లోక్ అదాలత్తో స్నేహపూర్వక పరిష్కారాలు
ABN, Publish Date - Dec 30 , 2023 | 11:49 PM
లోక్ అదాలత్తో స్నేహపూర్వక పరిష్కారాలు లభిస్తాయని జిల్లా ప్రధాన న్యాయాధికారి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ అధ్యక్షుడు ఏ.జయరాజు అన్నారు. భువనగిరిలోని జిల్లా కోర్టులో శనివారం ఆయన జాతీయ లోక్ అదాలత్ను ప్రారంభించి మాట్లాడారు.
జిల్లా ప్రధాన న్యాయాధికారి జయరాజు
జిల్లాలో 5575 కేసుల పరిష్కారం
భువనగిరి టౌన్, డిసెంబరు 30: లోక్ అదాలత్తో స్నేహపూర్వక పరిష్కారాలు లభిస్తాయని జిల్లా ప్రధాన న్యాయాధికారి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ అధ్యక్షుడు ఏ.జయరాజు అన్నారు. భువనగిరిలోని జిల్లా కోర్టులో శనివారం ఆయన జాతీయ లోక్ అదాలత్ను ప్రారంభించి మాట్లాడారు. క్షణికావేశాలు, అనుకోని ఘటనల నేపథ్యంలో తలెత్తిన వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి జాతీయ లోక్ అదాలత్ సరైన వేదిక అన్నారు. మహా భారతంలో జరిగిన రాజీ వ్యవస్థ నేటికీ ఆదర్శప్రాయమన్నారు. వివాదాలను పరిష్కరించుకున్న కక్షిదారులు తిరిగి వివాదాల జోలికి వెళ్లవద్దని, కుటుంబ సభ్యులతో కలిసి గౌరవ ప్రదమైన జీవితం గడపాలన్నారు. సకాలంలో బిల్లులు, రుణాలు చెల్లిస్తే కోర్టు కేసులకు దూరంగా ఉండవచ్చునన్నారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి కె.మారుతీ దేవి, అదనపు సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయవ సేవ అధికార సంస్థ కార్యదర్శి కె.దశరథరామయ్య, జూనియర్ సివిల్ జడ్జి బి.నాగేశ్వర్రావు, ఏసీపీ ఎస్.వెంకట్రెడ్డి, బార్ అసోసియేషన్ కార్యదర్శి రాజశేఖర్రెడ్డి, పీపీలు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
లోక్ అదాలత్లో 5575 కేసుల పరిష్కారం
జిల్లాలోని అన్ని కోర్టుల్లో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 5,575 కేసులు పరిష్కారమయ్యాయని, రూ.5.74లక్షల బిల్లులు, రుణాల చెల్లింపు జరిగిందని అధికారులు తెలిపారు. పరిష్కారమైన కేసుల్లో 5,523 క్రిమినల్, 18 మంది సివిల్, 30 ప్రీలిటిగేషన్ బిల్లుల చెల్లింపు కేసులు, నాలుగు ఎస్బీఐ కేసులు ఉన్నట్లు అధికారులు వివరించారు.
Updated Date - Dec 30 , 2023 | 11:49 PM