హ్యాపీ క్రిస్మస్
ABN, Publish Date - Dec 24 , 2023 | 11:16 PM
ప్రఖ్యాతిగాంచిన మెదక్ సీఎ్సఐ చర్చి క్రిస్మస్ వేడుకలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. కరుణామయుని నిలయంలో ప్రార్థనలకు సీఎ్సఐ మెదక్ డయాసిస్ ఘనంగా ఏర్పాట్లు చేసింది. చర్చిని రంగురంగుల విద్యుద్దీపాలతో సుందరంగా అలకంరించారు. రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, విదేశాల నుంచి భక్తులు తరలిరానున్నారు.
కరుణామయుడి వేడుకలకు మహాలయం ముస్తాబు
విద్యుద్దీపాలతో కాంతులీనుతున్న మెదక్ సీఎ్సఐ చర్చి
బిషప్ పద్మారావు ఆధ్వర్యంలో ఆరాధన కార్యక్రమాలు
తెల్లవారుజామున 4.30 గంటలకు శిలువ ఊరేగింపు
దైవసందేశం ఇవ్వనున్న రెవరెండ్ డా.శాంతయ్య
535 మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు
మెదక్ కల్చరల్/మెదక్ అర్బన్, డిసెంబరు 24: ప్రఖ్యాతిగాంచిన మెదక్ సీఎ్సఐ చర్చి క్రిస్మస్ వేడుకలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. కరుణామయుని నిలయంలో ప్రార్థనలకు సీఎ్సఐ మెదక్ డయాసిస్ ఘనంగా ఏర్పాట్లు చేసింది. చర్చిని రంగురంగుల విద్యుద్దీపాలతో సుందరంగా అలకంరించారు. రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, విదేశాల నుంచి భక్తులు తరలిరానున్నారు.
శిలువ ఊరేగింపుతో ప్రార్థనలు ప్రారంభం
ప్రాతఃకాల ప్రార్థనలతో క్రిస్మస్ వేడుకలు ప్రారంభంకానున్నాయి. తెల్లవారుజామున 4 గంటల నుంచి ప్రత్యేక ఆరాధన కార్యక్రమాలు కొనసాగుతాయి. ఉదయం 4:30 గంటలకు శిలువ ఊరేగింపుతో మొదటి ఆరాధన ప్రారంభమవుతుంది. అనంతరం బిషప్ పద్మారావు వాక్యోపదేశం చేయనున్నారు. ఉదయం 9:30 గంటలకు రెండో ఆరాధన నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో చర్చి ప్రెసిబిటరి ఇన్చార్జి రెవరెండ్ డా.శాంతయ్య దైవసందేశం వినిపించనున్నారు. భక్తులకు దీవెనలిచ్చేందుకు మతగురువులు డేవిడ్ రిచర్డ్స్, శ్రీనివాస్, జైపాల్, సువర్ణరత్నంతోపాటు హైదరాబాద్ వేద కళాశాలకు చెందిన 12 మంది పాస్టర్లు తరలివచ్చారు. సీఎస్ఐ చర్చిలో వేడుకలకు ప్రముఖులు హాజరవనున్నారు.
అద్భుత కట్టడానికి 99 ఏళ్లు పూర్తి
మహోన్నత ఉద్దేశంతో నిర్మించిన మహాలయం కట్టడానికి నేటితో 99 ఏళ్లు పూర్తయ్యాయి. కరువుకాటకాలతో అల్లాడుతున్న ఈ ప్రాంతంలో ఆకలిని తీర్చడానికి పనికి ఆహారం పథకం కింద 12వేల మంది కూలీలతో పదేళ్ల పాటు శ్రమించి అద్భుత రీతిలో మెదక్ సీఎ్సఐ చర్చిని నిర్మింపజేశారు. శతాబ్ది వేడుకలకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది పొడవునా సంబరాలను నిర్వహించేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు.
కమాండ్ కంట్రోల్ ద్వారా డ్రోన్, సీసీ కెమెరాల నిఘా
మెదక్ సీఎ్సఐ చర్చి జాతరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ ఆదివారం తెలిపారు. భక్తులకు ఆటంకం కలుగకుండా, వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణకు పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. నేటి నుంచి మూడు రోజుల పాటు జరిగే జాతరకు చర్చి వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కమాండ్ కంట్రోల్ ద్వారా డ్రోన్, సీసీ కెమెరాలతో నిఘాను ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 4 సెక్టార్లుగా బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. ముగ్గురు డీఎస్పీలు, 14 మంది సీఐలు, 56 మంది ఎస్ఐలు, 83 మంది హెడ్కానిస్టేబుళ్లు, 175 మంది కానిస్టేబుళ్లు, 75 మంది మహిళా కానిస్టేబుళ్లు, 129 హోంగార్డులు, 8 ఆక్సెస్ కంట్రోల్ టీంలు, నాలుగు డే బైనాకులర్ టీంలు, రెండు రోప్ పార్టీలు, స్పెషల్ పార్టీలు, ఏఆర్ సిబ్బంది మొత్తం 535 మందితో బందోబస్తు విధులు నిర్వహించనున్నట్లు అదనపు ఎస్పీ పేర్కొన్నారు. కంట్రోల్ రూం నం. 8712657878 ఏర్పాటు చేశామన్నారు. జాతరలో చిన్న పిల్లలు తప్పిపోయినట్లయితే చర్చి మెయిన్ గేట్ ఎదుట కంట్రోల్ రూంలో వివరాలు తెలుపాలన్నారు. ఈ సందర్భంగా ఏఎస్పీ జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
Updated Date - Dec 24 , 2023 | 11:16 PM