ఇలాగైతే నడిచేదెలా?
ABN, Publish Date - Dec 17 , 2023 | 10:49 PM
ఫుట్పాత్లను వ్యాపారాలకు, పార్కింగ్ కోసం ఉపయోగిస్తుండడంతో పాదాచారులకు నడవడానికి దారి లేకుండా పోయింది.
సిద్దిపేట పట్టణంలో పాదాచారులకు పనికిరాని ఫుట్పాత్లు
చిరు వ్యాపారాలు, పార్కింగ్కు అడ్డాగా మారిన వైనం
పట్టించుకోవాల్సిన మున్సిపల్ అధికారులది వింత ధోరణి
ఖాళీ చేయించకపోగా వ్యాపారుల నుంచి తైబజార్ పేరిట వసూలు
స్ట్రీట్ వెండర్స్ కోసం గతంలో నిర్మించిన దుకాణాలు వృథా
సిద్దిపేట టౌన్, డిసెంబరు 17 : జిల్లా కేంద్రమైన సిద్దిపేట పట్టణానికి స్థానిక ప్రజలతో పాటు గ్రామాలు, ఇతర జిల్లాల నుంచి వచ్చే వారితో నిత్యం రద్దీగా ఉంటుంది. ట్రాఫిక్ అధికంగా ఉన్నప్పుడు పాదాచారులు నడవడానికే ఇబ్బందిగా మారింది. ముందుచూపుతో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు సూచనమేరకు హైదరాబాద్, మెదక్, కరీంనగర్ రోడ్డుల్లో మున్సిపల్ అధికారులు ఫుట్పాత్లను నిర్మించినా ప్రయోజనం లేకుండా పోయింది. వాటిని వ్యాపారాలకు, పార్కింగ్ కోసం ఉపయోగిస్తుండడంతో పాదాచారులకు నడవడానికి దారి లేకుండా పోయింది.
యథేచ్ఛగా ఫుట్పాత్ల ఆక్రమణ
సిద్దిపేట పట్టణంలో నిర్మించిన ఫుట్పాత్లపైనే టిఫిన్ సెంటర్లు, మెకానిక్, వెల్డింగ్, పండ్లు దుకాణాలు, గప్చుప్ బండ్లు, కర్రీస్ పాయింట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, కూరగాయలను విక్రయిస్తున్నారు. వాటిని పూర్తిగా ఆక్రమించి వ్యాపారం కొనసాగిస్తుండటంతో పలుచోట్ల ఫుట్పాత్లు ధ్వంసమవుతున్నాయి. అంతేకాకుండా పలు దుకాణదారుల యజమానులు తమ వాహనాలు వెళ్లేందుకు ఫుట్పాత్లపైకి దారులు చేసుకొని అక్కడే దర్జాగా పార్కింగ్ చేసుకుంటున్నారు. కొన్ని షాపింగ్మాల్లలో సెల్లార్లో పార్కింగ్ ఉన్నప్పటికీ రోడ్డుపైనే పార్కింగ్ చేస్తున్నారు.
చర్యలు తీసుకోకుండా తైబజార్ వసూలు
లక్షలాది రూపాయలతో నిర్మించిన ఫుట్పాత్లను ఆక్రమించేస్తున్నా పరిరక్షించాల్సిన మున్సిపల్ అధికారులు ఏమి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. పట్టణంలోని మెదక్రోడ్డు, హైదరాబాద్ రోడ్డులో పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. చిరువ్యాపారులు ఫుట్పాత్లను కేరాఫ్ అడ్ర్సగా మార్చుకుంటున్నారు. మున్సిపల్ అధికారులే ఫుట్పాత్లపై విక్రయించే చిరు వ్యాపారుల నుంచి తైబజార్ పేరిట వసూలు చేయడం గమనార్హం. ప్రతీరోజు టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్పుడ్, రాత్రి పూట టిఫిన్ సెంటర్లు, పండ్ల దుకాణాలకు రూ.50, గప్చుప్, రోడ్డుపైన విక్రయిస్తున్న వారి నుంచిరూ.20, కూరగాయలు అమ్మేవారి నుంచి రూ.10 వసూలు చేస్తున్నారు. తైబజార్ పేరిట వసూలు చేస్తుండటంతో వ్యాపారులు యథేచ్ఛగా ఫుట్పాత్లను ఆక్రమించేశారు. పట్టణంలో 2023-2024 ఆర్థిక సంవత్సరానికిగానూ తైబజార్ పేరిట మున్సిపల్కు రూ. 6.30 లక్షల ఆదాయం సమకూరింది.
చిరు వ్యాపారాలకు నిర్మించిన దుకాణాలు వృథా
కాగా సిద్దిపేట పట్టణంలో చిరు వ్యాపారుల కోసం కొన్నేళ్ల క్రితం మున్సిపల్ అధికారులు స్థానిక ముస్తాబాద్ చౌరస్తా వద్ద 40 స్ట్రీట్ వెండర్ దుకాణాలను నిర్మించారు. మొదట్లో బాగానే ఉన్నా ఒకరిని చూసి మరొకరు తిరిగి పట్టణంలో పలుచోట్ల ఫుట్పాత్లపైన తమ వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. దీంతో వేలాది రూపాయలతో నిర్మించిన దుకాణాలు (స్టాళ్లు) వృథాగా మారాయి.
రద్దీ ఉన్న ప్రాంతంలోనే గిరాకీ
సిద్దిపేట పట్టణంలో రద్దీ ఉన్న ప్రాంతంలోనే గిరాకీ ఎక్కువగా ఉంటుంది. పట్టణంలోని స్థానిక ముస్తాబాద్ చౌరస్తా వద్ద అధికారులు ఏర్పాటు చేసిన స్ర్టీట్ వెండర్ దుకాణాలను చిరు వ్యాపారులకు కేటాయించినప్పటికీ అక్కడ గిరాకీ కావడం లేదు. దీంతో జనసంచారం ఎక్కువ ఉన్న చోటుకు వచ్చి వ్యాపారం చేసుకుంటున్నారు. పట్టణంలో ఒకేచోట పండ్లు, పూలు, ఇతర వాటిని అమ్ముకునేందుకు ఒక మార్కెట్ను నిర్మించాలని కోరుతున్నా.
- మహమ్మద్ షాదుల్లా, చిరు వ్యాపారీ
ఫుట్పాత్లు కనిపించడం లేదు
సిద్దిపేటలో పాదచారుల కోసం నిర్మించిన ఫుట్పాత్లు కనిపించడం లేదు. వాటిని ఆక్రమించినా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు. పండ్ల దుకాణాలు, బైక్ మెకానిక్లు, ఇతర వ్యాపారులు యథేచ్ఛగా కబ్జా చేస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. ప్రజల కోసం ఏర్పాటు చేసిన వసతులను సంరక్షించడంలో అధికారులు నిర్లక్ష్యంగా ఉండటంతోనే రెచ్చిపోతున్నారు.
- అభిలాష్, స్థానికుడు
Updated Date - Dec 17 , 2023 | 10:49 PM