మల్లన్న జాతరొచ్చే..
ABN, Publish Date - Dec 29 , 2023 | 11:52 PM
కొమురవెల్లి మల్లన్న ఆలయంలో జనవరి 7న స్వామివారి కల్యాణంతో మహాజాతర ప్రారంభం కానున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతున్న తొలి జాతర ఇది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో తొలిజాతర
వసతుల కల్పన, ఆలయాభివృద్ధిపై ఆశలు
నేడు సిద్దిపేటలో దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం
చేర్యాల, డిసెంబరు29: కొమురవెల్లి మల్లన్న ఆలయంలో జనవరి 7న స్వామివారి కల్యాణంతో మహాజాతర ప్రారంభం కానున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతున్న తొలి జాతర ఇది. యేటా మూడునెలలపాటు బ్రహ్మోత్సవ జాతర కొనసాగుతుంది. జాతరకు సుమారు 10 లక్షల మంది హాజరవుతారు. ఆలయం పేరుకు పెద్ద అయినప్పటికీ కనీస వసతుల కల్పనకు నోచుకోక భక్తులను సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి.
ఇతోధిక అభివృద్ధికి పాటుపడిన బీఆర్ఎస్ ప్రభుత్వం
గత బీఆర్ఎస్ ప్రభుత్వం మల్లన్న ఆలయాభివృద్ధికి ఇతోధికంగా పాటుపడింది. తెలంగాణ ఆవిర్భావం అనంతరం జరిగిన తొలి కల్యాణానికి అప్పటి సీఎం కేసీఆర్ పట్టువస్త్రాలను తీసుకొచ్చారు. కొమురవెల్లి మల్లన్న పేరిట మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టారు. ప్రాజెక్టులోకి నీటిని విడుదల చేయడంతో గోదావరి జలాలను తీసుకువచ్చి మల్లన్నకు అభిషేకించారు. ఆలయాభివృద్ధికి రూ.10కోట్లు సీడీఎఫ్ నిఽధులు మంజూరు చేశారు. అఽధికారులు, కాంట్రాక్టర్ల వైఖరితో ఆశించిన మేర రూపుదిద్దుకోలేదు.
అతీగతీలేని అభివృద్ధి పనులు
మాజీ సీఎం కేసీఆర్ సీడీఎఫ్ ద్వారా మంజూరు చేసిన రూ.10 కోట్లతో బండగుట్టపై 50 గదులసత్రం పనులు చేపట్టారు. కానీ ఐదేళ్లు కావస్తున్నా భవనం పనులు పూర్తి కాలేదు. 75గదుల భవన సమయుదాయ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించినా మోక్షం లేదు. రూ.11కోట్లతో క్యూకాంప్లెక్స్ భవనం పను లు, ఎల్లమ్మగుట్టపై త్రిశూలం, ఢమరుకం పనులు ఇంకా సాగుతున్నాయి.
గెస్ట్హౌజ్ పేరిట కోట్లాది రూపాయలు వృఽథా
మాజీమంత్రి తలసాని శ్రీనివా్సయాదవ్ గెస్ట్హౌజ్ నిర్మాణానికి చాన్నాళ్ల క్రితం హామీ ఇచ్చారు. అనువైన స్థలం ఉన్నప్పటికీ ఆలయ సమీపంలోని దాసారంగుట్టపై నిర్మించాలని నిర్ణయించారు. గుట్టపైకి అప్రోచ్రోడ్ కోసం ముందస్తుగా రూ.1.40 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసినప్పటికీ రానురాను వ్యయం రూ.9కోట్లకు చేరింది. ఇప్పటివరకు రూ.4.38 కోట్ల ఆలయం నిధులు చెల్లించారు. మరో రూ.1.40కోట్లు చెల్లింపు మిగిలి ఉంది. అయినప్పటికీ పనులు అతీగతీలేకుండా మారాయి.
అమ్మవార్లకు స్వర్ణకిరీటం ఏర్పాటులో నిర్లక్ష్యం
భక్తులు సమర్పించిన బంగారు కానుకల ద్వారా మల్లన్నకు గతేడాది కల్యా ణం రోజున స్వర్ణకిరీటాన్ని చేయించారు. మిగిలిన బంగారంతో స్వామివా రి పక్కన కొలువైన కేతలమ్మ, మేడలాదేవీలకు బంగారు కిరీటం చేయిస్తామని ప్రకటించారు. వారంలో కల్యాణం ఉన్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
రైల్వేస్టేషన్ మంజూరైనా
కొమురవెల్లి శివారు మీదుగా కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వేలైన్ నిర్మాణం పూర్తికావడంతో స్థానికంగా రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలన్న భక్తుల కోరిక మేరకు కేంద్రం స్పందించి హాల్ట్స్టేషన్కు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల రైల్వే డీఆర్ఎం తదితరులు మల్లన్నసన్నిధిలో మంజూరు ప్రకటన చేశారు. టెండర్ ప్రక్రియ పూర్తయిందని, పనులు ప్రారంభిస్తామన్నారు. ఆ తర్వాత ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.
పట్టాపాసుబుక్కులకు నోచుకోని మల్లన్న
2014లో అప్పటి సీఎం కొమురవెల్లికి రావడంతో కొమురవెల్లి, కిష్టంపేట, వేచరేణి, రాంసాగర్, గౌరాయపల్లి గ్రామాల్లోని 166 ఎకరాల ప్రభుత్వ భూమిని పట్టాచేయాలని ఆదేశించారు. కానీ 133 ఎకరాల మేర భూమిని తహసీల్ రికార్డులలో చేర్చినా ఇప్పటికీ హద్దులు ఏర్పాటు కాకపోగా స్వామివారి పేరిట పట్టాదారు పాసుబుక్కులు అందించలేదు.
నేడు తొలిసారి దేవాదాయశాఖ మంత్రి సురేఖ సమీక్షపై ఆశలు
జాతర ఏర్పాట్లపై సమాయత్తం చేసేందుకు నేడు దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ దుద్దెడలోని మినర్వా హోటల్లో సమావేశం నిర్వహి ంచనున్నారు. ఈక్రమంలో తొలిసారి దేవాదాయశాఖ మంత్రి సమీక్షిస్తున్న క్రమంలో ఆలయాభివృద్ధి, వసతి కల్పనకు చొరవ వహించాలని భక్తులు కోరుతున్నారు.
Updated Date - Dec 29 , 2023 | 11:52 PM