేతలతో సమీక్ష నిర్వహించారు. రాజస్థాన్లో అభ్యర్థులకు రూ.75లక్షలకు మించి ఇవ్వలేదు. అదే తెలంగాణలో ఒక్కో అభ్యర్థికి రూ.2.50కోట్ల నుంచి రూ.5కోట్ల వరకు పార్టీ ఆర్థిక నిధులు సమకూర్చింది అయినా డిపాజిట్లు రాకపోవడానికి కారణాలు ఏ మిటని ఎంపీ లక్ష్మణ్ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇక ఎంపీ ఎన్నికల విషయానికొస్తే నల్లగొండ పార్లమెంటు బరి నుంచి రెడ్డి సామాజిక వర్గానికి, భువనగిరి పార్లమెంటు నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతను బరిలో దించితే మంచిదన్న అభిప్రాయాన్ని నేతలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. భువనగిరి పార్లమెంటు నుంచి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ పేరు ప్రధానంగా పరిశీలనలోకి వచ్చింది. ఆయనతోపాటు గంగిడి మనోహర్రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. నర్సయ్యగౌడ్ గతంలో భువనగిరి నుంచి ఎంపీగా గెలుపొందారు. గౌడ సామాజిక వర్గం ఓట్లు 70వేలకుపైగా ఉన్నాయి, బీఆర్ఎస్ నేతలతోనూ సత్సంబంధాలు ఉన్నాయి. ఇవన్నీ కలిసొస్తాయని నర్సయ్యగౌడ్ లెక్కలు వేసుకుంటున్నారు. ఆది నుంచి పార్టీలో కొనసాగుతూ, బండి సంజయ్ అధ్యక్షునిగా ఉన్న సమయంలో సంగ్రామ యాత్ర ఇన్ఛార్జిగా మనోహర్రెడ్డి విజయవంతమయ్యారు. పార్టీ సూచన మేరకు ఇటీవల మునుగోడు బరి నుంచి తప్పుకొని చలమల కృష్ణారెడ్డికి మద్దతుగా చివరి వరకు ఉన్న నేపఽథ్యంలో విశ్వసనీయతను పార్టీ పెద్దలు పరిగణనలోకి తీసుకుంటారని మనోహర్రెడ్డి విశ్వాసంతో ఉన్నారు. నల్లగొండ స్థానం నుంచి టికెట్ కోసం సీనియర్ నేతలు నూకల నర్సింహారెడ్డి, గోలి మధుసూదన్రెడ్డి, నాగంవర్షిత్రెడ్డిలు పోటీ పడుతుండగా బలమైన అభ్యర్థికోసం పార్టీ పెద్దలు యోచిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే సంకినేని బలమైన అభ్యర్థి అవుతారని ఆశించగా, ఆర్థికంగా భారం మోయలేని ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది. బీఆర్ఎ్సకు చెందిన ఒకరిద్దరు కీలక నేతలు నల్లగొండ ఎంపీ టికెట్ ఆశిస్తూ ఇప్పటికే బీజేపీ పెద్దలకు టచ్లోకి వెళ్లారు. అయితే ఇది బీఆర్ఎస్ అధిష్ఠానాన్ని బెదిరించడానికా? నిజంగానే కాషాయం కండువా కప్పుకుంటారా? వేచి చూద్దామన్న ఆలోచనలో కమలం పార్టీ పెద్దలు ఉన్నారు.
12న భువనగిరి, 16న నల్లగొండ నేతలతో బీఆర్ఎస్ భేటీ
మొన్నటివరకు జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలకు 12చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఉమ్మడి నల్లగొండ గులాబీ పార్టీకి కంచుకోట అన్న సంకేతాలు మా జీ మంత్రి జగదీ్షరెడ్డి నాయకత్వంలో ఇచ్చారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ గాలి పెద్దఎత్తున వీచింది. ఫలితంగా సూర్యాపేటలో జగదీ్షరెడ్డి మి నహా అన్నిచోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. దీంతో రానున్న పార్లమెంట్ ఎన్నికలు గులాబీ పార్టీకి చావో రేవో అన్న పరిస్థితిని తెచ్చిపెట్టాయి. ఫలితంగా బీఆర్ఎస్ అధిష్ఠానం ముందస్తుగా కసరత్తు ప్రారంభించింది. అభ్యర్థులు ఎవరనే అంశంపై ప్రాథమికంగా కసరత్తు ప్రారంభించి వారితో సంసిద్ధతకు సంబంధించి చర్చించినట్లు తెలిసింది. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్మి చాడ కిషన్రెడ్డి, ఉమ్మడి జిల్లా డీసీసీ మాజీ అధ్యక్షుడు సుంకరి మల్లే్షగౌడ్లు టికెట్ ఆశిస్తూ వారి ప్రయత్నాలు ముమ్మరంచేశారు. పార్టీ పెద్దలకు వారి రాజకీయ చరిత్ర, పార్టీకి చేసిన సేవల రికార్డులతో తిరుగుతున్నారు. డీసీసీబీ అధ్యక్ష పదవి ఇస్తామని హామీ ఇచ్చి ఆర్థికంగా భారం మోపారు. ఆ తర్వాత కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం కల్పిస్తామని మొండిచేయి చూపారు. టికెట్ ఇవ్వకపోతే బీసీ సామాజిక వర్గ ఎజెండాతో తిరుగుబాటుకు వెనుకాడనంటూ పార్టీ నేతల ఎదుట మల్లే్షగౌడ్ కుండబద్దలు కొడుతున్నారు. ఈ నేపఽథ్యంలో 12న భువనగిరి, 16న నల్లగొండ పార్లమెంటు పరిధిలోని కీలక నేతలతో బీఆర్ఎస్ అధిష్ఠానం సమావేశం ఖరారు చేసింది. భువనగిరి నుంచి పైళ్ల శేఖర్రెడ్డి సరైన అభ్యర్థిగా పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో మంచి స్పందన వస్తుంది, జనగామలో పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారన్న లెక్కల్లో ఉన్నారు. ఇదిలా ఉంటే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సైతం భువనగిరి పార్లమెంటు నుంచి బరిలో దిగే ఆలోచనలో ఉన్నారు. ఈ మేరకు పార్టీలో చర్చ ప్రారంభమైంది.
రేసుగుర్రాల వివరాలు సేకరిస్తున్న కాంగ్రెస్
తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రికార్డుస్థాయి మెజారిటీలతో విజయం సాధించిన కాంగ్రెస్ నేతలు ఎంపీ ఎన్నికలపై ఉత్సాహంగా ఉన్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లోనే ఒకే జిల్లాలో రెండు ఎంపీ స్థానాలు గెలిచి దేశంలోనే కాంగ్రెస్ పార్టీ రికార్డుల్లో ఉమ్మడి జిల్లా నేతలు నమోదయ్యారు. ఈ ఎన్నికల్లోనూ రికార్డు స్థాయి మెజారిటీలతో అభ్యర్థులను గెలిపిస్తామన్న ధీమాలో మంత్రులు, తాజా మాజీ ఎంపీలు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. రాహుల్ను ప్రధానిగా చూడాలంటే అధిష్ఠానం ఆశలన్నీ తెలంగాణ, కర్ణాటకలపైనే ఉన్నాయి. ఈ పరంపరలోనే అందరికంటే ముందుగా పార్లమెంటు నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిలను ప్రకటించింది. నల్లగొండకు మాజీ ఎంపీ ఉత్తమ్, భువనగిరికి మాజీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు బాధ్యతలు అప్పగించింది. భువనగిరి నుంచి టికెట్ ఆశిస్తున్న పీసీసీ ఉపాధ్యక్షుడు, రేవంత్రెడ్డి ప్రధాన అనుచరుడు చామల కిరణ్కుమార్రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందునుంచే ఈ పార్లమెంటు పరిధిలో పనిచేసుకుంటున్నారు. శాలిగౌరారం ప్రాంతానికి చెందిన కిరణ్రెడ్డి రాహుల్గాంధీ రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో ఆయన బృందంలో సభ్యుడిగా కొనసాగారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి, ఆలేరు నియోజకర్గాల్లో అభ్యర్థుల గెలుపులో కీలక భూమిక పోషించారు. ఇటీవల నాగ్పూర్లో జరిగిన ఓ సమావేశంలో చామల ఎంపీ టికెట్కు సంబంధించి వెంకటరెడ్డి, ఉత్తమ్లతోపాటు రేవంత్రెడ్డిల మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది. తీన్మార్ మల్లన్న భువనగిరి టికెట్ కోసం బలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. చట్టసభల్లో అవకాశం అన్న డిమాండ్తోనే మల్లన్న అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం దక్కలేదు, పార్లమెంటు ఎన్నికల్లో బీసీ సామాజికవర్గం, స్థానికుడినైన తనకు భువనగిరి పార్లమెంటు టికెట్ ఇవ్వాలని మల్లన్న డిమాండ్ చేస్తున్నారు. భువనగిరి ఇన్చార్జి వెంకటరెడ్డిని ఇప్పటికే పలుమార్లు కలిసి హామీ సైతం పొందినట్లు తెలిసింది. రేవంత్రెడ్డితోపాటు పొంగులేటి, రాజగోపాల్రెడ్డి వంటి నేతల మద్దతును ఆయన కూడగట్టుకుంటున్నారు. ఆర్థికంగా తనకు రాష్ట్రవ్యాప్తంగా మద్దతు ఉందని, అధిష్ఠానానికి మల్లన్న వివరించినట్లు సమాచారం. ప్రతీ పార్లమెంటు పరిధిలో రెండు అసెంబ్లీ స్థానాలు బీసీలకు కేటాయించాలని నిర్ణయించినా భువనగిరి పార్లమెంటు పరిధిలో అది సాధ్యం కాలేదు. ఎంపీ అభ్యర్థిగా బీసీని అయిన తనకు అవకాశం ఇవ్వాలని మల్లన్న పార్టీ పెద్దలను కోరుతున్నారు. ఇక నల్లగొండ పార్లమెంట్ విషయానికొస్తే సీనియర్ నేత జానారెడ్డి పెద్దకుమారుడు రఘువీర్రెడ్డి, పటేల్ రమే్షరెడ్డిల పేర్లు ప్రస్తుతం ప్రముఖంగా వినిపిస్తున్నాయి. నల్లగొండ ఎంపీగా పోటీ చేస్తానని మాజీ మంత్రి జానారెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రకటించారు. రేవంత్రెడ్డితో రఘువీర్కు ఆది నుంచి ఉన్న అనుబంధం, జానారెడ్డి రాజకీయ వారసత్వం కలిసిరానున్నాయి. పటేల్ రమే్షరెడ్డికి ఇప్పటికే పలు మార్లు అవకాశాలు చేజారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట టికెట్ త్యాగం చేసిన నేపథ్యంలో ఎంపీ టికెట్ ఇస్తామని మంత్రి ఉత్తమ్ లిఖితపూర్వంగా హామీ ఇచ్చారు.తెలంగాణ నుంచి ఎంపీగా సోనియా పోటీ చేయాలని పీసీసీ తీర్మానం చేయగా ఉత్తరప్రదేశ్ను వదిలి ఆమె రాకపోవచ్చని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. జాతీయ ప్రధాన కార్యదర్మి ప్రియాంక మాత్రం నల్లగొండ, భువనగిరి లేదా ఖమ్మం పార్లమెంటు స్థానాల్లో ఓ చోటు నుంచి పోటీచేసే అవకాశం ఉందని సీఎం రేవంత్రెడ్డి టికెట్ ఆశిస్తున్న నేతలకు స్పష్టం చేస్తూ ‘ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాల్లో జోక్యానికి తాను నేటికీ సుముఖంగా లేను, ఎవరి ప్రయత్నాలు వారు చేసుకోవాల్సిందే, మైదానంలో ఉండి పనిచేసుకోండి’ అని కుండబద్దలు కొట్టినట్లు టికెట్ ఆశిస్తున్న ఓ నేత ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారు.
Updated Date - Dec 30 , 2023 | 12:09 AM