వెలుగుల వేడుక
ABN, First Publish Date - 2023-11-11T23:33:03+05:30
దీపావళి అంటే దీపాల వరుస.. కష్టాల చీకట్లను తొలగించి సుఖ సంతోషాలను కలిగించే పండుగ.
దీప కాంతి.. పటాకుల మోత
నేడే దీపావళి పండుగ
వైభవంగా జరుపుకునేందుకు సిద్ధమైన ప్రజలు
ఎల్లుండి నుంచి కార్తీకమాసం ప్రారంభం
మెదక్ అర్బన్, నవంబరు 11: దీపావళి అంటే దీపాల వరుస.. కష్టాల చీకట్లను తొలగించి సుఖ సంతోషాలను కలిగించే పండుగ. హిందువుల ముఖ్యమైన పర్వదినాల్లో దీపావళి ఒకటి. శ్రీకృష్ణుడు ప్రజలను హింసించే నరకాసురుని సంహరించి ఆనంద దీపాలను వెలిగించిన రోజున ప్రజలు దీపావళి వేడుకలు జరుపుకుంటున్నారు. ఈరోజు వ్యాపార సముదాయాల వద్ద లక్ష్మీదేవికి పూజలు నిర్వహించడం అనవాయితీ. చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ ఆనందోత్సాహాల నడుమ పండుగ జరుపుకుంటారు. చీకటి పడగానే మహిళలు దీపాలు వెలిగిస్తే పిల్లలు, యువత పటాకులు కాల్చి ఆనందిస్తారు.
రుతువులు మారే సమయం
నిజానికి దీపావళి రుతువులు మారే సమయంలో వస్తుంది. వర్షాలు వెనుకబడి, వ్యవసాయ పనులు ముగుస్తాయి. రైతులు పనిముట్లను శుభ్రం చేసి పక్కనపెడతారు. రాబోయే చలిని తట్టుకునేందుకు అంతా సిద్ధమవుతారు. బంధువులంతా ఒకచోటుకు చేరుతారు. కొత్తగా పెళ్లిళ్లు చేసిన కుటుంబాల్లో కూతురుని, అల్లుడిని ఆహ్వానించి కానుకలు ఇస్తారు. రకరకాల పిండివంటలతో సేదదీరుతారు. నోములయ్యాక ఇంటి ఎదుట దీపాలు వెలిగించి, పటాకులు కాల్చుతూ.. చిన్నాపెద్దా కేరింతలు కొడతారు.
లక్ష్మీపూజలు
దీపావళి రోజు సిరిసంపదలకు చిహ్నమైన లక్ష్మీదేవిని పూజిస్తారు. చీకట్లు అలుముకుంటుండగా.. ప్రతి ఇంటా దుకాణాల్లో లక్ష్మీ గణపతి పూజ మొదలుపెడతారు. భోగభాగ్యాలను ప్రసాదించుమని వేడుకుంటారు. అటుపై పటాకులు కాల్చుతారు. దాంతో అప్పటి వరకు అంధకారం అలుముకున్న ఆకాశంలో దివ్వ కాంతులు పూస్తాయి. చూసే అందరి మనస్సులూ ఆనందడోలికల్లో తేలియాడుతాయి.
కార్తీక మాసం
కార్తీకమాసం దైవ సంబంధికమైన వ్రతాలకు, నోములకు, ఉపవాసాలకు, శుభ కార్యాలకు ఎంతో ముఖ్యమైనది. శివకేశవులకు ఇష్టమైన ఈ మాసంలో దీపారాధన ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ నెల 14 మంగళవారం నుంచి పవిత్ర కార్తీకమాసం ప్రారంభం కానున్న సందర్భంగా జిల్లాలోని శివాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతీ దేవాలయాన్ని దీపాలతో అలంకరిస్తారు. కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కార్తీక పౌర్ణిమ రోజున తులసి పూజలు చేస్తారు.
మార్కెట్లలో సందడి
మెదక్కల్చరల్/సంగారెడ్డిరూరల్, నవంబరు 11: మార్కెట్లలో దీపావళి సందడి నెలకొన్నది. జిల్లాకేంద్రాలైన సంగారెడ్డి, మెదక్ పట్టణాలతో పాటు మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లో శనివారం దీపావళి సందడి నెలకొన్నది. పండుగ మార్కెట్లు రద్దీగా మారాయి. పండగకు కావలసిన పూలు, గుమ్మడికాయలు, మిఠాయిలు తదితర సామగ్రి కొనుగోలు చేశారు. ఇళ్లలో, వ్యాపార, వాణిజ్య కేంద్రాల్లో లక్ష్మీ పూజలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇళ్లను, వ్యాపార సంస్థలను పూలు, విద్యుద్దీపాలతో అందంగా అలంకరిస్తున్నారు. మహారాష్ట్ర, గుజరాత్ తదితర రాష్ట్రాల నుంచి అందమైన ఆకృతుల్లో తయారుచేసిన దీపాలను దిగుమతి చేసుకొని విక్రయిస్తున్నారు. మరోవైపు పండుగ సందర్భంగా పూలు, పటాకుల ధరలు అమాంతం పెరిగాయి.
Updated Date - 2023-11-11T23:33:05+05:30 IST