పరిహారం అందేనా?
ABN, Publish Date - Dec 17 , 2023 | 12:14 AM
ఘనపూర్ ఆనకట్ట ఎత్తు పెంపుతో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేసిన తరువాత నాలుగేళ్ల వరకు నిధుల ఊసే లేదు.
‘ఘనపూర్’ ముంపు బాధితుల ఎదురుచూపులు
రైతులకు అందాల్సిన పరిహారం రూ.13.10 కోట్లు
ఇప్పటి వరకు చెల్లించింది రూ.5 కోట్లు మాత్రమే
మంజూరయి రెండేళ్లు కావస్తున్నా అందని పరిహారం
కొత్త ప్రభుత్వంపై బాధితుల ఆశలు
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్, డిసెంబరు 16 : ఘనపూర్ ఆనకట్ట ఎత్తు పెంపుతో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేసిన తరువాత నాలుగేళ్ల వరకు నిధుల ఊసే లేదు. ఎట్టకేలకు గతేడాది మార్చిలో (20 నెలల కిత్రం) నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం జీవో జారీ చేసింది. కానీ ఇప్పటివరకు నిధుల విడుదలకు సంబంధించి ఆర్థికశాఖ నుంచి మాత్రం ఇప్పటి వరకు క్లియరెన్స్ రాలేదు. పరిహారం డబ్బులు కలెక్టర్ అకౌంట్లో జమ కాలేదు. ఈ విషయమై గతంలో అప్పటి ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు, మాజీ ఎమ్మెల్యే మదన్రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే సునీతారెడ్డిని కలిసినా ఫలితం లేకుండా పోయిందని భూ నిర్వాసితులు చెబుతున్నారు.
318 ఎకరాల్లో ముంపు
మెదక్ జిల్లాలోని ఏకైక మధ్యతరహా నీటి ప్రాజెక్ట్ ఘనపూర్ ఆనకట్ట నీటి నిల్వ సామర్థ్యం 0.2 టీఎంసీలు. పూడిక పేరుకుపోవడంతో సామర్థ్యం 0.135 టీఎంసీలకు తగ్గింది. ఆయకట్టు భూముల సాగుకు ఇబ్బంది కలుగుతుండడంతో ఆనకట్ట ఎత్తును 1.725 మీటర్లు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు 2015లో ఆనకట్ట ఎత్తు పెంపు పనులకు రూ. 43.64 కోట్లు మంజూరు చేసింది. ఇందులో భాగంగా ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సర్వే చేశారు. పాపన్నపేట మండలం నాగ్సాన్పల్లి, శేరిపల్లి, కొడపాక, గాజులగూడెం గ్రామాల పరిధిలో 271 మంది రైతులకు చెందిన 256 ఎకరాలు, కొల్చారం మండలం చిన్నఘనపూర్, సంగాయిపేట గ్రామాల్లో 95 మంది రైతులకు చెందిన 62.26 ఎకరాలు ముంపునకు గురవుతున్నట్లు అధికారులు గుర్తించారు.
నిధులు రాక తీవ్రజాప్యం
ప్రాజెక్ట్లో ముంపునకు గురయ్యే రైతులకు పరిహారంగా ఇచ్చేందుకు రూ. 13 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. అయితే ప్రభుత్వం రూ. 5కోట్లు మాత్రమే మంజూరు చేయడంతో కొందరికి మాత్రమే పరిహారం అందింది. మరో రూ. 8 కోట్లు మంజూరు చేయకపోవడంతో భూసేకరణ ప్రక్రియ పెండింగ్లో పడింది. 2019లో ప్రభుత్వానికి మరోసారి ప్రతిపాదనలు పంపించారు. గతేడాది మార్చిలో రూ. 8.10 కోట్లు మంజూరయ్యాయి. దీంతో మిగతా రైతులు కూడా తమకు పరిహారం అందుతుందని ఆశించారు. కానీ 20 నెలలు గడిచినా ఆర్థిక శాఖ నుంచి అనుమతి రావడం లేదు.
పరిహారం ఇంకెప్పుడిస్తరో!
- మధుసూదన్రెడ్డి, రైతు, చిన్నఘనపూర్, కొల్చారం మండలం
ఘనపూర్ ఆనకట్ట కోసం మా భూమిని ఇచ్చాం. అధికారులు హద్దులు కూడా పాతారు. కానీ పరిహారం మాత్రం ఇంకా ఇవ్వలేదు. ఎకరాకు రూ. 13 లక్షల పరిహారం డిమాండ్ చేస్తే.. రూ. 7.10 లక్షల చొప్పున ఇస్తామని ఒప్పుకున్నారు. మార్కెట్ విలువతో పోల్చుకుంటే అది మాకు తీవ్ర నష్టం. ఆనకట్ట ఎత్తు పెంపుతో ముంపునకు గురవుతాయని మా భూముల్లో మార్కింగ్ చేశారు. కానీ ఇంతవరకు పరిహారం ఇవ్వడం లేదు. అత్యవసర సమయాల్లో భూమిని అమ్ముదామంటే ముంపు భూములని ఎవరూ కొనడం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని కోరుతున్నాం.
Updated Date - Dec 17 , 2023 | 12:14 AM